చివరి ఆయకట్టు వరకు సాగు నీరు అందించాలి : మంత్రి పువ్వాడ

by Sridhar Babu |
చివరి ఆయకట్టు వరకు సాగు నీరు అందించాలి : మంత్రి పువ్వాడ
X

దిశ, ఖమ్మం : నీటిపారుదల శాఖ అధికారులు చిట్ట చివరి ఆయకట్టుకు సాగు నీరు అందేలా పటిష్ట చర్యలు చేపట్టాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. బుధవారం ఐడీఓసీలోని సమావేశ మందిరంలో నీటిపారుదల, వ్యవసాయ, విద్యుత్ శాఖల అధికారులతో యాసంగి (రబీ) సీజన్ లో సాగునీటి సరఫరాపై జిల్లా నీటిపారుదల సలహా మండలి సమావేశాన్ని మంత్రి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నుండి పాలేరు రిజర్వాయర్ లోకి ఇప్పటికి 19 టీఎంసీల నీరు వచ్చినట్లు తెలిపారు. గత యాసంగిలో 1.72 లక్షల ఎకరాల ఆయకట్టు ఉండగా, అది ప్రస్తుతం 2.25 లక్షల పైచిలుకుకు పెరిగింది. ప్రస్తుత యాసంగికి సాగునీటి సరఫరాకి ప్రణాళికాబద్ధంగా కార్యాచరణ చేయాలన్నారు. నాగార్జునసాగర్ లో తగినంత నీరు ఉందని, అవసరం మేరకు నీటి సరఫరా ఉంటుందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు.

హెడ్ ఎండ్ లో ఉన్న రైతులు, చివరి ఆయకట్టు రైతుకు నీరు చేరేలా సహకారం అందించాలన్నారు. నీటిపారుదల అధికారులకు ఈ విషయమై సహకరించాలని, ఈ దిశగా రైతులకు పూర్తి అవగాహన కల్పించాలని కోరారు. నీటిపారుదల, వ్యవసాయ, విద్యుత్ శాఖల మధ్య సమన్వయం ఉండాలన్నారు. నీటిపారుదల శాఖ అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ వారి పరిధిలో క్షేత్ర స్థాయిలో అందుబాటులో ఉంటూ చురుకుగా ఉండాలని, ఏ సమస్య ఎదురైనా పరిష్కరించే విధంగా సిద్ధంగా ఉండాలని సూచించారు. ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ మాట్లాడుతూ నీటిపారుదల శాఖలో పెద్ద సంఖ్యలో సిబ్బంది ఉన్నట్లు, శాఖలో సమన్వయ లోపం తలెత్తకుండా చూడాలన్నారు. పాలేరు రిజర్వాయర్ నుండి చివరి ఆయకట్టుకు నీరు అందే క్రమంలో తరుగును ముందే తీసి, మిగతా నీటిని పంపిణీ చేయాలని కోరారు. రైతులు ఎంతో వ్యయ ప్రయాసాలకోర్చి సాగు చేస్తారని, పంటకు నీరు రాకపోతే నష్టపోతారని, సైన్టిఫిక్ గా నీటిని కేటాయించాలన్నారు.



Next Story