అవినీతి కొండ.. భద్రాద్రి జిల్లాలో లంచగొండి మైనింగ్ అధికారి

by samatah |   ( Updated:2023-06-09 05:39:34.0  )
అవినీతి కొండ.. భద్రాద్రి జిల్లాలో లంచగొండి మైనింగ్ అధికారి
X

దిశ ప్రతినిధి, కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో మైనింగ్ అధికారిగా పనిచేస్తున్న ఒక అధికారి అవినీతి బాగోతం చర్చనీయాంశంగా మారింది. తాను అడుగు బయట పెట్టాడు అంటే కాసుల వర్షం కురవాల్సిందేనట. ఇసుక, కంకర ఏదేమైనా సారు చెప్పినంత చలానా కట్టాల్సిందేనట. కట్టిన చలానాకు రసీదు అడిగితే ఇక అంతే సంగతులు. మామూలుగా అయితే రూ.30వేలతో పోతుంది. రసీదు అడిగితే రూ.60వేలు అవుతుంది ఏది కావాలో మీ ఇష్టం అంటూ తనదైన శైలిలో వసూలు చేస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నాడు. తాను అక్రమంగా వసూలు చేస్తున్న ప్రతి రూపాయిలో సగభాగం పంపకాలకే పోతుందని, వసూలు చేసిన వారి వద్ద బాహాటంగానే చెప్పడం విశేషం. ఇంత జరుగుతున్నా అతడిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.

ప్రతి నెల లక్షల్లో జీతాలు పుచ్చుకుంటూ రాజభోగాలు అనుభవించే అధికారులు కొందరు అడ్డదారిన వచ్చే సంపాదనకు అలవాటు పడి కాసుల సంపాదనే కర్తవంగా భావిస్తూ విధులను దుర్వినియోగం చేస్తూ కోట్లను గడించడంలో ముందు వరుసలో నిలబడుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లో పనిచేస్తున్న కొంతమంది ఉన్నతాధికారులను చూస్తుంటే.ఒకవైపు లక్షల్లో జీతాలు విలాసవంతమైన కార్లు నడిపే డ్రైవర్లు అబ్బో ఒకటా రెండా ప్రభుత్వం నుంచి అనేక సదుపాయాలు పొందుతున్నా కొంతమంది అధికారులు.కాసుల కక్కుర్తి కి బ్రాండ్ అంబాసిడర్‌గా నిలుస్తున్నారు.

చర్యలు లేవు..

సాధారణంగా ఒక శాఖలో ఉన్నతాధికారిగా వ్యవహరిస్తున్న ఏ అధికారి అయినా తన విధుల పట్ల నిబద్దతతో వ్యవహరించడంతో పాటు శాఖాపరమైన ఒడిదుడుకులను ఎదుర్కొని సదరు శాఖలో పని చేస్తున్న ఉద్యోగులందరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తారు. కానీ ఒక అధికారి తీరు దీనికి పూర్తి భిన్నంగా గోచరిస్తుంది. ప్రతి నెల తీసుకుంటున్న లక్షల వేతనం, విలాసవంతమైన సదుపాయాలు సరిపోవు అన్నట్లు లక్షల్లో వసూళ్లకు పాల్పడుతున్నాడు. తనకున్న అధికారమే పెట్టుబడి, అనుచర ఘనమే ఆదాయ మార్గంగా వ్యవహరిస్తూ వసూళ్లకు పాల్పడుతున్నాడు. అక్రమంగా వచ్చిన సంపాదనలో సగభాగం జిల్లా ఉన్నతాధికారులకు సమర్పించాలి వారి ఒత్తిడి తట్టుకోలేకనే అనధికార వసూళ్లకు పాల్పడుతున్నాను అంటూ ఆ అధికారి అనేక సందర్భాల్లో బాహాటంగానే మాట్లాడడం విశేషం.

అధికారి పైన వార్తా పత్రికల్లో అనేక కథనాలు వచ్చినాప్పటికీ ఉన్నతాధికారులు ఎటువంటి విచారణ జరిపించకపోవడం అనేక అనుమానాలకు తావిచ్చే అంశంగా మారింది. తన కార్ డ్రైవర్ కం అటెండర్‌గా వ్యవహరిస్తున్న ఒక వ్యక్తి ద్వారా వసూళ్లకు పాల్పడుతున్నారని వార్త కథనాల్లో ప్రచురితం అయినా ఎటువంటి విచారణ చేపట్టకపోవడం ఆ మైనింగ్ అధికారికి ఇంకాస్త సపోర్టు అందినట్లు అయింది. తాజాగా ఆ మైనింగ్ అధికారి వ్యవహార శైలిపై దిశ ప్రచురించిన కథనం అనంతరం సైతం సదరు మైనింగ్ అధికారి వసూళ్లకు పాల్పడినట్లు జిల్లా వ్యాప్తంగా చర్చ సాగుతున్నా ఉన్నతాధికారులు సదరు అధికారి పైన చర్యలకు వెనకాడడం పట్ల పలువురు ఆశ్చర్యానికి గురవుతున్నారు. మైనింగ్ అధికారి అసలు గుట్టు బయటపడాలంటే తన అనుచరుడిగా మారిన డ్రైవర్ ఫోన్ పే, గూగుల్ పే డేటా ఆధారంగా విచారణ చేయబడితే తప్ప నిజం బయటపడదు. తాను అక్రమ సంపాదనకు అలవాటు పడటమే కాక అందులో సగం పాపాన్ని జిల్లాలో ఉన్నతాధికారులకు అంటగట్టడం ఏంటని జిల్లా ప్రజలు ప్రశ్నిస్తున్నారు.



Next Story