నియోజవర్గ అభివృద్దే ప్రధానం : జలగం వెంకటరావు

by Sridhar Babu |
నియోజవర్గ అభివృద్దే ప్రధానం :  జలగం వెంకటరావు
X

దిశ, అశ్వారావుపేట : నియోజవర్గ అభివృద్దే ప్రధానం అని దివగంత సీఎం తనయుడు మాజీ ఎమ్మెల్యే జలగం వెంకటరావు అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం పట్వారిగూడెంలో ఆదివారం నిర్వహించిన ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం జలగం అభిమానులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎప్పటినుంచో తన వాళ్ళని కలుసుకోవాలని అనుకుంటున్నానని.. ఈ రోజు ఇలా అవకాశం కుదిరింది అన్నారు. అభిమానుల సమావేశం వెనుక ఎటువంటి రాజకీయ నేపథ్యం లేదని చెప్పారు. కొత్తగూడెం నుండి పోటీ చేయనున్నారా..? లేకపోతే వేరే ఆలోచన ఏమైనా ఉందా అని విలేకరులు అడిగిన ప్రశ్నలపై జలగం స్పందించారు. తాను చేసే పనులు ప్రతిదీ రాజకీయ ప్రయోజనంతో ముడిపడి ఉండదన్నారు. మన ప్రాంతం అభివృద్ది చెందిందా లేదా చూడాలన్నారు. రాజకీయ ప్రయోజనాలు కాదు.. ప్రజా ప్రయోజనం చూడాలని కోరారు.

కొత్తగూడెంలో చాలా కుటుంబాలు వలస వెళ్లిపోయాయని, మనం చేసిన పనులు వల్ల ఉపాధి ఉద్యోగ అవకాశాలు రావాలని కొత్తగూడెం ఎమ్మెల్యేని ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తు రాజకీయాలపై మాట్లాడడానికి ఇంకా టైం ఉందన్నారు. ఇంకా ఎన్నికల నోటిఫికేషన్ రాకుండానే ఎలా స్పందిస్తానన్నారు. చెరువు రాకముందే దూకి కాళ్లు విరగకొట్టుకోలేను అన్నారు. కొత్తగూడెం నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ సీటు ఆశావహులను ఉద్దేశిస్తూ నియోజకవర్గం అన్నాక చాలా మంది అభ్యర్థులు ఉంటారని, అన్ని పరిగణలోకి తీసుకోలేనన్నారు. దేశంలో ప్రతిపక్షం లేదని, రాజకీయ శూన్యత ఏర్పడిందని పేర్కొన్నారు. అన్నిటికీ టైం వస్తుందన్నారు. పొంగులేటి రాజకీయ నేపథ్యంపై ప్రశ్నించగా.. తన రాజకీయ జీవితంలో ఎప్పుడు నేను ఎవరిని కామెంట్ చేసింది లేదన్నారు. పారిశ్రామికంగా అభివృద్ధి చెందకపోతే ముఖ్యంగా కొత్తగూడెం నియోజకవర్గం వెనకబాటు తప్పదన్నారు. చేసిన అభివృద్ధి గురించి డప్పు కొట్టు కొనే అవసరం జలగం కుటుంబానికి లేదన్నారు.

దివగంత సీఎం జలగం వెంగళరావు హయాం నుండి అలానే వస్తుందని పేర్కొన్నారు. అంతకు ముందు కొత్తగూడెం నియోజకవర్గ కేంద్రం నుండి సుమారు 200 కార్లతో భారీ ర్యాలీగా విచ్చేసిన జలగం దమ్మపేట మండలం గండి ముత్యాలమ్మ తల్లి ఆలయాన్ని దర్శించుకుని.. పట్వారీగూడెం కోటగిరి సీతారాం పామాయిల్ తోటలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరయ్యారు. తనతోపాటు కొత్తగూడెం నుంచి వచ్చిన వారికీ భోజన ఏర్పాట్లను ఆయన స్వయంగా పర్యవేక్షించారు. అనంతరం అశ్వారావుపేట నియోజకవర్గంలో పామాయిల్ సాగు విశిష్టత... 2004లో తాను ఎమ్మెల్యేగా పనిచేసిన సమయంలో పామాయిల్ సాగుకు చేసిన కృషిని.. స్థానిక వ్యవసాయ భూములు, పర్యావరణం,

భూగర్భ జలాల ప్రత్యేకతలు.. ఉద్యానవన పంటలు సాగవుతున్న తీరుని కొత్తగూడెం నియోజకవర్గం అనుచరులకు వివరించారు. కొత్తగూడెం, అశ్వారావుపేట నియోజకవర్గాలకు చెందిన జలగం ముఖ్య అనుచరులు, అభిమానులతో సరదాగా ముచ్చటించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. సుమారు వెయ్యి మంది హాజరైన సమావేశంలో రాజకీయ నేపథ్యం ఉంటుందని రాజకీయ వర్గాలు భావించాయి. కొత్తగూడెం అసెంబ్లీ స్థానం బీఆర్ఎస్ పార్టీ టికెట్ విషయంలో సిట్టింగ్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, హెల్త్ డైరెక్టర్ గడాల శ్రీనివాసరావు లతో ఉన్న పోటీ నేపథ్యంలో బల నిరూపణకు కొత్తగూడెం అనుచరులతో ప్రత్యేకంగా సమావేశమై భవిష్యత్తు రాజకీయ ప్రకటన ఉంటుందని ప్రచారం జరిగింది. ఈ సందర్భంగా విలేకరులతో జలగం మాట్లాడారు.



Next Story

Most Viewed