- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
రంజాన్ కానుకల పంపిణీ పై గందరగోళం

దిశ, ములకలపల్లి : దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదన్నట్లు ఉంది రంజాన్ కానుకల పంపిణీ తీరు. అధికారులు, అధికార పార్టీ నేతల మధ్య సమన్వయ లోపం మూలంగా పండుగ పది రోజుల ముందు పంచాల్సిన రంజాన్ కానుకలు పండక్కి మూడు రోజుల ముందు పంపిణీ చేయడం పై ముస్లింలు ఆగ్రహం వ్యక్తంచేశారు. ముందస్తు సమాచారం ఇవ్వకపోవడంపై ఆగ్రహించిన కొందరు ముస్లింలు కానుకలు తిరస్కరించారు.
మూడు రోజుల ముందు పంపిణీపై ఆగ్రహం
అశ్వారావుపేట నియోజకవర్గంలో మొత్తం 5 మండలాలు ఉన్నాయి. సుమారు 1700 రంజాన్ కనుక ల కిట్లు వచ్చినట్లు తెలిసింది. ఈ కిట్లు ప్రభుత్వం నెల రోజుల ముందే ఆయా మండల కేంద్రాలకు పంపించింది. పండుగ మూడు రోజుల ముందు పంపిణీ చేయడంలో ఆంతర్యం ఏంటని ముస్లిం పెద్దలు ప్రశ్నిస్తున్నారు. ఇది ముమ్మాటికీ తమను అవమానించడమేనని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కనీసం ఒక రోజు ముందైనా చెప్పరా..?
ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా కోట్లు ఖర్చు చేసి అన్ని మతాల పండుగలకు సమానంగా పండుగ కానుకలను అందిస్తుంది. క్షేత్ర స్థాయిలో అధికారులు, అధికారపార్టీ ప్రజా ప్రతినిధుల నడుమ సమన్వయ లోపంతో పేదలకు అందకుండా పోతున్నాయి. మంగళవారం నియోజకవర్గ స్థాయి రంజాన్ కానుకల పంపిణీ ఒకే రోజు ఏర్పాటు చేశారు. ఆయా మండలాల్లో ఉన్న ముస్లింలకు కనీసం ఒక రోజు ముందైనా సమాచారం ఇవ్వలేదని, 5 నిమిషాల ముందు ఫోన్ చేసి కానుకల పంపిణీ ఉన్నట్లు ముస్లిం పెద్దలకు అధికారులు సమాచారం ఇచ్చారు. కానుకల పంపిణీకి ఒక రోజైన ముందు సమాచారం ఇవ్వకపోవడంపై ఆగ్రహించిన జగన్నాథపురం మసీదు కమిటీ కానుకల పంపిణీ కార్యక్రమానికి వెళ్లకుండా నిరసన వ్యక్తం చేసింది.
నియోజకవర్గం అంతా ఇదే పరిస్థితి
ఎంతో ప్రతిష్టాత్మకంగా ఘనంగా జర్పాల్సిన రంజాన్ కానుకల పంపిణీ కార్యక్రమం అశ్వారావుపేట నియోజకవర్గ వ్యాప్తంగా పేలవంగా జరిగింది. క్షేత్రస్థాయిలో ఉన్న ముస్లిం కుటుంబాలకు అధికారులు, అధికార పార్టీ నేతలు ముందస్తు సమాచారం ఇవ్వకపోవడం మూలంగానే ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని అర్ధమవుతుంది.
కోట్ల రూపాయలు కేటాయించి ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుంటే ఇటు అధికారులు, అధికారపార్టీ నాయకులు ప్రజల్లోకి తీసుకెళ్లడంలో పూర్తిగా విఫలం అవుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే పర్యటన మండలాల్లో ఉన్నప్పటికీ కనీసం స్థానిక మీడియా కు ఎలాంటి సమాచారాన్ని అధికారులు, అధికారపక్షం నేతలు అందించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే మీడియాకు సమాచారం ఇవ్వకపోవడం మూలంగా ప్రభుత్వానికే నష్టమని, నియోజకవర్గ వ్యాప్తంగా రంజాన్ కానుకల పంపిణీకి పేదలు కాకుండా పెద్దలు హాజరుకావడం పై సర్వత్రా విమర్శలు వినపడుతున్నాయి.