- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
పోలీసులకు ఫిర్యాదు చేశారని దాడి

దిశ, వైరా : మండలంలోని గొల్లపూడి గ్రామంలో తమపై పోలీసులకు ఫిర్యాదు చేశారనే నెపంతో శనివారం ఓ ఇంటిపై ప్రత్యర్ధులు దాడి చేశారు. ఈ ఘటనలో ఇరువర్గాలకు చెందిన ముగ్గురికి గాయాలయ్యాయి. వారిలో ఒక గృహిణి కూడా ఉంది. ప్రత్యర్థి వర్గానికి చెందిన వారు గడ్డపలుగు, కర్రలు, రాళ్లతో దుర్భాషలాడుతూ పొలిమెట్ల బోసు ఇంటిపై ఒక్కసారిగా దాడి చేశారు. ఈ దాడిలో ఇంట్లో ఒంటరిగా ఉన్న బోసు భార్య పొలిమెట్ల జయరామ దుర్గ, దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన షేక్. మహబూబా సాహెబ్ లకు గాయాలయ్యాయి. దాడి అనంతరం ప్రత్యర్థి వర్గానికి చెందిన ఇటుకల సాంబయ్య వెనుదిరిగి వెళ్లే సమయంలో గాయపడ్డాడు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. రెండు రోజుల కిందట బోసు ఇంటి పెరట్లోని 12 ఎకరాలకు చెందిన వరిగడ్డివాము దగ్ధమైంది. ఈ ఘటన పై ఐదుగురిని అనుమానిస్తూ బోసు వైరా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కొంత కాలం నుంచి బోసు కుటుంబానికి పక్కనే ఉన్న ఎరుకుల శాంతి, రమేష్ దంపతులతో వివాదాలు కొనసాగుతున్నాయి.
వరిగడ్డి వామి దగ్ధం విషయంలో తమను అనుమానించారనే నెపంతో శాంతి కలకోటకు చెందిన తన బంధువులను గొల్లపూడి గ్రామానికి రప్పించింది. కొంతమంది బంధువులు గొల్లపూడి చేరుకున్న తర్వాత శాంతి వారితో కలిసి గడ్డపలుగు, కర్రలు, రాళ్లతో బోసు ఇంటిపై దాడి చేశారు. ఆ సమయంలో ఇంట్లో ఉన్న బోసు భార్య జయరామదుర్గను బలవంతంగా బయటకు లాక్కొచ్చి గేటుకు జుట్టు ముడి వేసి దాడి చేశారు. ఆ సమయంలో అటుగా వెళ్తున్న మహబూబాసాహెబ్ అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో అతనిపై కూడా కర్రలతో దాడి చేయగా జయ రామ దుర్గా, మహబూబాసాహెబ్ తలలు పగిలాయి. ఈ దాడి సమయంలోనే ప్రత్యర్థి వర్గమైన కలకోటకు చెందిన ఇటుకల సాంబయ్య కాలికి కూడా గాయమైంది. ఈ దాడి ఘటనతో గొల్లపూడి గ్రామంలో కొన్ని గంటల పాటు తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దాడి సమయంలో పొలం పనుల్లో ఉన్న బోసు సమాచారం తెలుసుకొని తన భార్యతో వైరా పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేశారు. దాడి తర్వాత ప్రత్యర్థి వర్గీయులు కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇరువర్గాల ఫిర్యాదు మేరకు పోలీసులు 9 మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.