అలంకార ప్రాయంగా సీసీ కెమెరాలు.. పట్టించుకోని అధికారులు..

by Sumithra |
అలంకార ప్రాయంగా సీసీ కెమెరాలు.. పట్టించుకోని అధికారులు..
X

దిశ, కారేపల్లి : మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు అలంకార ప్రాయంగా ఉన్నాయి. ఏర్పాటు చేసిన కెమెరాల్లో చాలా వరకు కెమెరాలు పని చేయటం లేదు. కెమెరాలు స్తంభాలకు వేలాడుతూ దర్శనమిస్తున్నాయి. ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. కానీ ప్రతీ క్షణాన్ని వీడియోలో నిక్షిప్తం చేసేలా ఏర్పాట్లు ఉంటే దేన్నైనా విశ్లేషించడం సులువు. ముఖ్యంగా నేర సంఘటనలు, రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్న సమయాల్లో పోలీసు విచారణకు వీడియో రికార్డులు, ఫుటేజీలు ఎంతో ఉపయోగపడుతాయి. అందుకే పోలీసు శాఖ, ప్రభుత్వం సీసీ కెమెరాల ఏర్పాటును ప్రోత్సహిస్తోంది. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా రోడ్ల వెంట, ప్రభుత్వం ప్రైవేట్‌ కార్యాలయాల్లో ఈ కాలంలో సీసీ కెమెరాలు, టీవీల వాడకం సాధారణం. ఇంత కీలకమైన సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.

కానీ వాటి నిర్వహణ పై పట్టించుకునే నాథుడు లేదు. కారేపల్లి మండల కేంద్రంలో దాతలు, ప్రజాప్రతినిధుల విరాళాలతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు మూలనపడ్డాయి. ముఖ్యంగా వాటి నిర్వహణను పంచాయతీలు, అధికారులు పట్టించుకోకే ఈ పరిస్థితి దాపురించింది. చౌరస్తాలు, పట్టణ, రద్దీ ప్రదేశాల్లో, రోడ్ల పై విరివిగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి వాటి నిర్వణను గాలికొదిలేయడంతో అందరి ప్రయత్నం, డబ్బు బూడిదలో పోసిన పన్నీరులా మారింది. నేరాల అదుపునకు సీసీ కెమెరాలను ఏర్పాటును అందరూ ప్రోత్సహించారు. ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానమని ప్రజల్లో అవగాహన కల్పించి నివాసాలు, వ్యాపార కేంద్రాల్లో సీసీ కెమెరాలు, టీవీలను ఏర్పాటు చేయించినా నిర్వహణ లేక ఫలితం లేకుండా పోతోంది.

Advertisement
Next Story