- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
రియల్ పేరుతో భూదందా...ప్రభుత్వ స్థలాలను మింగేస్తున్న వ్యాపారులు...

దిశ, ఖమ్మం సిటీ : వెంచర్ల పేరుతో పంట పొలాలను సైతం బీడు భూములుగా మార్చి ఆ తదుపరి వెంచర్లు ఏర్పాటు చేస్తున్నారు కొందరు రియల్ వ్యాపారులు. రూరల్ మండలంలోని ముత్తగూడెం గ్రామపంచాయతీ పరిధిలో రియల్ ఎస్టేట్ వ్యాపారుల అక్రమాలకు అడ్డూఅదుపు లేకుండా పోతుంది. ధన దోపిడే ధ్యేయంగా పెట్టుకున్న రియల్ టర్లు అటు సాధారణ ప్రజలను, ఇటు అధికారులను మోసం చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలు యథేచ్ఛగా ఉల్లంఘిస్తూ కోట్లు సంపాదిస్తున్నారు. అంతేకాదు.. తమదిగా చెబుతున్న భూమి పక్కన ఉన్న సర్కార్ భూములను, కుంటలు, వాగు శిఖాన్ని సైతం యథేచ్ఛగా ఆక్రమిస్తూ తమ భూమిలో కలిపేసుకుంటున్నారు. ఎలాంటి పర్మిషన్లు లేకున్నా.. నియమ నిబంధనలకు పూర్తిగా పాతరేసినా అధికారులు మాత్రం పట్టనట్ట వ్యవహరిస్తున్నారు. ఖమ్మం రూరల్ మండలంలోని ముత్తగూడెం గ్రామంలో సుమారు 14 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన వెంచర్లో అడుగడుగునా అక్రమాలే నెలకొన్నట్టు తెలుస్తోంది.
కన్వర్షన్ లేకుండానే ప్లాట్లుగా...
14 ఎకరాల విస్తీర్ణంలో యదేచ్ఛగా వెంచర్ వేశారు. అయితే ఈ వెంచర్ పూర్తిగా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవసాయ భూమిని అసలు కన్వర్షన్ లేకుండానే ప్లాట్లు చేసి విక్రయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక వ్యవసాయ భూమిని ఎలాంటి పర్మిషన్ లేకుండానే ప్లాట్లు చేసి అమాయకులకు అంటగడుతున్నా సంబంధిత అధికారులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. అంతేగాక ఈ వెంచర్లో కొన్ని వందల ట్రిప్పుల మట్టిని నింపి చదును చేస్తూ దానిలో మార్కింగ్ రాళ్లు పాతుతూ కస్టమర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విషయం మొత్తం పంచాయతీ సెక్రెటరీ కార్యాలయానికి సమీపాన జరగటం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ విషయంపై దిశ ప్రతినిధి సెక్రటరీని వివరణ కోరగా వారిని అడ్డుకుంటామని దాటవేశారు. సుమారు 14 ఎకరాల లో నిర్మాణం జరుగుతున్న ఈ వెంచర్ కి ఇంతవరకు సుడా అనుమతులు రాలేదు. ఇప్పటికే రూరల్ ప్రాంతంలో కుప్పల తిప్పలుగా వెలిసిన వెంచర్లతో ప్రజలు నానా అవస్థలు పడుతుంటే ఇంకా కొత్త వెంచర్లు నిర్మిస్తూ పేద ,మధ్యతరగతి ప్రజలను దోచుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ విషయం సుడా చైర్మన్ దృష్టికి వెళ్ళగా ఇప్పటివరకు ఆవెంచర్ కి ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని, వెంటనే పనులు నిలిపివేయాలని ఆదేశించామని తెలిపారు. ఇప్పటికైనా గ్రామపంచాయతీ అధికారులు, మండల అధికారులు, ఆ వెంచర్ పనులు పరిశీలించి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని కోరారు.