బీసీలు రాజ్యాధికారం లక్ష్యంగా అడుగులు వేయాలి : ఆర్. కృష్ణయ్య

by Sridhar Babu |
బీసీలు రాజ్యాధికారం లక్ష్యంగా అడుగులు వేయాలి : ఆర్. కృష్ణయ్య
X

దిశ సత్తుపల్లి : ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల ప్రజలు కులాలలో హెచ్చు తగ్గులను మాని రాజ్యాధికార దిశగా అడుగులు వేయాలని, అప్పుడే నిజమైన అభివృద్ధి కనిపిస్తుందని రాజ్యసభ సభ్యులు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య అన్నారు. శుక్రవారం సత్తుపల్లి పట్టణం స్థానిక శ్రీ లక్ష్మీ ప్రసన్న ఫంక్షన్ హాల్ నందు ఏర్పాటు చేసిన ఖమ్మం జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు నారాయణ వరపు శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 1973 వ సంవత్సరం నుంచి అనేక ఉద్యమాలు చేసి రిజర్వేషన్లు సాధించడంలో బీసీ సంక్షేమ సంఘం కృషి మరువలేనిదన్నారు. 55 శాతం జనాభా ఉన్న బీసీలను పార్లమెంట్, అసెంబ్లీ స్థానాల్లో రిజర్వేషన్ కల్పించి సముచిత స్థానం కల్పించాలని వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆయన కోరారు.

పార్లమెంట్లో బీసీల రిజర్వేషన్ చట్టం తేవాలని డిమాండ్ చేశారు. బీసీ సామాజిక వర్గాన్ని గుర్తించి సముచిత స్థానం కల్పించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కేవలం 5 శాతం ఉన్న అగ్ర వర్గాలు మనల్ని పాలిస్తుంటే 75 శాతం ఉన్న మనం అభివృద్ధి చెందలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ఆయన్ని గజమాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాడేపల్లి కృష్ణమాచారి , రెడ్డి మల్ల వెంకటేశ్వరరావు, తెలంగాణ అధ్యక్షులు ఎర్రం సత్యనారాయణ, ఖమ్మం జిల్లా అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య, తెలంగాణ కన్వీనర్ లాలా కృష్ణ, ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు, సత్తుపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ తోట సుజలా రాణి, సత్తుపల్లి మాజీ ఎంపీపీ చల్లా ఎంపీపీ చల్లారి వెంకటేశ్వరరావు, మల్లెపూల వెంకటేశ్వరరావుతో పాటు పలువురు స్థానిక బీసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed