బస్తీ దవాఖాన సిబ్బందికి జీతం రాక 3 నెలలు

by S Gopi |
బస్తీ దవాఖాన సిబ్బందికి జీతం రాక 3 నెలలు
X

దిశ, ఖమ్మం సిటీ: తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించడానికి పట్టణ ప్రాంతాల్లో ప్రారంభించిన బస్తీదవాఖానాపై ఎక్కువగా అంచనాలు ఉండడంతో పాటు ప్రజలకు మరింత చేరువగా వైద్య సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. బస్తీదవాఖానాల ద్వారా అన్ని వర్గాల ప్రజల ఆరోగ్య సమస్యలను తీర్చవచ్చుననే ఆలోచన ప్రభుత్వానిది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల పరిధిలో వీటిని ప్రారంభించారు. కాగా ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పాండురంగాపురం, తపాలగూడెంలలో కొద్ది నెలల క్రితం ప్రారంభించగా, గత మూడు నెలల క్రితం రంగనాయకుల గుట్ట, రామన్నపేట, వైఎస్ఆర్ నగర్, పాత మున్సిపాలిటి, కొత్తగూడెం మరియు సత్తుపల్లి, మధిర మున్సిపాలిటీ పరిధిలో ఒక్కొక్కటి ప్రారంభించారు. వీటన్నింటిని రాష్ట్ర రవాణా శాఖామాత్యులు పువ్వాడ అజయ్కుమార్ ప్రారంభించారు. వీటిలో క్రొత్తగా డాక్టర్లను, స్టాఫ్ నర్సులను నియమించి, డాక్టర్లకు 52 వేల రూపాయలు, స్టాఫ్ నర్స్కు 29 వేల రూపాయలు జీతాలుగా నిర్ణయించారు.

రామన్నపేట, రంగనాయకులగుట్ట బస్తీదవాఖానాలకు కొత్త బిల్డింగుల నిర్మాణం పూర్తికాకపోవడంతో వారు సమీప ఆరోగ్య కేంద్రాలలో పనిచేస్తున్నారు. ఇదిలా ఉండగా, బస్తీదవాఖానాలో పనిచేసే ఉద్యోగులకు జీతాలను 'జాతీయ ఆరోగ్య మిషన్' నుండి చెల్లించాల్సి ఉండగా, ప్రారంభించి మూడు నెలలు గడిచినా వారికి జీతాలు ఇంతవరకూ అందలేదు. దీంతో క్రొత్తగా నియమితులైన డాక్టర్లు, స్టాఫ్ నర్సులు ఆర్థికంగా ఇబ్బందులు పడుచున్నారు. దీనిపై కొందరు డాక్టర్లు తమ జీతాల కొరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులను సంప్రదించినప్పటికీ, వారి వద్ద నుండి సరియైన సమాధానం లేదని, ఎప్పటికి తమకు జీతాలు వస్తాయో కూడా తెలియడం లేదని, దీనిపై ఎవరిని సంప్రదించాలో తమకు పాలుపోవడం లేదని వాపోయారు. అదీకాక క్రొత్తగా ప్రారంభించిన 7 బస్తీ దవాఖానాలలో సబార్డినేట్ స్టాఫ్ను ఇంకా నియమించకపోవడంతో డాక్టర్లు, స్టాఫ్ నర్స్లు బస్తీదవాఖానాలలో తమ పనులను చేసుకోవడంలో అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయమై రాష్ట్ర రవాణా శాఖామాత్యులు స్పందించి తమకు జీతాలు అందేలా చూడాలని వారు కోరుతున్నారు.



Next Story

Most Viewed