డీసీసీబీ బ్యాంకులో చోరీకి యత్నం .. పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో ఘటన

by Kalyani |
డీసీసీబీ బ్యాంకులో చోరీకి యత్నం .. పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో ఘటన
X

దిశ, తిరుమలాయపాలెం: తిరుమలాయపాలెంలోని డీసీసీబీ బ్యాంకులో దుండగులు చోరీకి విఫలయత్నం చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం .. ఖమ్మం-వరంగల్ ప్రధాన హైవే పక్కన, పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలోని డీసీసీబీ బ్యాంకులో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి యత్నించి విఫలమయ్యారు. బ్యాంకు వెనక ఉన్న జీపీ నర్సరీ నుంచి ప్రహరీ ఎక్కి బ్యాంక్ బిల్డింగ్ పైన సిగ్నల్ యాంటీన, సీసీ కెమెరాల వైర్లు కట్ చేశారు. కిటికీని ధ్వసం చేసి లోపలికి ప్రవేశించారు. లోపలఉన్న ఏటీఎం ధ్వంసం చేసి స్టోర్ రూమ్ లోకి తీసుకెళ్లి, తెరిచేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. శనివారం రాత్రే దొంగలు చోరీకి యత్నించినట్టు పోలీసులు భావిస్తున్నారు. కాగా క్యాష్ బాక్స్ లో ఒక రూ.1,29,000 లు ఉన్నట్టు, బ్యాంక్ డబ్బులు భద్రంగా ఉన్నట్టు బ్యాంకు సీఈవో తెలిపారు. చోరీ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలంలో ఫింగర్ ప్రింట్స్ సేకరించారు. బ్యాంకు మేనేజర్ శ్రావణి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

గతంలో కూడా చోరీకి యత్నం

ఖమ్మం-వరంగల్ ప్రధాన హైవే పక్కనే ఉన్న డీసీసీబీ బ్యాంకులో గతంలో కూడా గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి యత్నించి విఫలమయ్యారు. శనివారం, ఆదివారం వరుసగా రెండు రోజులు సెలవులు కావడంతో తాజాగా మరోసారి చోరీకి పాల్పడ్డట్టు అనుమానిస్తున్నారు. అప్పటికే బ్యాంక్లో గోల్డ్, డబ్బులు దాచుకున్న కస్టమర్లు, చోరీ జరిగినట్టు వార్తలు విని బ్యాంకుకు చేరుకున్నారు. ఎలాంటి చోరీ జరగలేదని తెలిసి వారు ఊపిరి పీల్చుకున్నారు. కాగా, బ్యాంకుకు సరైన భద్రత లేకపోవడం వలననే, కూత వేటు దూరాన పోలీస్టేషన్ ఉన్నా పదే పదే చోరీకి యత్నిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు సరైన శ్రద్ధ తీసుకొని పటిష్టంగా బందోబస్తు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఖాతాదారులు, ప్రజలు కోరుతున్నారు.



Next Story

Most Viewed