సీనియర్ జర్నలిస్ట్ నాగేందర్‌కు 'ఆటా' ఆహ్వానం

by Mahesh |
సీనియర్ జర్నలిస్ట్ నాగేందర్‌కు ఆటా ఆహ్వానం
X

దిశ ప్రతినిధి, ఖమ్మం: జులై ఒకటి నుంచి మూడు వరకు అమెరికాలోని వాషింగ్టన్ నగరంలో జరిగే ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొనడానికి ఖమ్మం జిల్లాకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ నాగేందర్ అడపాల కు అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) నుంచి ఆహ్వానం అందింది. 1990 నుంచి అమెరికాలో ఉన్న తెలుగు ప్రజలు మన సాంప్రదాయాలు మర్చిపోకుండా ఎనలేని కృషి చేస్తున్న అమెరికన్ తెలుగు అసోసియేషన్ వివిధ రంగాలకు చెందిన వారిని ఈ మహాసభలకు ఆహ్వానించింది. మీడియా రంగం నుండి గత 20 ఏళ్లుగా ప్రజా సమస్యలపై వినూత్న కథనాలను అందించిన నాగేందర్ ప్రతిభను గుర్తించిన ఆటా ప్రెసిడెంట్ భువనేష్ భుజాలా మూడు రోజుల పాటు అమెరికా రాజధాని నగరంలో జరిగే సభలకు హాజరు కావాల్సిందిగా ఆహ్వానం పంపారు.

అమెరికాలో తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపడుతున్న విభిన్న కార్యక్రమాలను తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలకు అందించడానికి మీడియా అందిస్తున్న సహకారం మరువలేనిదని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఆటా నుండి ప్రముఖ మీడియా ప్రతినిధుల సరసన తనకు ఆహ్వానం అందడం పట్ల సీనియర్ జర్నలిస్ట్ నాగేందర్ అడపాల ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. అమెరికా పర్యటన ద్వారా అక్కడి తెలుగువారి జీవన గమనం పై ప్రత్యేక కథనాలు అందించేందుకు తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. నాగేందర్ అడపాలకు ఆటా ఆహ్వానం అందడం ఖమ్మం జిల్లా జర్నలిస్టులకు దక్కిన గౌరవంగా పేర్కొంటూ జిల్లాలోని జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాలు అభినందనలు తెలిపాయి.



Next Story