ఉమ్మడి ఖమ్మంలో TRS గెలిచేది ఆ 4 సీట్లేనా?

by Mahesh |   ( Updated:2022-06-15 07:29:58.0  )
ఉమ్మడి ఖమ్మంలో TRS గెలిచేది ఆ 4 సీట్లేనా?
X

దిశ ప్రతినిధి, ఖమ్మం: రాష్ట్రంలోనే ఉమ్మడి ఖమ్మం జిల్లాపై టీఆర్ఎస్ అధిష్టానం ప్రత్యేక ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. గతంలో కమ్యూనిస్టులు, కాంగ్రెస్ కు కంచుకోటగా ఉన్న జిల్లా ..గులాబీ వనంగా మారినప్పటికీ గత రెండు ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ పెద్దలకు మాత్రం షాకిచ్చింది. 2014, 2018 ఎన్నికల్లో అన్ని జిల్లాల్లో గులాబీ పార్టీ హవా కొనసాగితే ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి మాత్రం ఒక్కొక్క సీటు మాత్రమే గెలుచుకుంది. ఈ క్రమంలోనే గత దశాబ్ద కాలంగా జిల్లాలో పార్టీని పటిష్ట పరిచే కార్యక్రమాలు చేస్తూనే.. ఇతర పార్టీల నుంచి అగ్రనాయకులను కారెక్కించారు. ఈ పరిస్థితే ఇప్పుడు పుట్టి మునిగేలా తయారైందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

కొత్త, పాత వారి కలయికతో అన్ని నియోజకవర్గాల్లోనూ ఆధిపత్య పోరు రగులుతూనే ఉంది. ప్రత్యర్థులందరూ ఒక్క గూటికి చేరడంతో అవసరం దొరికినప్పుడల్లా అవతలి వారి పై ఆధిపత్యం చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో పీకే టీం ఉమ్మడి జిల్లాలో సర్వే చేసినట్లుగా తెలుస్తోంది. అంతేకాదు.. ఈ సర్వేలో నాలుగు సీట్లు మాత్రమే సునాయాసంగా గెలుచుకునే పరిస్థితి ఉన్నట్లు ఆ నివేదిక చెబుతున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. మిగతా 6 సీట్లలో పార్టీ కష్టపడాలని కూడా నివేదిక అందించినట్లు సమాచారం. ఏది ఏమైనా కొన్ని చోట్ల పార్టీ పరిస్థితి బాగున్నప్పటికీ వర్గ విభేదాలు దెబ్బతీసేలా ఉన్నాయంటున్నారు విశ్లేషకులు.

పీకే సర్వే రిపోర్ట్ అంటూ..

ఇటీవల ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది నియోజకవర్గాల్లో పీకే బృందం సర్వే చేసినట్లు ఓ నివేదిక సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ నివేదిక ప్రకారం ప్రతి మండలం నుంచి 5 వేల శాంపిల్స్ తీసుకుని అన్ని నియోజకవర్గాల్లో ఫీడ్ బ్యాక్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న పది నియోజకవర్గాల్లో నాలుగు నియోజకవర్గాలు.. ఖమ్మం, సత్తుపల్లి, పినపాక, కొత్తగూడెం సీట్లు సునాయాసంగా గెలిచేవని.. మధిర, అశ్వారావుపేట, వైరా, పాలేరు సీట్లు కష్టపడితే గెలిచేవని, ఇల్లందు, భద్రాచలం సీట్లు టఫ్ ఫైట్ ఇచ్చే సీట్లుగా ఆ సర్వే నివేదిక అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ సర్వే ప్రకారం చూసుకుంటే.. ప్రస్తుతం కేవలం నాలుగు స్థానాలు మాత్రమే టీఆర్ఎస్ కి అనుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. మిగతా 6 స్థానాల్లో పార్టీకి అంత అనుకూలంగా లేదని సదరు సర్వే చెప్పకనే చెబుతోంది.

ఆ నాలుగు స్థానాల్లో తలనొప్పులు లేవా..?

వాస్తవానికి ఐప్యాక్ సర్వే అంటూ వైరల్ అవుతున్న రిపోర్టులో సునాయసంగా గెలిచే సీట్లు అంటూ వైరల్ అవుతున్న 4 స్థానాల్లో కూడా పుష్కలంగా వర్గ విభేదాలు ఉన్నాయి. పార్టీపరంగా చూసుకుంటే గట్టిగా ఉన్నప్పటికీ పార్టీలోనే వర్గాలు ఉండడంతో టికెట్లు ఆశించి భంగపడ్డ వారి ప్రభావం తీవ్రంగా ఉండబోతుందనేది స్పష్టం అవుతుంది. 2018 ఎన్నికల్లో పువ్వాడ అజయ్ ఒక్కరే గెలిచి టీఆర్ఎస్ జెండాను ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాపాడారు. ఆ తర్వాత అజయ్ కు ప్రత్యర్థులుగా ఉన్న అగ్రనేతలు కూడా కారెక్కడంతో వర్గవిభేదాలు ఇప్పటికి కూడా నివురుగప్పిన నిప్పులాగా ఉన్నాయి. అటు పొంగులేటి, ఇటు తుమ్మల నాగేశ్వరరావు అభిమానులు, అనుచరులు ఖమ్మం నియోజకవర్గంలో పుష్కలంగానే ఉన్నారు. వీరిద్దరికీ అజయ్ తో ఉన్న వైరం వచ్చే ఎన్నికల్లో ప్రభావం చూపించొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే చేసిన అభివృద్ధి మాత్రం అజయ్ ను గెలుపు దిశగా పయనింప చేయవచ్చనే అంచనాలు ఉన్నాయి. కొత్తగూడెంలో ఇప్పటికే ఎమ్మెల్యేగా ఉన్న వనమా వెంకటేశ్వరరావు 'సన్' స్ట్రోక్ తో బాధపడుతున్నారు. గతంలో జరిగిన కొన్ని పరిణామాల వల్ల పార్టీకి చెప్పలేనంత డ్యామేజ్ ఏర్పడింది.

వచ్చే ఎన్నికల్లో పార్టీ నుంచి వనమాకు టికెట్ వచ్చే అవకాశాలే లేవు. వచ్చిన ఆ స్థానం టీఆర్ఎస్ కోల్పోక తప్పదనే అంటున్నారు. జలగం సైతం తాను సై అంటున్నాడు. అంతేకాదు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఈసారి కొత్తగూడెం టికెట్ ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. టీఆర్ఎస్ నుంచి ఇంతమంది ఒకే టికెట్ కోసం పోటీ పడుతున్న నేపథ్యంలో అక్కడ ఒకరినొకరు ఓడించుకునే ప్రయత్నాలు జరిగే అవకాశాలే ఎక్కువ. అంతేకాక.. కాంగ్రెస్, బీజేపీలు సైతం కొత్తగూడెం పై ఈసారి గట్టిగా కన్నేశాయి. పినపాకలో ప్రస్తుత ఎమ్మెల్యే రేగా కాంతారావుకు గట్టి పట్టుకున్నప్పటికీ అక్కడ మాజీ ఎమ్మెల్యే, పొంగులేటి ముఖ్య అనుచరుడు పాయం వెంకటేశ్వర్లు వర్గాలకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. ఇటీవల పొంగులేటిని రేగా వర్గీయులు అక్కడికి రాకుండా అడ్డుకోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. సత్తుపల్లిలో సండ్ర వెంకటవీరయ్య బలంగా ఉన్నప్పటికీ టీఆర్ఎస్ పార్టీకి చెందిన పొంగులేటి అనుచరుడు మట్టా దయానంద్ ను సైతం ఈ సారి టికెట్ ఆశిస్తున్నారు. ఆయనకు టికెట్ దక్కకుంటే ఇండిపెండెంట్ గా లేక వేరే పార్టీ నుంచి పోటీ అవకాశమున్నట్లు తెలుస్తోంది.

మిగతా ఆరింట్లోనూ..

మిగతా ఆరు నియోజకవర్గాలైన మధిర, అశ్వారావుపేట, వైరా, పాలేరు, ఇల్లందు, భద్రాచలంలో.. మధిర, భద్రాచలంలో అసలు టీఆర్ఎస్ పార్టీకి అంత పట్టు లేదనే చెప్పాలి.. మధిరలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క బలంగా ఉన్నారు. అక్కడ నుంచి లింగాల కమల్ రాజ్ ఉన్నా అంత ప్రభావం చూపలేకపోతున్నారు. ఇక భద్రాచలంలో కాంగ్రెస్ బలంగా ఉంది.. అక్కడ టీఆర్ఎస్ కు తావేలేదనే ప్రచారం జరుగుతోంది. వైరాలో ఇప్పటికే అధికార పార్టీ నుంచి మదన్ లాల్, రాముల్ నాయక్ సై అంటే సై అంటున్నారు. మాజీ ఎమ్మెల్యే చంద్రావతి సైతం ఈసారి పోటీ చేస్తారంటూ ప్రచారం జరుగుతోంది. వీరిలో ఏ ఒక్కరికి టికెట్ ఇచ్చిన మిగతా వారు ఎదురు తిరిగే అవకాశాలే ఉన్నాయి. ఈ క్రమంలో పార్టీ గెలుపు కష్టంగానే ఉంటుంది. ఇక పాలేరులో కందాలకు, తుమ్మలకు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. ఈసారి నేను పోటీలో ఉంటానంటూ తుమ్మల నియోజకవర్గంలో కలియ తిరుగుతున్నారు. ఈ క్రమంలో టికెట్ ఎవరికిచ్చినా గెలుపుపై తీవ్ర ప్రభావం ఉంటుంది. ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ, ఆమె భర్త హరి సింగ్ పార్టీ ప్రతిష్టను పూర్తిగా దెబ్బతీశారని ప్రచారం జరుగుతోంది.



Next Story

Most Viewed