అన్నీ తానై చక్రం తిప్పిన ఎమ్మెల్సీ

by Sridhar Babu |
అన్నీ తానై చక్రం తిప్పిన ఎమ్మెల్సీ
X

దిశ, వైరా : వైరా మున్సిపాలిటీలోని కౌన్సిలర్లను ఏకతాటి పైకి తెచ్చేందుకు వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు అన్ని తానే చక్రం తిప్పారు. ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ పార్టీని వీడటంతో వైరా మున్సిపాలిటీ చైర్మన్ సూతకాని జైపాల్ తో పాటు మరో ముగ్గురు కౌన్సిలర్లు పొంగులేటి శిబిరంలో చేరారు. మిగిలిన బీఆర్ఎస్ కౌన్సిలర్లు పార్టీ నుంచి చేజారకుండా ఎమ్మెల్సీ తాతా మధు వ్యూహాత్మకంగా అడుగులు ముందుకు వేశారు. పార్టీలో ఉన్న 14 మంది కౌన్సిలర్లతోపాటు అభివృద్ధి నినాదంతో కాంగ్రెస్ లోని ఇద్దరు కౌన్సిలర్లను తమతో కలుపుకొని పోయేందుకు తాతా మధు వ్యూహాత్మకంగా వ్యవహరించారు.

వైరా లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సోమవారం ఎమ్మెల్యే రాములు నాయక్ తో కలిసి తాతా మధు కౌన్సిలర్లతో ప్రత్యేక అంతరంగిక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముందుగా అభివృద్ధి ఎజెండాగా చర్చ జరిగింది. ఈ సమావేశానికి బీఆర్ఎస్ కు చెందిన 14 మంది కౌన్సిలర్లతోపాటు, కాంగ్రెస్ కు చెందిన ఇద్దరు కౌన్సిలర్లు హాజరయ్యారు. ఒక్కో కౌన్సిలర్ తో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వ్యక్తిగతంగా మాట్లాడారు. కౌన్సిలర్ల సమస్యలను సావధానంగా అడిగి తెలుసుకున్నారు. కౌన్సిలర్లకు తాతా మధు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసానిచ్చారు. అంతేకాకుండా వైరా మున్సిపాలిటీ అభివృద్ధికి నిధులు తెచ్చే బాధ్యత తనదేనని అభివృద్ధిని తన భుజస్కందాలపై వేసుకుంటానని కౌన్సిలర్ కు స్పష్టం చేశారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఈ సమావేశం మధ్యాహ్నం 2.30 వరకు కౌన్సిలర్లతో వ్యక్తిగత అభిప్రాయాలు తీసుకునేందుకే సమయాన్ని కేటాయించారు. అనంతరం మున్సిపాలిటీ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం పెట్టే అంశంపై చర్చించి తుది నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం 30 కోట్ల రూపాయల నిధులను మున్సిపాలిటీకి అతి త్వరలో కేటాయిస్తుందని తాతా మధు కౌన్సిలర్లకు హామీ ఇచ్చారు.

మూడు నెలల్లోపు ఈ నిధులతో పనులు ప్రారంభించే బాధ్యత తనదని ఆయన స్పష్టం చేశారు. నిధుల్లో ఒక్క వార్డుకు ఒక కోటి రూపాయలను కేటాయిస్తామని పేర్కొన్నారు. మిగిలిన 10 కోట్ల రూపాయల నిధులను సమస్యలు అధికంగా ఉన్న విలీన గ్రామాలతో పాటు ఇతర వార్డులకు కేటాయిస్తామన్నారు. వైరాలోని మధిర క్రాస్ రోడ్డు నుంచి రిజర్వాయర్ ఆనకట్ట ప్రారంభం అయ్యే ప్రాంతం వరకు డివైడర్ తో డబుల్ రోడ్డు నిర్మించేందుకు సుడా నుంచి కోటి రూపాయలు నిధులు మంజూరయ్యాయని చెప్పారు. కౌన్సిలర్లు నామినేటెడ్ పద్ధతిలో తమ వార్డుల్లో కోటి రూపాయలతో పనులు చేసుకునేందుకు కృషి చేస్తానని స్పష్టమైన హామీ ఇచ్చారు. కౌన్సిలర్ల గౌరవాన్ని అన్ని విధాలుగా పెంచుతామని తాతా మధు స్పష్టం చేశారు. వార్డులో పార్టీ అభివృద్ధికి కౌన్సిలర్లు కృషి చేయాలన్నారు. వైరా నియోజకవర్గంలో పార్టీని, వైరా మున్సిపాలిటీను ఏ విధంగా నడపాలో తమకు అన్ని తెలుసునని కౌన్సిలర్ కు భరోసా ఇచ్చారు.

ఇప్పటివరకు ఒక లెక్క... ఇప్పటినుంచి ఒక లెక్క అని భవిష్యత్తులో పార్టీ చేపట్టబోయే కార్యాచరణ గురించి కౌన్సిలర్లకు స్పష్టంగా వివరించారు. అనంతరం కౌన్సిలర్ల అభిప్రాయాన్ని సేకరించి చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు కలెక్టర్ కు వినతిపత్రం అందించాలని నిర్ణయించారు. కలెక్టర్ కి ఇచ్చే వినతిపత్రంపై 16 మంది కౌన్సిలర్లు ఏకాభిప్రాయంతో సంతకాలు చేసేందుకు తాతా మధు చేసిన కృషి ఫలించింది. దీంతో ఎమ్మెల్యే రాములు నాయక్ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి 16 మంది కౌన్సిలర్లు కలెక్టర్ గౌతమ్ ని కలిసి వైరా మున్సిపాలిటీ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టేందుకు అనుమతి ఇవ్వాలని వినతి పత్రం సమర్పించారు. కౌన్సిలర్ల లోని అభద్రతాభావాన్ని, అనైక్యతను తొలగించేందుకు తాతా మధు చేసిన కృషి, వ్యూహం ఫలించింది. కౌన్సిలర్లకు భవిష్యత్తుపై స్పష్టమైన భరోసా ఆయన ఇవ్వగలిగారు. దీంతో కౌన్సిల్ అందరూ ఐక్యంగా అవిశ్వాసంపై ఏకా భిప్రాయానికి వచ్చారు. అన్నీ తానై వైరా మున్సిపాలిటీ తో పాటు పార్టీని అభివృద్ధి చేసేందుకు తాతా మధు చేసిన కృషిని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అభినందిస్తున్నారు.



Next Story