- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
'భద్రాద్రి' లో గెలవడం బీఆర్ఎస్ కు కష్టమే

దిశ, చర్ల: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈసారి పది సీట్లు గెలుస్తామని, భద్రాచలంలో బీఆర్ఎస్ జెండా ఎగురుతుందని రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ప్రభుత్వ విప్ రేగా కాంతారావులు పలుమార్లు ధీమాగా చెప్పారు. మిగతా స్థానాల సంగతి పక్కన పెడితే భద్రాచలం అసెంబ్లీ సీటు బీఆర్ఎస్కు అనుకూలమా లేక ప్రతికూలమా అనేది నియోజకవర్గంలో చర్చనీయాంశమైంది. ఈసారి గెలుపు ఖాయమని పార్టీ శ్రేణులు సంబురపడుతున్నా, అది అంత ఈజీ కాదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. భద్రాచలంలో బీఆర్ఎస్ పార్టీకి ప్రతికూల పరిస్థితులే అధికంగా కనిపిస్తున్నాయనేది రాజకీయ పరిశీలకుల అభిప్రాయం. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలు అధికార బీఆర్ఎస్ పార్టీకి ఓట్ల వర్షం కురిపించి, ఈసారి సునాయాసంగా గెలిపిస్తాయని ఆపార్టీ నాయకులు, కార్యకర్తలు ఆశిస్తున్నారు. అయితే వారి ఆశ ఏమేరకు నెరవేరుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది.
నెరవేరని హామీలు
స్వయంగా సీఎం కేసీఆర్ భద్రాచలం వచ్చి పట్టణ అభివృద్ధి కోసం ఇచ్చిన హామీలు నెరవేరడం లేదని పట్టణ ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. భద్రాచలంలో రామాలయ అభివృద్ధి కోసం రూ.100 కోట్లు ప్రకటించిన సీఎం కేసీఆర్ ఆనిధులు ఏండ్లు గడుస్తున్నా విడుదల చేయలేదు. ఈవర్షాకాలంలో వరదల సమయంలో మరోమారు వచ్చినపుడు రూ.1000కోట్లతో వరద బాధితులకు ఎత్తైన ప్రదేశంలో ఇండ్లు నిర్మించి సౌకర్యాలు కల్పిస్తామని ప్రకటించారు. ఇవి హామీలుగానే ఉన్నాయి తప్ప, ఒక్కటీ అమలుకు నోచుకోవడం లేదని భద్రాచలం పట్టణ ప్రజలతో పాటు అధికార బీఆర్ఎస్ శ్రేణులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పక్కన ఉన్న పినపాక నియోజకవర్గానికి నిధులు వరదలా విడుదల చేస్తున్నా సీఎం కేసీఆర్ భద్రాచలం నియోజకవర్గాన్ని కనీసం పట్టించుకోవడం లేదనే అభిప్రాయం పట్టణ ప్రజల్లో వ్యక్తం అవుతున్నది.
భద్రాచలం శివారు ఐదు గ్రామ పంచాయతీలను తిరిగి తెలంగాణలో కలపాలని ఇటీవల ప్రజలు పెద్ద ఎత్తునా ఆందోళనలు చేసినా ఈసమస్యపై రాష్ట్ర ప్రభుత్వం మౌనం వహించడంపై భద్రాద్రి వాసులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. బీజేపీతో తాడోపేడో తేల్చుకుంటామని బీఆర్ఎస్ నాయకత్వం చెబుతున్నా ప్రస్తుత సమయంలో కూడా ఆంధ్రాలో కలిపిన ఐదు గ్రామ పంచాయతీలను తిరిగి తీసుకొనే విషయంలో అధికార పార్టీ నోరు విప్పకపోవడంలో ఆంతర్యం ఏమిటని భద్రాచలం పట్టణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. భద్రాచలం నియోజకవర్గం విషయంలో సీఎం కేసీఆర్కు చిత్తశుద్ధి లేదనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
పొత్తు పొడిచేనా..?
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకుంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం సీటు సీపీఎంకి, కొత్తగూడెం సీటు సీపీఐకి కేటాయిస్తారని గులాబీ పార్టీలో ప్రచారం జరుగుతున్నది. అదే నిజమైతే బీఆర్ఎస్తో పొత్తు సీపీఎంకి ఏ మేరకు మేలు చేస్తుందనేది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. రాష్ట్రమంతట పరిస్థితులు ఎలా ఉన్నా భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గంలో మాత్రం అధికార బీఆర్ఎస్ పార్టీ పట్ల ప్రజల్లో పూర్తి వ్యతిరేకత కనిపిస్తున్నదని చెప్పక తప్పదు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడమే ఈవ్యతిరేకతకు ప్రధాన కారణమని తెలుస్తున్నది. అంతేగాక అధికార పార్టీలో నాయకుల నడుమ ఆధిపత్య పోరు, అంతర్గత కుమ్ములాటలు, వర్గ విభేదాలు పార్టీకి తీరని నష్టం చేస్తాయని పరిశీలకులు భావిస్తున్నారు. ఎన్నికల్లో కారు గుర్తుకాదని కమ్యూనిస్టులకు ఓట్లు వేయడం కొందరు గులాబీ కార్యకర్తలకు ఏ మాత్రం నచ్చడంలేదు. ఎన్నికల నాటికి పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేముగానీ ఇప్పుడైతే పొత్తు విషయంలో గులాబీ శ్రేణులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
భద్రాచలంలో గులాబీ జెండా ఎగరడం ఇక కలేనా?
భద్రాచలంలో గులాబీ జెండా ఎగరడం ఇక కలగానే మిగిలి పోతుందా అని ఆవేదన చెందుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అధికార పార్టీతో పొత్తు సీపీఎంకి ఏ మేరకు మేలు చేస్తుందనేది ప్రశ్నార్థకంగా కనిపిస్తున్నది. అయితే ఎన్నికలు ఖరీదైన ప్రస్తుత తరుణంలో ఒంటరిగా పోటీ చేయడం కంటే లాభమైనా నష్టమైనా బీఆర్ఎస్తో కలిసి ఎన్నికలకు వెళ్లడమే మంచిదనే అభిప్రాయం సీపీఎం శ్రేణుల్లో వ్యక్తం అవుతున్నది. దీంతో కొంత ఆర్థిక తోడ్పాటు కలుగవచ్చనే భావన లేకపోలేదు. ఇదిలా ఉంటే అధికార బీఆర్ఎస్ పార్టీతో పొత్తు సీపీఎం పార్టీ కింది స్థాయి క్యాడర్కు కూడా కొంత నచ్చడం లేదని తెలుస్తున్నది. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, నిరుద్యోగ భృతి ఇవ్వడం లేదని, చర్లలో కోరెగడ్డ నిర్వాసిత రైతులకు నష్టపరిహారం చెల్లించడం లేదని, సాగునీటి సమస్యలు పరిష్కరించడం లేదని, ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తున్నారని, కార్మికుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం మీద నిరంతరం రోడ్లపైకి వచ్చి పోరాటాలు చేస్తున్న తాము ఎన్నికల్లో అదే గులాబీ జెండా పక్కన బెట్టుకుని ప్రజల ముందుకు వెళ్లి ఎలా ఓట్లు అడుగుతామనేది, అపుడు ప్రజలు ఎలా ఆదరిస్తారని కొందరు సీపీఎం కార్యకర్తల్లో వ్యక్తం అవుతున్న అభిప్రాయం. ఇలాంటి పరిస్థితుల నడుమ సీపీఎం, బీఆర్ఎస్ల పొత్తు పొడిచి ఏమేరకు ఫలిస్తుందనేది ఆసక్తిగా మారింది. సిట్టింగ్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసి భద్రాచలం నియోజకవర్గంలో ఎన్నికలకు వెళ్లాలి అనుకుటుంటున్న సీపీఎం ప్రభుత్వ (బీఆర్ఎస్) వ్యతిరేకతను ఎలా అనుకూలంగా మార్చుకొంటుందనేది వేచి చూడాలి. అయితే భద్రాచలం బరిలో ఈసారి ముక్కోణపు పోటీ కనిపిస్తున్నది.
Also Read..