- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ప్రభుత్వ ఆస్పత్రిలో అంబులెన్స్ దందా

దిశ, ఖమ్మం: ఖమ్మం ప్రధాన ప్రభుత్వ ఆస్పత్రి అంబులెన్స్ల దందా విచ్చల విడిగా కొనసాగుతున్నది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నిరుపేద ప్రజలు వైద్యానికి వచ్చినప్పుడు మెరుగైన సౌకర్యాల కోసం దూర ప్రాంతాలకు తరలించేందుకు ప్రభుత్వ ఆస్పత్రిలో ఉన్న అంబులెన్స్ కావాలంటే డబ్బులు సమర్పించు కోవాల్సిందే. కరోనా సమయంలో రోగులకు మెరుగైన వైద్య సేవలను అందించేందుకు మంత్రి కేటీఆర్ గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రజా ప్రతినిధులు వారి సొంత నిధుల నుంచి ఆధునిక సౌకర్యాలతో కూడిన అంబులెన్స్లను ప్రభుత్వ ఆస్పత్రులకు అందించారు.
కరోనా సమయంలో ప్రజలకు అందుబాటులో నడిచాయి. ప్రస్తుతం ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య సేవల కంటే మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్, వరంగల్ ప్రాంతాలకు వెళ్లాలని వైద్యులు సూచిస్తున్న సమయంలో అక్కడ ఉన్న సిబ్బంది ఇదే అదునుగా భావించి అందిన కాడికి దోచుకుంటున్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో ఉన్న అంబులెన్సులు పేదలకు ఉచితంగా పంపించాలని జీవో ఉన్నా అక్కడ ఉన్న వైద్యాధికారులు సిబ్బందితో చేతులు కలిపి ముక్కు పిండి వసూలు చేస్తున్నారు.
దూరాన్ని బట్టి డిమాండ్..
ప్రభుత్వ ఆస్పత్రిలో ఉన్న అంబులెన్స్ లు నిరుపేద రోగులకు ఉపయోగంలోకి రావడం లేదు. రోగి మెరుగైన చికిత్స కోసం దూర ప్రాంతాలకు వెళ్లాలంటే అంబులెన్సులకు డబ్బులు ఇవ్వాల్సిందే. హైదరాబాద్, వరంగల్ తదితర ప్రాంతాలకు వెళ్లాలంటే వేలల్లో వసూలు చేస్తున్నారు. ప్రభుత్వం అంబులెన్స్లకు డీజిల్ ఉచితంగా అందిస్తున్న అక్కడ ఉన్న సిబ్బంది వసూళ్లకు పాల్పడుతున్నారు. రికార్డులో మాత్రం ఉచితంగా తరలించామని నమోదు చేస్తున్నారు. రాత్రి సమయంలో ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఎక్కువ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. బయట ఉన్న అంబులెన్స్ కంటే తాము తక్కువగా ఉంటుంది అని బేరాలు చేస్తున్నారు.
మౌనంగా ఉన్నతాధికారి
ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో గిఫ్ట్ ఏ స్మైల్ అంబులెన్స్లో జరుగుతున్న వసూల్ దందాపై వైద్య అధికారులు మౌనంగా ఉన్నారు. అక్కడ పనిచేస్తున్న సిబ్బంది చేస్తున్న వసూళ్ల పర్వం వారి దృష్టి వచ్చినా చూసి చూడనట్టు వ్యవహరించడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికైనా జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు దృష్టి సారించి అంబులెన్స్ దందాకు చెక్ పెట్టాలని ప్రజలు కోరుతున్నారు.