దారులన్నీ తీర్థాల వైపే..

by Sridhar Babu |

దిశ, ఖమ్మం రూరల్​ : రెండవ రోజైన ఆదివారం కూడా తీర్థాల ప్రాంగాణం శివనామస్మరణతో మార్మోగింది. భక్తులు ఓం నమ: శివాయ అంటూ శివున్ని దర్శించుకున్నారు. క్షీరాభిషేకాలు నిర్వహించారు. ఎటూ చూసిన జనమే. రెండవరోజు వచ్చిన భక్తులు మున్నేరులో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారికి మొక్కులు చేల్లించుకున్నారు. రాత్రి జాగారం ఉన్న భక్తులు ఉదయాన్నే శివున్ని దర్శించుకున్నారు. యువత కేరింతలు ఆనందోత్సవాల మధ్య సందడి చేశారు. భక్తులు తాత్కాలిక డేరాల వద్ద భోజనం తయారు చేసుకుని కుటుంబ సమేతంగా కాలక్షేపం చేశారు.

మాడ వీధుల్లో స్వామివారి ఊరేగింపు

శివపార్వతుల కల్యాణం శనివారం రాత్రి ఆలయ పరిధిలో గల మండపంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. అనవాయితీగా వస్తున్న స్వామివారి తలంబ్రాలను పోలేపల్లి నుంచి తీసుకువచ్చి కల్యాణం ఘనంగా నిర్వహించారు. రూరల్​ ఎంపీపీ బెల్లం ఉమ దంపతులు, ఆలయ చైర్మన్​ జాఠోతు శాంత దంపతులు, సర్పంచ్​ తేజావత్​ బాలునాయక్​ దంపతుల చేతుల మీదుగా స్వామి కల్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం ఆదివారం శివపార్వతులను మాడవీధుల్లో ఊరేగించారు. మేళతాళాలతో స్వామివారిని ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చారు. ప్రధాన అర్చకులు సంతోష్ కుమార్​ శర్మ కల్యాణతలంబ్రాలను పలువురికి పంపిణీ చేశారు.

కట్టుదిట్టమైన చర్యలు

జాతరలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్​, రెవెన్యూ, పంచాయతీ శాఖలకు చెందిన అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. ప్రత్యేకించి కామంచికల్లు నుంచి టెంపుల్​ వద్దకు ఆర్టీసీ బస్​ రావడంతో భక్తులు శివున్ని సులువుగా దర్శించుకున్నారు. వాహనాల ట్రాఫిక్​ లేకుండా రూరల్​ సీఐ శ్రీనివాసరావు తగు చర్యలు తీసుకున్నారు. పంచాయతీ కార్యదర్శులు, వీఆర్​ఏలు అక్కడే ఉండి జాతర నిర్వహణ పనుల్లో పాల్గొన్నారు. రూరల్​ సీఐ శ్రీనివాసరావు, తహసీల్దార్​ టి.సుమ, ఎస్​ఐ వెంకటక్రిష్ణ, ఎంపీవో శ్రీనివాసరావు, ఆర్​ఐ క్రాంతికుమార్​, సర్పంచ్​ తేజావత్​ బాలునాయక్​, ఆలయ చైర్మన్​ జాఠోతు శాంత, ఈవో శేషయ్య, ఇతర శాఖల అధికారులు జాతర నిర్వహణకు పట్టిష్ఠ ఏర్పాట్లు నిర్వహించారు.



Next Story

Most Viewed