- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
రైతులను ముప్ప తిప్పలు పెడుతున్న అడ్వాంట కంపెనీ

దిశ, వైరా : ఆడ మగ మొక్కజొన్న విత్తనాలను సాగు చేసి పంటను విక్రయించిన అన్నదాతలను కంపెనీలు, ఆర్గనైజర్లు ముప్పతిప్పలు పెడుతున్నారు. సుమారు రెండు నెలల క్రితం పంటను కొనుగోలు చేసిన కంపెనీలు, ఆర్గనైజర్లు రైతులకు నగదు చెల్లించకుండా తీవ్ర జాప్యం చేస్తున్నారు. దీంతో తాము ఆరుకాలం కష్టించి శ్రమించి పండించిన పంట నగదు ఎప్పుడు వస్తుందా అని అన్నదాతలు కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. వైరా, కొణిజర్ల మండలాల్లోని రైతులకు నగదు చెల్లించకుండా అడ్వాంట కంపెనీ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. వైరా మండలం సోమవారం గ్రామానికి చెందిన ఆర్గనైజర్ గొల్లపూడి శేషగిరిరావు వైరా కొణిజర్ల మండలాల్లో గత రబీ సీజన్లో రైతులతో అడ్వాంట కంపెనీ ఆడ మగ మొక్కజొన్న విత్తనాలను సాగు చేయించారు. గత రెండు నెలల క్రితం ఆయన రైతుల పండించిన పంటను సేకరించి కంపెనీకి ఎగుమతి చేశాడు.
అయితే రెండు నెలలు గడిచినా రైతులకు నేటి వరకు పంట నగదు కంపెనీ ఇవ్వలేదు. అడ్వాంట కంపెనీ సుమారు రూ. 2 కోట్లు రైతులకు పెండింగ్ ఉంది. రెండు నెలలుగా కంపెనీ నగదు ఇవ్వకపోయినా కనీసం ఆర్గనైజర్ పట్టించుకోవటం లేదని రైతులు వాపోతున్నారు. తాము వడ్డీలకు నగదు తెచ్చి పంటలను సాగుచేసామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటను కొనుగోలు చేసిన వారం రోజుల్లోపు నగదును ఇస్తామని చెప్పిన కంపెనీ, ఆర్గనైజర్ ప్రస్తుతం మొఖం చాటేయటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వైరా మండలంలోని సోమవారం తాటిపూడి రెబ్బవరం జింకల గూడెం గ్రామాలతో పాటు కొణిజర్ల మండలంలోని పలు గ్రామాల రైతులకు అడ్వాంట కంపెనీ నగదు చెల్లించకుండా తీవ్ర ఇబ్బందులు గురిచేస్తుంది.
పంట కొనుగోలు నగదు వారం రోజుల్లో ఇప్పించే బాధ్యత తనదని మాయ మాటలు చెప్పిన ఆర్గనైజర్ ప్రస్తుతం రైతులు నగదు కోసం ప్రశ్నిస్తుంటే ఇదిగో వస్తాయి అదిగో వస్తాయంటూ చెబుతూ కాలయాపన చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలువురు రైతులు సదరు ఆర్గనైజర్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఒకటి రెండు రోజుల్లో తమ నగదును ఎకౌంట్లో జమ చేయించకుంటే పోలీసులకు ఫిర్యాదు చేస్తామని ఆర్గనైజర్ కు రైతులు స్పష్టం చేసినట్లు సమాచారం. కంపెనీలకు రైతులకు మధ్యవర్తులుగా ఉన్న ఆర్గనైజర్లు తమ స్వలాభం కోసం అన్నదాతలను బలి పశువులు చేస్తున్నారని విమర్శలు ఉన్నాయి. ఇప్పటికైనా సంబంధిత శాఖ జిల్లా ఉన్నతాధికారులు వెంటనే స్పందించి అడ్వాంట కంపెనీ నుంచి తమకు వెంటనే పంట నగదు ఇప్పించాలని అన్నదాతలు కోరుతున్నారు.