- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
చర్లలో పొంగులేటికి ఘన స్వాగతం.. పరామర్శలు.. పలకరింపులతో హోరెత్తిన పర్యటన

దిశ, భద్రాచలం : మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శనివారం చర్ల మండలంలో పర్యటించారు. ఆయనకు టీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. పరామర్శలు, పలకరింపులతో పర్యటన సాగింది. పొంగులేటికి జై కొడుతూ నినాదాలు చేశారు. మహిళలు గ్రామాల్లో ఎదురేగి హారతులు ఇచ్చి స్వాగతం పలికారు. వారికి బహుమానం అందజేశారు. కొత్తపల్లి, రంగాపురం, గొంపల్లి, మొగుళ్లపల్లి, సి. కత్తిగూడెం, సుబ్బంపేట, చర్ల, కేశవపురం, తేగడ, గొమ్ముగూడెం, చిన్న మిడిసిలెరు, సత్యనారాయణపురం, ఆర్. కొత్తగూడెం, కూదునూరు, దేవరపల్లి తదితర గ్రామాల్లో పొంగులేటి పర్యటించారు. ఇటీవల చనిపోయిన పలువురు కుటుంబాలను పరామర్శించారు.
వివిధ ప్రమాదాల్లో గాయపడిన బాధితులను, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారిని పరామర్శించి ఓదార్చారు. ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని ఆర్థిక సహాయం అందజేశారు. పొంగులేటి పర్యటనలో కొత్తగూడెం జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య, పినపాక మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, టీఆర్ఎస్ భద్రాచలం నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ తెల్లం వెంకట్రావు, డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య, పార్టీ చర్ల మండల కార్యదర్శి నక్కినబోయిన శ్రీనివాసయాదవ్, పోట్రు బ్రహ్మానందరెడ్డి, పోలిన లంక రాజు, దొడ్డి తాతారావు తదితరులు ఉన్నారు.
టీఆర్ఎస్లో భగ్గుమన్న విభేదాలు
మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటన సందర్భంగా చర్ల మండల టీఆర్ఎస్ పార్టీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. మంత్రి పువ్వాడ అజయ్కుమార్, పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ఫాలోవర్స్గా పనిచేసే చర్ల మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు సోయం రాజారావు వర్గీయులు ఎవరు పొంగులేటి పర్యటనలో పాల్గొనకుండా దూరంగా ఉన్నారు. కార్యదర్శి నక్కినబోయిన శ్రీనివాసయాదవ్ వర్గీయులు కార్యక్రమాన్ని భుజాలపై వేసుకొని పూర్తిచేశారు. ఈ విషయమై రాజారావుని ప్రశ్నించగా తనకు ఎవరి నుంచి సమాచారం గానీ, ఆహ్వానం గానీ లేదన్నారు.
ఇదే విషయాన్ని జిల్లా అధ్యక్షుని దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. పొంగులేటి పర్యటనలో పాల్గొనవద్దని గతంలో రేగా కాంతారావు భద్రాచలం నియోజకవర్గ ప్రాంత నాయకులకు హెచ్చరించినప్పటికీ ఆయన మాటలను వినకుండా కార్యదర్శి వర్గం ఏర్పాట్లుచేసి ప్రోగ్రాం విజయవంతం చేయడంపై గులాబీ పార్టీ శ్రేణుల్లో రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. అధ్యక్ష, కార్యదర్శి నడుమ దూరం పెంచిన పొంగులేటి పర్యటన మున్ముందు పార్టీలో ఎలాంటి చిచ్చురగిస్తుందోయని పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు.