- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
గురుకుల విద్యార్థిని చితకబాదిన టీచర్

దిశ, అశ్వారావుపేట : క్రమశిక్షణ పేరుతో గురుకుల విద్యార్థిని పీఈటీ టీచర్ గొడ్డును బాదినట్టు బాదిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావు పేటలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట గుర్రాల చెరువు రోడ్డు లోని మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ బాలుర గురుకుల పాఠశాలలో చరణ్ అనే విద్యార్థి ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. అయితే రెండు రోజుల క్రితం చరణ్.. గురుకులంలో భోజనం బాగుండటం లేదని.. మెనూ ప్రకారం ఫుడ్ పెట్టడం లేదని మీడియా ముందు చెప్పాడు. ఆ విషయాన్నే మనసులో పెట్టుకొని పీఈటీ టీచర్ క్రమశిక్షణ నెపంతో చరణ్ను విచక్షణారహితంగా కొట్టి ముఖం, వీపుపై వాతలు తేలేలా గాయపరిచాడని తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు.
అయితే దెబ్బలు కొట్టిన విషయాన్ని తెలిపేందుకు విద్యార్థి తల్లిదండ్రులకు ఫోన్ చేసేందుకు కూడా వీలు లేకుండా సదరు ఉపాధ్యాయుడు వ్యవహరించాడని.. ఇంట్లో వాళ్లకు చెబితే చంపేస్తానని బెదిరించాడని విద్యార్థి చరణ్ తండ్రి ఆరోపించాడు. విద్యార్థులను దండించడంలో ఎటువంటి తప్పు లేదని, కానీ.. భోజనం సరిగ్గా పెట్టడం లేదని చెప్పినందుకు ప్రాణాలు పోయేంతలా కర్కశంగా కొట్టడం ఎంతవరకు సమంజసమని ఆగ్రహం వ్యక్తం చేశాడు. జిల్లా విద్యాశాఖ ఉన్నతాధికారులు స్పందించి సదరు ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్మూర్తి గురుకుల పాఠశాలకు చేరుకుని జరిగిన సంఘటనను ఖండిస్తూ పిఈటీని మందలించారు. మెనూ ప్రకారం విద్యార్థులకు ఆహారాన్ని అందించాలని పాఠశాల యాజమాన్యానికి చెప్పారు.