- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
టెన్త్ పరీక్షల్లో మాస్ కాపీయింగుకు పక్కా ప్లాన్

దిశ, కారేపల్లి : విద్యతో పాటు విచక్షణ కూడా నేర్పించే ఉపాధ్యాయులు అక్రమ మార్గంలో విద్యార్థుల ను మెట్టెక్కించాలనే దుర్మార్గపు ఆలోచన తో కారేపల్లి మండలంలో కొందరు టీచర్లు చేస్తున్న వ్యవహారం ఉపాధ్యాయ లోకానికే చెడ్డపేరు తెచ్చేలా ఉంది. ఉన్నతమైన సమాజ నిర్మాణంలో కీలకపాత్ర పోషించాల్సిన ఉపాధ్యాయులు అక్రమ మార్గంలో విద్యార్థులను ఉత్తీర్ణులను చేయించాలనే ఆలోచన రావడం విచారకరం. దారి చూపే జ్ఞాన దేవతలుగా చెప్పుకునే ఉపాధ్యాయ లోకం అడ్డదారులు తొక్కించేందుకు వ్యూహాలు రచించడం బాధాకరం. పదో తరగతి పరీక్షల్లో మాస్ కాపీయింగ్ చేయించేందుకు ఆశ్రమపాఠశాలల ఉపాధ్యాయులు వ్యవహరిస్తున్న తీరు కారేపల్లి మండలంలో చర్చనీయాంశంగా మారింది.
కాపీయింగ్ వ్యవహారాన్ని గుట్టుచప్పుడు కాకుండా చేసుకునేందుకు మండలంలో టెన్త్ పరీక్షల నిర్వహణ లో కీలకమైన అధికారులు పడుతున్న పాట్లు అంతా ఇంతా కావు. మండలంలోని ఉసిరికాయలపల్లి ఆశ్రమపాఠశాల హెడ్మాస్టర్ నేతృత్వంలో జరుగుతున్న ఈ అక్రమ వ్యవహారం వాయిస్ రికార్డు కూడా దిశ చేతికి చిక్కింది. పరీక్ష కేంద్రాల్లో జరుగనున్న అక్రమతంతును బయటప్రపంచానికి చేరవేసే మాధ్యమాలను సరి చేసుకునే పనిలో బేరసారాలు కుదుర్చుకునే వాయిస్ రికార్డ్ కూడా దిశ చేతిలోకి వచ్చింది. దిశ ఇప్పటికే ఈ అక్రమ వ్యవహారం వ్యూహం పై ఓ ప్రత్యేక కథనం కూడా ఇచ్చింది. ఐనా తగ్గేదేలే అని మాస్ కాపీయింగ్ కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఉన్నతమైన సమాజ నిర్మాణంలో కీలకపాత్ర పోషించాల్సిన ఉపాధ్యాయులు నూరుశాతం రిజల్ట్స్ కోసం పబ్లిక్ ఎగ్జామ్స్ విధానాన్ని అపహాస్యం చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మాస్ కాపీయింగ్ కోసం ప్రత్యేక ఫండ్...
మండలంలోని మూడు ఆశ్రమ పాఠశాల నుంచి లక్ష రూపాయల దాకా ప్రత్యేక ఫండ్ ఏర్పాటు చేసుకుని వాటితో అక్రమాలకు తెర లేపుతున్నారనే విషయం ఇక్కడ బహిరంగ రహస్యమే. అనుకూలమైన ఇన్విజిలేటర్లను విధుల్లో వేయించుకోవడం సీఎస్, డిపార్ట్మెంట్ ఆఫీసర్ తదితర అన్ని ఎగ్జామ్స్ కు సంబంధించిన వాటిని పథకం ప్రకారమే చేపట్టడం వీటన్నింటికీ కీలక సూత్రధారి గా కారేపల్లి జిల్లాపరిషత్ హైస్కూలు చీఫ్ సూపరింటెండెంట్ వ్యవహరిస్తున్నాడని ఆరోపణలు ఉన్నాయి.
ఆరోపణలకు కచ్చితమైన ఆధారాలు కూడా వాయిస్ రికార్డ్ ద్వారా లభ్యమయ్యాయి. కారేపల్లి మండలంలో 13 ప్రభుత్వ, మూడు ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలల టెన్త్ విద్యార్థుల కోసం ప్రభుత్వం మూడు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసింది. మండల కేంద్రమైన కారేపల్లిలో రెండు, గాంధీనగరంలోని కోమాట్లాగూడెం హైస్కూల్ లో ఒకటి ఏర్పాటు చేశారు. మూడు కేంద్రాల్లో 613 మంది విద్యార్థులు పరీక్షలు రాసేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ మూడు కేంద్రాల్లో కోమాట్లాగూడెం కేంద్రాన్ని సీ సెంటర్ గా పరిగణిస్తారు. మండల కేంద్రానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోమాట్లాగూడెం పరీక్ష కేంద్రం నుంచే అక్రమాలకు పాల్పడటం, ఇక్కడ నుంచే బిట్ పేపర్ కూడా ముందుగానే బయటికి వచ్చే ఏర్పాట్లు వ్యూహ రచనలో భాగమనే చెప్పవచ్చు. గతంలో ఈ ముఠా టెన్త్ పేపర్లను ముందు గానే లీక్ చేయించారనే ఆరోపణలు ఉన్నాయి. అందుకే నూరుశాతం ఫలితాలు కూడా సాధించారనే ప్రచారం గతంలో ఉపాధ్యాయ వర్గాల్లోనూ జరిగింది.
కోమట్లగూడెం సెంటర్ సీఎస్ మార్పు పై మతలబమేంటి?..
మండలంలోని సీ సెంటర్ గా పరిగణిస్తున్నకోమాట్లాగూడెం టెన్త్ సెంటర్కు మొదట పేరుపల్లి హైస్కూలు హెడ్మాస్టర్ ను సీఎస్ గా వేశారు. కొన్ని గంటల వ్యవధిలోనే ఇతన్ని మార్చి మేకల తండా ఆశ్రమపాఠశాల హెడ్మాస్టర్ ను సీఎస్గా వేయించారు. పేరుపల్లి హెడ్మాస్టర్ మాస్ కాపీయింగ్ కు సహకరించరనే ఉద్దేశంతో మార్పులు చేశారని ప్రచారం జరుగుతుంది.
దీంతోపాటు కోమాట్లాగూడెం పరీక్ష కేంద్రంలో ఉసిరికాయలపల్లి, రేలకాయలపల్లి ఆశ్రమ పాఠశాలల విద్యార్థులంతా ఈ కేంద్రంలోనే పరీక్ష రాస్తున్నారు కాబట్టి మేకల తండా ఆశ్రమ పాఠశాల హెడ్మాస్టర్ను ఇక్కడ సీఎస్ గా వేశారని ఆరోపణలు ఉన్నాయి. మేకల తండా ఆశ్రమ పాఠశాల విదార్థులు కారేపల్లి జెడ్పీ హైస్కూల్ సెంటర్లో పరీక్ష రాస్తున్నారు గనుక ఈ విద్యార్థులను చూసుకునే విధంగా లోపాయకారి ఒప్పందం కుదుర్చుకుని మాస్ కాపీయింగ్ కు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.
టార్గెట్లతోనే ఆశ్రమ స్కూళ్ల అడ్డదారులు..
పేద గిరిజన విద్యార్థుల విద్య కోసం గిరిజన సంక్షేమశాఖ కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తుంది. కోట్లు ఖర్చు చేసినా లక్ష్యం నెరవేరకపోవడంతో గిరిజన సంక్షేమశాఖ ఉన్నతాధికారులు గిరిజన ఆశ్రమ పాఠశాలలకు టెన్త్ లో టార్గెట్ లను విధించింది. సరైన విధ్యనందించడంలో ఆశ్రమ టీచర్లు చిత్తశుద్ధితో పనిచేయడం మాని పరీక్షల సమయంలో అడ్డదారులు వెతుకుతూ అక్రమ మార్గంలో ఫలితాలను సాధిస్తున్నారు. పిల్లలు పాస్ కాకపోతే మెమోలు వస్తాయని, ఇంక్రిమెంట్లు కట్ అవుతాయని ఇలాంటి మార్గాలు ఎంచుకుంటున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కారేపల్లి మండలంపై కలెక్టర్ దృష్టి పెట్టాలి..
ఖమ్మం జిల్లాపై పట్టు సాధించి అన్ని శాఖలను హడ లెత్తిస్తున్న కలెక్టర్ విద్యాశాఖ పై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రధానంగా కారేపల్లి మండలంలో టెన్త్ పరీక్షల నిర్వహణ అస్తవ్యస్తంగా, అక్రమ మార్గాల్లో నిర్వహించడానికి చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.