సామాన్య మానవుడు బ్రతికే పరిస్థితి లేనేలేదు.. మావోయిస్టు కార్యదర్శి ఆజాద్ లేఖ

by Vinod kumar |
సామాన్య మానవుడు బ్రతికే పరిస్థితి లేనేలేదు.. మావోయిస్టు కార్యదర్శి ఆజాద్ లేఖ
X

దిశ ప్రతినిధి, కొత్తగూడెం: తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ సంస్థలు ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాయా..? ప్రభుత్వం విద్యుత్ సంస్థలను నడిపింస్తుందో అర్థం కాని పరిస్థితి దాపరించిందని మావోయిస్టు కార్యదర్శి ఆజాద్ పేరిట గురువారం ఓ లేఖ విడుదల చేశారు. నిజానికి ఒక్క విద్యుత్ రంగమే కాదు ఏ ప్రభుత్వ రంగ సంస్థలను చూసినా ఇదే అనిపిస్తుందని, ప్రభుత్వం ప్రజలకు చేయూతనిచ్చే బాధ్యత నుంచి పూర్తిగా తప్పుకొని ప్రజలపై భారం వేసి పాలన సాగించే కొత్త ఒరవడిలో పాలన సాగుతోందని అన్నారు.

ఒక పక్క బహుళజాతి కంపెనీలు, విదేశీ సంస్థలు, స్వదేశీ పెట్టుబడి, దళారీ సంస్థలకు పెద్ద ఎత్తున రాయితీలను ఇస్తూ వారి పల్లకీలను మోసే బాధ్యతలను ప్రభుత్వాలు నిస్సిగ్గుగా అమలు చేస్తున్నాయి. అసలు సామాన్య మానవుడు బ్రతికే పరిస్థితి లేనేలేదు. నిత్యం ప్రజల పై ఏదో ఒక రూపంలో పన్నులు, టాక్స్ లు బలవంతంగా ప్రభుత్వాలు వసూలు చేస్తూనే ఉన్నాయి. సంక్షేమ పథకాల ఎంగిలి మెతుకులు విసిరేస్తూ పేదలను బ్రమల్లో ఉంచి నిత్యం పేదలపై కానరాని భారం మోపి సామాన్యుడి నడ్డి విరుస్తున్నారు. పైగా తమది సంక్షేమ ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని. పేదల బతుకు అమ్మబోతే అడవి కొనబోతే కొరివి అన్నట్లు తయారైందని లేఖలో తెలిపారు.

ఇప్పటికే విద్యుత్ చార్జీల మూలంగా సామాన్యుడు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడు. రకరకాల చార్జీల పేరుతో, స్లాబుల పేరుతో యూనిట్ రేట్లు పెంచి దోపిడీ చేస్తున్న విద్యుత్ సంస్థలు కొత్తగా "అడిషనల్ కన్జప్షన్ డిపాజిట్" (ఏ సి డి) ప్రజల దగ్గర నుంచి వసూలు చేస్తున్నారు. అర్థం పర్థం లేని ప్రజలకు అర్థం కాని పద్ధతిలో రకరకాల పేర్లతో ఈ వసూల్ యదేశ్చగా సాగడం హేయమైన చర్య. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎన్నడూ లేనంత రికార్డ్ స్థాయిలో ఇటీవల కాలంలో విద్యుత్ చార్జీలు పెంచారు.

గృహ వినియోగదారులకు యూనిట్ కి 50 పైసలు, గృహేతర వినియోగదారులకు యూనిట్ కి రూపాయి పెంచి బలవంతంగా ప్రజల దగ్గరనుంచి వసూల్ చేస్తున్నారు. దీనికి తోడు అపరాధ రుసుం పేరుతో మరొక దోపిడీకి ఈ సంస్థలు పూనుకుంటున్నాయి. సంక్షేమం పేరుతో ప్రభుత్వాలు అప్పులు చేయడం వాటిని తీర్చేందుకు తిరిగి ప్రజలపై భారం వేయడం చాలా దుర్మార్గం. విద్యుత్ సంస్థలు కొత్తగా తీసుకొచ్చిన ఏపీడీ చార్జీలకు వ్యతిరేకంగా ప్రజలు పోరాడాలని మావోయిస్టు పార్టీ పిలుపునిస్తోంది.

వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఏమైంది..?

ఉమ్మడి రాష్ట్రంలో కరెంట్ కష్టాలు ప్రస్తుతం తెలంగాణలో కనిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం సాధిస్తే అన్ని సమస్యలు తీరినట్లే అన్న కేసీఆర్ ప్రస్తుతం తెలంగాణాలో అమలవుతున్న కరెంట్ కోతలకు ఏమి సమాధానం చెపుతాడో. ప్రజలే ప్రశ్నించాలి. తెలంగాణలో వ్యవసాయం అంతా ఎక్కువ విద్యుత్ మోటార్లపై ఆధారపడి ఉంది. రాష్ట్రంలో 27 లక్షల వ్యవసాయ కనెక్షన్లకు, 5 లక్షలకు పైగా ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయి. నిత్యం వ్యవసాయానికి ఇచ్చే కరెంటు ఎప్పుడు వస్తుందో అర్థం కాక రైతన్నలు వారి మోటార్ల దగ్గర రాత్రి, పగలు పడిగాపులు కాస్తున్నారు.

అధికారం కోసం కేసీఆర్ చెప్పిన మాటలు. ఇచ్చిన హామీలు అన్నీ డొల్ల అని తేలిపోయింది. ఒక పక్క తమ పంటచేలో రైతన్నలు విద్యుత్ కోసం ఎదురుచూడటం, మరో పక్క చాలీ చాలని కరెంటుతో తమ విద్యుత్ మోటర్లు కాలిపోయి, మరో వైపు నీరు సరిపోక పంటలు ఎండిపోతున్న దయనీయ పరిస్థితుల్లో తెలంగాణా రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందని లేఖలో పేర్కొన్నారు. 24 గంటల ఉచిత విద్యుత్ హామీను తుంగలో తొక్కిన కేసీఆర్ బీఆర్ ఎస్ పార్టీ పై రైతన్నలు తిరగబడాల్సిన సమయం ఆసన్నమైంది. వ్యవసాయానికి సమయానుసారం విద్యుత్ కోసం రైతన్నలు పోరాడాలని పిలుపునిస్తున్నాం అంటూ గురువారం రోజు విడుదల చేసిన లేఖలో పేర్కొన్నారు.



Next Story

Most Viewed