- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
మావోయిస్టుల ఘాతుకానికి 10 మంది జవాన్లు.. ఒక డ్రైవర్ మృతి

దిశ, భద్రాచలం : చత్తీస్గఢ్లో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. డీఆర్జీ జవాన్లు కూంబింగ్కి వెళ్లివచ్చే మార్గంలో మాటువేసిన మావోయిస్టులు శక్తివంతమైన ఐఈడీ పేల్చి 10 మంది జవాన్లతోపాటు ఒక మినీ వ్యాన్ డ్రైవర్ని బలితీసుకున్నారు. ఈ ఘటన పట్ల ఛత్తీస్గఢ్ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేష్ బాగెల్ తీవ్రంగా స్పందించారు. మావోయిస్టులను అంతం చేస్తామని ప్రకటించారు. అమరులైన జవాన్లకు సంతాపం ప్రకటించి వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. జవాన్ల కుటుంబాలను ఆదుకుంటామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయి. ఈ దుర్ఘటనని బస్తర్ ఐజీ సుందర్రాజ్. పి ధృవీకరించారు. ఆ ప్రాంతంలో మావోయిస్టుల వేట ముమ్మరం చేసినట్లుగా తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దంతెవాడ జిల్లా అరన్పూర్ పోలీస్స్టేషన్ పరిథిలోని మండేదా అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు ఉన్నట్లుగా నిఘా వర్గాల నుంచి అందిన సమాచారం మేరకు పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాలతో మంగళవారం కూంబింగ్ కు వెళ్లిన డిఆర్జి జవాన్ల బృందం బుధవారం ఉదయం మినీ వ్యాన్లో తిరిగి వస్తుండగా మాటువేసిన మావోయిస్టులు మందుపాతర పేల్చారు. అత్యంత శక్తివంతమైన ఐఈడీ పేలుడు ధాటికి డీఆర్జీ జవాన్లు ప్రయాణిస్తున్న వాహనం తునాతునకలుకాగా అందులో ఉన్న పదిమంది జవాన్లు, వాహన డ్రైవర్ ఈ దాడిలో మరణించారు. మందుపాతర దాడిలో హెడ్ కానిస్టేబుల్స్ సోడి జోగా, మున్నారామ్ కడ్తి, సంతోష్ తమో, కానిస్టేబుల్స్ దుల్గో మాండవి, లక్ష్ము మార్కం, జోగా కవాసి, హరిరామ్ మాండవి, జవాన్లు రాజు రామ్ కర్తమ్, జైరాం పొడియం, జగదీష్ కవాసిలతోపాటు వాహన డ్రైవర్ ధనిరామ్ యాదవ్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. దంతెవాడ జిల్లాలో జరిగిన ఈ సంఘటన పట్ల సరిహద్దు తెలంగాణ ప్రాంత పోలీసులు అప్రమత్తమైనారు.