రూ. 8.45 లక్షలు చెల్లించినా...పని కావడం లేదు

by Sridhar Babu |
రూ. 8.45 లక్షలు చెల్లించినా...పని కావడం లేదు
X

దిశ, వైరా : పొలం మధ్యలో అడ్డుగా ఉన్న 11 కేవీ విద్యుత్ లైన్ మార్చేందుకు ఎన్పీడీసీఎల్ కు 8.45 లక్షల నగదును చెల్లించా.... ప్రమాదకరంగా పొలం మధ్యలో ఉన్న లైన్ మార్చాలని వైరా విద్యుత్ శాఖ అధికారులను ఆశ్రయించా....అధికారులు స్కెచ్ వేసి విద్యుత్ లైన్ మార్చేందుకు ఎన్పీడీసీఎల్ కు 8.46 లక్షల రూపాయలను చెల్లించాలని సూచించారు... నగదు చెల్లించి పది నెలలు దాటింది. నగదు చెల్లించిన తర్వాత నెల రోజుల్లోపు చేయాల్సిన పనులను 10 నెలలు అయినా చేయకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు...

చెప్పులు అరిగేలా తమను విద్యుత్ కార్యాలయం చుట్టూ తిప్పుకుంటున్నారు... అధికారుల నిర్లక్ష్యపు తీరుపై కన్జ్యూమర్ సెల్ ను ఆశ్రయిస్తా"... అంటూ ఓ బాధితుడు తన ఆవేదనను వెళ్లబుచ్చారు. ఖమ్మం కు చెందిన పాలెపు వెంకటరమణకు సంబంధించిన పనులన్నీటిని చక్కదిద్దే ఉప్పెర్ల వెంకటేశ్వర్లు విద్యుత్ అధికారుల వేధింపుల వివరాలను దిశకు తెలిపారు. విద్యుత్ లైన్ మార్చకపోతే తాను ఎన్పీడీసీఎల్ కు చెల్లించిన నగదును తిరిగి ఇవ్వాలని వేడుకున్నా విద్యుత్ అధికారులు కనికరించటం లేదని ఆయన వాపోయారు.

పది నెలలు దాటినా....ప్రారంభం కానీ పనులు.....

వైరా మండలంలోని సిరిపురం గ్రామంలో ఖమ్మంకు చెందిన పాలేపు వెంకటరమణకు సంబంధించి పది ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. అయితే వ్యవసాయ భూమి మధ్య భాగంలో 11 కేవీ విద్యుత్ వైర్ ప్రమాదకరంగా ఉంది. అయితే విద్యుత్తు లైన్ మార్చాలని వెంకటరమణ పనులను చక్కబెట్టే ఉప్పెర్ల వెంకటేశ్వర్లు వైరా విద్యుత్ శాఖ అధికారులను ఆశ్రయించాడు. ఈ లైన్ ను పరిశీలించిన విద్యుత్ అధికారులు స్కెచ్ వేసి రూ.8.46 లక్షలు ఎన్పీడీసీఎల్ కు చెల్లించాలని ఆయనకు సూచించారు.

2022 జూలై 7వ తేదీన వైరాలోని ఎస్బీఐ బ్యాంకు లో వెంకటరమణ టీఎస్ ఎన్పీడీసీఎల్ కు రూ. 8,46,206 నగదును డిపాజిట్ చేశారు. అయితే పది నెలలు దాటినా నేటి వరకు విద్యుత్ అధికారులు విద్యుత్ లైన్ పనులను ప్రారంభించలేదు. వెంకటరమణ నగదు చెల్లించిన తరువాత రెండు నెలలు పొలంలో పంట వేయకుండా ఖాళీగానే ఉంది. ఆ తర్వాత మిర్చి పంట వేశాడు. అయినప్పటికీ పంట ఆగమైనా విద్యుత్తు లైన్ వేయాలని విద్యుత్ అధికారులకు మొరపెట్టుకున్నారు. గత మార్చి 1వ తేదీన పంట కాలం పూర్తయింది. మార్చి నెల నుంచి ఇప్పటి వరకు కూడా వెంకటేశ్వర్లు చెప్పులు అడిగేలా విద్యుత్ కార్యాలయం చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. కానీ మభ్య పెట్టే మాటలు చెబుతూ విద్యుత్ అధికారులు కాలం వెల్లతీస్తున్నారు. దీంతో విసిగి వేసారిన వెంకటేశ్వర్లు విద్యుత్ అధికారుల వేధింపుల గురించి దిశ ను ఆశ్రయించాడు.

తాము రూ.8.46 వేల రూపాయలను చెల్లించి పది నెలలుగా విద్యుత్ లైన్ కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్తు లైన్ వేయటం కుదరదు అంటే తన నగదును రిటన్ ఇవ్వాలని ఆయన అధికారులను వేడుకున్నా ఫలితం లేకుండా పోయింది. నెలకు లక్షలాది రూపాయలు జీతం తీసుకుంటున్న విద్యుత్ శాఖ అధికారులు ఎన్పీడీసీఎల్ కు నగదు చెల్లించినా పనులను చేయకుండా తమ నిర్లక్ష్యాన్ని చాటుతున్నారు. వైరా విద్యుత్ శాఖలో ఇలాంటి బాగోతాలు అనేకమున్నా సీఎండీ పట్టించుకోకపోవటం పలు అనుమానాలకు దారితీస్తుంది.

వైరా డీఈ కృష్ణకు విద్యుత్ లైన్ ను ప్రారంభించమని చెప్పామని స్థానిక అధికారులు తప్పుడు సమాచారం ఇచ్చారు. ఈ విషయమై వైరా ఏడీ రామకృష్ణను దిశ వివరణ కోరగా రైతు పొలంలో 10 నెలలుగా పంట ఉండటం వల్లనే విద్యుత్తు లైన్ వేయలేకపోయామని తప్పుడు వివరణ ఇవ్వటం విశేషం. ఏ పంట అయినా పది నెలలు ఎలా ఉంటుందని ప్రశ్నించగా తనకు ఏఈ చెప్పిన విషయాన్ని మీకు చెబుతున్నానని తప్పించుకునే విధంగా వివరణ ఇవ్వడం గమనార్హం.

విద్యుత్ అధికారుల ఆగడాలపై కన్జ్యూమర్ సెల్​ను ఆశ్రయిస్తా....

వైరా డివిజన్ పరిధిలోని విద్యుత్ అధికారుల నిర్లక్ష్యపు, బాధ్యత రాహిత్య ఆగడాలపై, వినియోగదారుల పనులు చేయకుండా వేధిస్తున్న అంశంపై తాను కన్జ్యూమర్ సెల్ ను తప్పక ఆశ్రయిస్తానని బాధితుడు ఉప్పెర్ల వెంకటేశ్వర్లు దిశకు తెలిపారు. తాము నెలల తరబడి నిరీక్షించామని, ఇంకా అధికారుల మాటల నమ్మి నిరీక్షించలేమని స్పష్టం చేశారు. అధికారులు కాలం వెళ్ళదీస్తూ విద్యుత్ వినియోగదారులను తీవ్రంగా ఇబ్బందులు గురి చేస్తున్నారని ఆరోపించారు.

మొదట విద్యుత్ లైన్ ను పరిశీలించిన అధికారులు లైను మార్చడం కుదరదు అంటే తాము లక్షలాది రూపాయలను ఎన్పీడీసీఎల్ కు చెల్లించే వారిమే కాదన్నారు. కాంట్రాక్టర్ రాక పనులు చేయలేకపోతున్నాం అంటున్న అధికారులు 10 నెలలుగా పని చేయని కాంట్రాక్టర్ పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆయన డిమాండ్ చేశారు. తాను కన్జ్యూమర్ సెల్ ను ఆశ్రయించి తనకు జరిగిన నష్టాన్ని పూర్తిస్థాయిలో వివరిస్తానని స్పష్టం చేశారు.



Next Story