పటేల్ రమేష్ రెడ్డికి ఇస్తే సూర్యాపేటలో కూడా గెలిచే వాళ్ళం: రాజగోపాల్ రెడ్డి

by Disha Web Desk 2 |
పటేల్ రమేష్ రెడ్డికి ఇస్తే సూర్యాపేటలో కూడా గెలిచే వాళ్ళం: రాజగోపాల్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: సూర్యాపేట టికెట్‌ను పటేల్ రమేష్ రెడ్డికి ఇస్తే కాంగ్రెస్ పార్టీ గెలిచేదని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. కేటీఆర్ పొలిటిషియన్ కాదన్నారు. అసెంబ్లీ ఆవరణలో మీడియాతో గురువారం చిట్ చాట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ మహా సముద్రం అన్నారు. ఇవాళ ప్రజాస్వామ్య ప్రభుత్వం వచ్చిందన్నారు. ఎవరైనా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే వాళ్లు రావొచ్చు, పదవులు మాత్రం ఇవ్వబోమన్నారు. కేబినెట్ విస్తరణ ఎప్పుడూ ఉంటదో తనకు తెలియదన్నారు. నల్లగొండ జిల్లాలో ఉన్న బీఆర్ఎస్ నేతలు సచ్చిన పాములు అని ఎద్దేవా చేశారు. రాజకీయాల్లో చిన్న ఇన్సిడెంట్ చాలు ప్రభుత్వం పోవడానికి... ఉండడానికి అన్నారు. రాబోయే రోజులు ఎలా ఉంటాయో తెలియదు గాని, ఇప్పుడు అయితే మాకు ఎటువంటి ఢోకా లేదని, ఐదేళ్లు ఉంటామన్నారు.

కేసీఆర్ ఆ బంధు.. ఈ బంధు ఇచ్చి చివరకి బొందలో పడ్డాడని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ పార్టీ పేరు మార్చుకోవాలని సూచించారు. ఆ పార్టీ అధ్యక్షుడిగా హరీష్ రావుని చేయాలన్నారు. రియల్ పొలిటిషియన్ హరీష్ రావు మాత్రమే అన్నారు. కేసీఆర్‌కు రాజకీయా వారసుడు ఆయన మాత్రమేనని, పార్టీ నడపడం కేటీఆర్ వల్ల కాదు అన్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్ ఉన్నా, హరీష్ రావు మాత్రం పార్టీ అధ్యక్షుడిగా ఉండాలని ఆకాంక్షించారు. ప్రస్తుతం బీఆర్ఎస్ కొన ఊపిరితో ఉన్నదని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్, బీజేపీ ఇద్దరు కలిస్తే ఇద్దరూ ఖతం అవుతారన్నారు. ఆ రెండు కలిసి పోటీ చేస్తే మెదక్‌లో కూడా బీఆర్ఎస్ పార్టీ గెలవదని జోస్యం చెప్పారు. ఈసారి కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో లోక్ సభ సీట్లు 12 నుండి 14 సీట్లు వస్తాయన్నారు. ఎంఐఎం పార్టీ ఐదేళ్ల పాటూ కాంగ్రెస్ పార్టీతోనే ఉంటుందన్నారు.

బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు తీసుకునే నిర్ణయంపై ఉంటుందన్నారు. ఆ పార్టీలో హరీష్ రావు ఉంటేనే పార్టీ బతుకుతుందన్నారు. నల్లగొండ జిల్లాలో బీఆర్ఎస్ సభ ప్రభావం లోక్ సభ ఎన్నికల్లో పడదన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి భువనగిరి ఎంపీ టికెట్ బీసీకి ఇచ్చినా తాము దగ్గర ఉండి గెలిపిస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీలో మల్లారెడ్డికి ఛాన్స్ లేదని, వచ్చినా ఆయనకు మల్కాజ్ గిరి టికెట్ ఇచ్చే ఛాన్సే లేదన్నారు. ప్రజాస్వామ్యం గురించి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతుంటే దెయ్యాలు, వేదాలు వల్లించినట్లుందన్నారు. ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలు వైఎస్ఆర్ ఉన్నప్పుడు ఎలా ఉన్నదో, ఇప్పుడు అలానే ఉన్నదన్నారు. సభలో పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతున్న తీరు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉన్నదన్నారు. అమరావతి మొత్తం ఔట్ అయిపోయిందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు ఈసారి టప్ ఉంటాయని, షర్మిళ ప్రభావం ఉంటుందన్నారు. రాజ్యసభ అభ్యర్ధుల ఎంపికను ఏఐసీసీ నిర్ణయం తీసుకుందన్నారు.


Next Story