లిక్కర్ స్కాం వెనుక కవిత సరే.. డ్రగ్స్ మాఫియా వెనుక ఎవరు?

by Disha Web Desk 16 |
లిక్కర్ స్కాం వెనుక కవిత సరే.. డ్రగ్స్ మాఫియా వెనుక ఎవరు?
X

దిశ, తెలంగాణ బ్యూరో: లిక్కర్ మాఫియాలో ఎమ్మెల్సీ కవిత ఉంటే, మరి డ్రగ్స్ మాఫియా వెనుక ఎవరున్నారో డీజీపీ మౌనాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చని మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు ఆరోపించారు. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు భంగం కలిగించేలా సన్‌బర్న్ కార్యక్రమానికి పర్మిషన్ ఇవ్వొద్దని గురువారం సునీతారావు డీజీపీకి, ఎక్సైజ్‌శాఖ కమిషనర్‌కు వినతి పత్రం అందజేశారు. హైదరాబాద్ శంషాబాద్‌లో నిర్వహించనున్న సన్‌బర్న్ కార్యక్రమాలను ప్రారంభిస్తే మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో అడ్డుకుంటామని హెచ్చరించారు.

రాష్ట్రంలో లిక్కర్ ఏరులై పారుతుందని, డ్రగ్స్ కల్చర్ విపరీతంగా పెరిగిపోయిందని దీంతో చిన్న పిల్లల నుంచి పండు ముసలి వరకు అత్యాచారాలకు, దాడులకు గురవుతున్నారని ఆరోపించారు. ఇప్పటికే ఎక్సైజ్ కమిషనర్‌ను కూడా కలిసి ఇలాంటి కార్యక్రమాలకు లిక్కర్‌ను సరఫరా చేయొద్దని కోరామని వివరించారు. గోవా, కర్ణాటక రాష్ట్రాలు బ్యాన్ చేసిన ఈ కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వం స్వాగతించడాన్ని బట్టి చూస్తే రెవెన్యూ కోసం ఎంతకైనా దిగజారుతుందని అర్థమవుతుందన్నారు. తెలంగాణ క్రైమ్ రేటులో దేశంలో అగ్రస్థానంలో ఉండటం సిగ్గుచేటని విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి పోలీసులు పొలిటికల్ ఏజెంట్లుగా మారారని ఆరోపించారు.



Next Story

Most Viewed