- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
కోట్ల ఖర్చుతో మొక్కలు నాటారు.. పెరిగాక నరికారు..!

దిశ, మానకొండూరు: కరీంనగర్ జిల్లా, మానకొండూరు మండల కేంద్రంలో చోటుచేసుకున్న హృదయ విదారక ఘటన ఇది. ఒకవైపు పచ్చదనం పెంపొందించాలని ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చిస్తుంటే, క్షేత్రస్థాయిలో అధికారుల నిర్లక్ష్యం ఆ ప్రయత్నాలను నీరుగారుస్తుంది. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం కేంద్రం నుంచి అన్నారం, లలితా పూర్, రంగపేట, పోచంపల్లి, పచ్చునూర్, ఊటూర్ ప్రధాన రహదారి వెంట హరితహారం పథకం కింద ఎంతో ఆర్భాటంగా వేలాది మొక్కలు నాటారు. అయితే, వాటిని సంరక్షించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. కనీసం నీరు కూడా అందించకపోవడంతో చాలా మొక్కలు ఎండిపోయాయి. ఇంతటితో ఆగకుండా, రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చేపట్టిన ఈ మొక్కల పెంపక కార్యక్రమంలో మరో విస్మయ కరమైన విషయం చోటుచేసుకుంది. రహదారి వెంట ఉన్న విద్యుత్ స్తంభాల కింద ఉపాధి హామీ పథకం ద్వారా మొక్కలు నాటడం జరిగింది. విద్యుత్ లైన్ల కింద పెరిగే చెట్లు భవిష్యత్తులో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిస్తాయనే ప్రాథమిక అవగాహన కూడా లేకుండా అధికారులు వ్యవహరించారు. ఫలితంగా, ఇప్పుడు ఆ మొక్కలు కాస్త ఎదిగిన తర్వాత విద్యుత్ శాఖ సిబ్బంది వాటిని నరికి వేస్తున్నారు.
ప్రభుత్వ అధికారుల సమన్వయ లోపం, ముందుచూపు లేకపోవడం వల్లే ఈ దుస్థితి నెలకొందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కళ్లెదుటే ప్రజాధనం వృథా అవుతుంటే సంబంధిత అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండల పరిషత్ అధికారులు మొక్కల పెంపకం విషయంలో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని స్పష్టంగా తెలుస్తోంది. నాటిన మొక్కలకు కనీస రక్షణ కూడా కరువైంది. మండే ఎండల్లో ఆ మొక్కలు తల్లడిల్లుతుంటే వాటిని నీటితో కాపాడాల్సిన అధికారులు అసలు పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. మొత్తానికి, అధికారుల నిర్లక్ష్యం కారణంగా కోట్ల రూపాయల ప్రజాధనం వృథా కావడమే కాకుండా, పర్యావరణ పరిరక్షణకు జరుగుతున్న ప్రయత్నాలు కూడా విఫలమవుతున్నాయి. ఈ ఘటనపై ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు జరగకుండా రోడ్డు వెంట ఉన్న చెట్లు మొక్కలను ఎండిపోకుండా, వాటిని నరికేయకుండా రక్షించడానికి అధికారులు చొరవ తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.