- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్ (Operation sindoor)
10వ తరగతి ఫెయిల్ అయిన విద్యార్థుల పై ప్రత్యేక దృష్టి పెట్టాలి : కలెక్టర్ పమేలా సత్పతి

దిశ, కరీంనగర్ కలెక్టరేట్ : రానున్న విద్యా సంవత్సరంలో అంగన్వాడీ కేంద్రాల్లో, ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్లు పెంచాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. అంగన్వాడీల్లో ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్ల పెంపు, పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు తదితర అంశాలపై ఐసీడీఎస్, విద్యాశాఖ సమన్వయ సమావేశం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అంగన్వాడి బాట నిర్వహించి ఆరు సంవత్సరాల లోపు పిల్లలందరినీ అంగన్వాడీలో చేర్పించాలని ఆదేశించారు. అంగన్వాడి సేవలను, నూతన సిలబస్ ద్వారా ఇస్తున్న ప్రత్యేక బోధనను గురించి తల్లిదండ్రులకు తెలియజేస్తూ నమోదును పెంచాలని అన్నారు. అంగన్వాడీలో ప్రీస్కూల్ పూర్తి చేసిన పిల్లలందరి జాబితా మండల విద్యాధికారులకు సమర్పించాలని సూచించారు. ఈ జాబితాలో ఉన్న పిల్లలందరూ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చేరేలా ప్రధానోపాధ్యాయులు, ఎంఈఓలు ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించారు. ప్రైవేటు భవనాల్లోని అంగన్వాడీ కేంద్రాలన్నీ స్థానిక ప్రభుత్వ పాఠశాలలకు, ఖాళీగా ఉన్న ప్రభుత్వ భవనాలకు మార్చాలని ఆదేశించారు. ఇప్పటికే మార్చాల్సిన అంగన్వాడి కేంద్రాలను గుర్తించామని, ప్రభుత్వ భవనాల్లో ఈ కేంద్రాలకు కావలసిన వసతులు సమకూరుస్తామని అన్నారు.
2015 నుంచి 2023 వరకు పదో తరగతి ఫెయిల్ అయి చదువు ఆపేసిన విద్యార్థులందరినీ గుర్తించి వచ్చే సంవత్సరం వారు 10వ తరగతిలో ఉత్తీర్ణులయ్యేలా అవగాహన కల్పించాలని మండల విద్యాధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ ఏడాది పదో తరగతి ఫెయిల్ అయిన విద్యార్థులందరూ వచ్చే జూన్ నెలలో సప్లిమెంటరీ రాసి ఉత్తీర్ణులు అయ్యేలా శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.
అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయి మాట్లాడుతూ మండల విద్యాధికారులు ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలను సందర్శించాలని ఆదేశించారు. అక్కడ మౌలిక వసతుల కల్పనకు గ్రౌండింగ్ పై దృష్టి పెట్టాలని అన్నారు. సమ్మర్ క్యాంపులను పరిశీలించాలని, బడిబాట పై దృష్టి పెట్టాలని తెలిపారు. ఈ సమావేశంలో డీటీడీఓ పవన్ కుమార్, జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, జిల్లా విద్యాధికారి జనార్దన్ రావు, క్వాలిటీ కోఆర్డినేటర్ అశోక్ రెడ్డి, కోఆర్డినేటర్లు మిల్కూరి శ్రీనివాస్, ఆంజనేయులు, సీడీపీఓలు సబితా, నర్సింగారాణి, సుగుణ, మండల విద్యాధికారులు సూపర్వైజర్లు పాల్గొన్నారు.