తగ్గిన గన్నీ సంచుల సైజ్.. గందరగోళ పరిస్థితుల్లో రైతులు

by Aamani |
తగ్గిన గన్నీ సంచుల సైజ్.. గందరగోళ పరిస్థితుల్లో రైతులు
X

దిశ, ఎల్లారెడ్దిపేట : ఎల్లారెడ్దిపేట మండలంలో ఇందిరా క్రాంతి పథం కింద మహిళలు నిర్వహిస్తున్న వడ్ల కొనుగోలు కేంద్రాలలో గన్నీ సంచుల సైజ్ చిన్నగా వచ్చాయని గతంలో మాదిరిగా 42 కిలోలు తూకం వేసేలా గన్నీ సంచులు పంపించాలని రైతులు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ను కోరారు. ప్రతి యేటా 42 కిలోల వడ్లు రైతులు తూకం వేసేది.ఇందుకు తగ్గట్టుగా గన్నీ సంచులు రాష్ట్ర ప్రభుత్వం వడ్ల కొనుగోలు కేంద్రాలకు సరఫరా చేసేది.అప్పట్లో కొత్త, పాత సంచులు అన్ని కలిపి 42 కిలోలు దాన్యం తూకం వేసేలా సంచులు సప్లై అయ్యేది. కానీ ఈ సారి కొత్త గన్నీ సంచులు ఐకెపి కేంద్రాలకు సరఫరా చేయడం జరిగింది. వాటిని తూకం వేయడం కోసం ఎలక్ట్రికల్ యంత్రాల పై ఉంచగా 36 కిలోల 700 గ్రాముల వడ్లు మాత్రం తూకం వేస్తున్నారు.

ఇదేమిటని ఐకేపీ అధికారులను ప్రశ్నించగా సివిల్ సప్లై శాఖ వారు కొత్త సంచులు 37 కిలోలు 600 గ్రాముల వడ్లు నింపేలా సంచులు రావడం జరిగిందని వీటిని మార్చి కొత్త సంచులు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినట్లు ఐకేపీ ఏపిఎం మల్లేశం దిశ కు తెలిపారు. రైతులను సంచులు తెచ్చుకొమ్మని చెబుతున్నారు. 36 కిలోల 700 గ్రాముల వడ్లు తూకం వేస్తున్నారని ఇదేమిటని ఐకేపి అధికారులను ప్రశ్నిస్తే మీరే యూరియా, దుక్కి మందు సంచులు తెచ్చుకొని మిగితా వడ్లు కాంటాలు చేసుకోవాలని సూచిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వరి పంట ఊస తిరిగిపోయిందని, మెడ వంపు రోగం వచ్చి వడ్లు కూడా దిగుబడి రావడం లేదని ఐకేపి అధికారులు చేస్తున్న నిర్వాకం మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు అయిందని మండల రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.



Next Story

Most Viewed