ఏం సాధించారని దశాబ్ది ఉత్సవాలు.. ఎంపీ బండి సంజయ్

by Disha Web Desk 20 |
ఏం సాధించారని దశాబ్ది ఉత్సవాలు.. ఎంపీ బండి సంజయ్
X

దిశ, కరీంనగర్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం ఏం సాధించిందని దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. ‘‘కేసీఆర్ పాలనలో ఏ ఒక్క వర్గమైనా సంతోషంగా ఉందా ? దశాబ్ది ఉత్సవాల పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తారా ? ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చకుండా ప్రజల ద్రుష్టిని మళ్లించేందుకే ఈ జిమ్మిక్కు’’అని ధ్వజమెత్తారు. రాష్ట్రపతితో పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించాలంటూ కాంగ్రెస్ సహావిపక్షాలు చేస్తున్న వ్యాఖ్యలను కొట్టిపారేశారు. రాష్ట్రపతిని ఓడించాలనుకున్నోళ్లే.. ఆమె పై మొసలి కన్నీరు కారుస్తుండటం సిగ్గు చేటన్నారు.

గత మూడేళ్లలో ఏనాడూ డిపాజిట్లు కూడా రాని కాంగ్రెస్ బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయమని కొన్ని పత్రికలు ప్రచారం చేయడం విడ్డూరమన్నారు. కరీంనగర్ లో వివిధ అభివ్రుద్ధి పనులకు భూమి పూజ చేసిన బండిసంజయ్ కుమార్ అనంతరం మీడియాతో మాట్లాడారు. అందులోని ముఖ్యాంశాలు కాంగ్రెస్, బీఆర్ఎస్, ప్రతిపక్షాలు రాష్ట్రపతి మీద ఎన్నడూ లేనంత ప్రేమను ఒలకబోస్తున్నయ్. వాళ్ల తీరు ఎట్లుందంటే.. ‌కత్తి తీసుకుని కసక్కున పొడుస్తరు ? వాళ్లే వామ్మో ఆసుపత్రికి ఎందుకు తీసుకెళ్లడం లేదని అరుస్తరు ? సిగ్గుండాలే... ఒక ఆదివాసీ గిరిజన మహిళను రాష్ట్రపతి అభ్యర్ధిగా నిలబెడితే అందరూ ఒక్కటై ఓడించాలని చూసినోళ్లంతా ఇయాళ రాష్ట్రపతితో ఎందుకు ప్రారంభోత్సవం చేయించడం లేదని అడుగుతున్నరు ? అసలు వాళ్లకు ఆమె పేరెత్తే అర్హత కూడా లేదు.

అయినా నేనడుగుతున్నా.. పార్లమెంట్ కు కస్టోడియన్ లోక్ సభస్పీకర్ పార్లమెంట్ భవన ప్రారంభోత్సవం ఎవరి చేతచేయించాలనేది స్పీకర్ విచక్షణాధికారం. స్పీకర్ కోరిక మేరకు ప్రధాని ప్రారంభిస్తున్నారు. అందులో తప్పేముంది ? ప్రధాని పార్లమెంట్ ఉభయ సభలకు నాయకుడు.. ఆయన ప్రారంభిస్తే ఇంత రాద్దాంతం చేయడమెందుకు ? బీఆర్ఎస్ పార్టీ దశాబ్ది ఉత్సవాలకి మీడియా హైప్ ఇస్తుంది. ఒకటవ తేదిన జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉంది. అయినా ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో కొట్ల రూపాయలతో దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. వడగండ్ల వానకి నష్టబోయిన రైతులకి పరిహారం ప్రకటించి రెండు నెలలు అవుతున్న ఇప్పటికి అకౌంటులో పడలేదు.

ఢీల్లిలో లిక్కర్ దందా చెసిన వారు తెలంగాణలో చేయలేరా ? తెలంగాణలో జరిగే లిక్కర్ దందాలో భాగాస్వామ్యులు ఎవరు. ఏం ఉద్దరించారని దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల సమయంలో పీవి నరసింహారావు జయంతి జరిపిన కేసీఆర్ మళ్ళీ ఎందుకు జరుపలేదు. కేసీఆర్ పాలన పై, అవినీతి పై ప్రజల ద్రుష్టి పడకుండా ఉండేందుకు ఎన్నికల ఏడాదిలో కొత్త జిమ్మిక్కులకు తెరదీసిండు. కేసీఆర్ పాలనలో ఇచ్చిన హమీలెన్ని? అమలు చేసినవెన్ని? ఇచ్చిన హామీలెందుకు నెరవేర్చలేదో ప్రజలకు సమాధానం చెప్పాలి..?

డబుల్ బెడ్రూం ఇండ్లు ఎందుకు కట్టివ్వలేదు ? ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా ఎందుకు ఇవ్వడం లేదు ? ఉద్యోగాలను ఎందుకు భర్తీ చేయడం లేదు ? రైతులకు సాయం ఎందుకు చేయడం లేదు ? సింగరేణి, విద్యుత్ డిస్కంల పరిస్థితిని దిగజార్చారు. ప్రభుత్వ ఉద్యోగులంతా ఎందుకు ఆందోళన చేస్తున్నారు ? చదువుకున్న నిరుద్యోగుల భవిష్యత్తును నాశనం చేశారు. చివరకు పరీక్షల లీక్ పేరుతో భవిష్యత్ ను నాశనం చేశారని విద్యార్థులు కూడా ఆందోళన పడుతున్నరు. మరి కేసీఆర్ పాలనలో ఏ వర్గం సంతోషంగా ఉందో చెప్పాలి. దశాబ్ది ఉత్సవాలు చేసుకుంటున్నరో కేసీఆర్ చెప్పాలి.

నరేంద్ర మోదీ బాస్, ఆస్ట్రేలియా వెళితే ఏమైందో చూశారు కదా.. ప్రపంచమే ఆయనను పొగుడుతోంది. నేను ఈడీ, సీబీఐ అధికారిని కాదు.. తప్పు చేస్తే శిక్ష తప్పదు. ఇది మోదీ ప్రభుత్వం. అవినీతిపరులను అణిచివేసే ప్రభుత్వం. కర్నాటక ఎన్నికలకు, తెలంగాణకు సంబంధం ఏమిటి ? ఏపీలో కాంగ్రెస్ గెలుస్తదా ? కాంగ్రెస్ తెలంగాణలో ఏ విధంగా అధికారంలోకి వస్తుంది? 2018లో కాంగ్రెస్ నుండి 19 మంది గెలిస్తే 12 మంది హోల్ సేల్ గా బీఆర్ఎస్ లోకి వెళ్లారు. ఇప్పుడున్న 5 గురిలో నలుగురు నాలుగు దిక్కులు చూస్తున్నరు.

ఇంకోకాయన చౌరస్తాలో నిలబడి ఉన్నరు. 2018 ఎన్నికల్లో ఒక్క సీటుకే పరిమితమైన బీజేపీ 2019 పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగు ఎంపీ సీట్లు గెలిచింది. ఆ తరువాత జరిగిన అన్ని ఎన్నికల్లో బీజేపీకి ఓటు బ్యాంకు పెరిగింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 48 స్థానాలు గెలిచినం. మాకు, బీఆర్ఎస్ కు 6వేల ఓట్లు మాత్రమే తేడా. హుజూరాబాద్, దుబ్బాక ఎన్నికల్లో బీజేపీ గెలిచింది. మొన్న జరిగిన టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ బీజేపీ గెలిచింది. ఇట్లా ప్రతి ఎన్నికల్లో బీజేపీ గెలుస్తూ ఓటు బ్యాంకును పెంచుకుంటే... కాంగ్రెస్ కు డిపాజిట్లు కూడా రావడం లేదు. ఏ విధంగా అధికారంలో వస్తుంది?

కావాలనే ఒక సెక్షన్ మీడియా బీజేపీని ఇబ్బంది పెట్టేలా రాస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ తో కలిసి పొత్తు పెట్టుకుంటామని, అధికారం పంచుకుంటామని కోమటిరెడ్డి, జానారెడ్డి వాళ్లే అంటున్నారంటే అర్ధం చేసుకోవాలి. నాకు, ఈటల, రాజగోపాల్ రెడ్డికి మధ్య గ్యాప్ ఉందనేది మీడియా స్రుష్టి. ఒక సెక్షన్ మీడియా బీజేపీ గ్రాఫ్ ను తగ్గించి కాంగ్రెస్, బీఆర్ఎస్ ఇమేజ్ ను పెంచాలని చూస్తున్నది. దానికి కర్నాటక ఫలితాలతో లంకె పెడుతున్నరు. బీజేపీలో ఎవరో చేరాలని ఎదురుచూడటం లేదు. సంస్థాగతంగా బలపడుతున్నాం. బీజేపీ విధానాలు, సిద్ధాంతాలను నమ్మి, మోదీ ప్రభుత్వం చేసిన అభివ్రుద్ధిని చూసి పార్టీలోకి వస్తే ఆహ్వానిస్తాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ఒక సెక్షన్ మీడియా ఎందుకు కోరుకుంటుందో నాకైతే అర్ధం కావడం లేదు. బీజేపీ వాళ్లకు చేసిన అన్యాయమేందో అర్ధం కావడం లేదు. ప్రజల తరపున మేం కొట్లాడుతున్నాం. మాకు అండగా ఉండాలని మీడియా యాజమాన్యాలను కోరుతున్నా.

గంగులతో మిలాఖత్ పై.. గోనె ప్రకాశ్ రావు పెద్ద మనిషి. ఆయనంటే గౌరవం ఉంది. కానీ బండి సంజయ్ కు కోట్లు ముట్టినయని ఆధారాల్లేకుండా ఆరోపించడం కరెక్ట్ కాదు... నిజంగా నేను గ్రానైట్ వాళ్ల దగ్గర డబ్బులు తీసుకుంటే ఆధారాలు బయటపెట్టడండి. వాళ్లు లెక్కలెందుకు బయటపెట్టడం లేదు? అధికారంలో ఉన్నది బీఆర్ఎస్సే కదా... దమ్ముంటే చెప్పాలి. నేను అమ్మవారిమీద ప్రమాణం చేసి చెబుతున్నా... నేను గ్రానైట్ వాళ్ల దగ్గర డబ్బులు తీసుకోలేదు. నా జీవితం తెరిచిన పుస్తకం. నా బ్యాంకు ఖాతాలు కూడా చెక్ చేసుకోవచ్చు. అయినా 500 మంది గ్రానైట్ సంస్థలున్నాయి. నేను డబ్బులు తీసుకుంటే వాళ్లు చెప్పరా? ఆధారాలు చూపితే పక్కకు జరుగుతా.

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నామీద పెద్ద ఎత్తున ఇంటెలిజెన్ష్ ను పెట్టిండు. నన్ను బదనాం చేయాలని నా అకౌంట్లు మొత్తం చెక్ చేయించుకుండు. కానీ ఏమీ దొరకలేదు.. ఎందుకంటే నా జీవితం తెరిచిన పుస్తకం. ఆరోపణలు చేసే వాళ్ల విజ్ఝతకే వదిలేస్తున్నా. ఎన్నికలు రాబోతున్నందున ఈనెల 30 నుండి వచ్చే నెల 30 వరకు జన సంపర్క్ అభియాన్ పేరుతో మోదీ 9 ఏళ్ల పాలనపై ప్రజల్లోకి వెళుతున్నాం. ‘‘ఇంటింటికీ బీజేపీ’’ పేరుతో గడగడపకూ మోదీ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను, సంక్షేమ ఫలాలను తీసుకెళతాం.

ఎన్నికల్లో టిక్కెట్ల కోసం బీజేపీలో తీవ్రమైన పోటీ నెలకొంది. 57 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాదయాత్ర చేస్తే టిక్కెట్లు ఆశిస్తున్న నేతలంతా పెద్ద ఎత్తున ఫెక్సీలు పెట్టుకున్నారు. పోటీ పడి పనిచేశారు. ఒక్కో చోట ఐదారుగురు సీట్ల కోసం పోటీ పడుతున్నారు. మేం ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తాం. గెలుస్తాం. రేపు ఖమ్మంలో నిరుద్యోగ మార్చ్ నిర్వహించబోతున్నాం. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని, బాధ్యుడైన కేసీఆర్ కొడుకును బర్తరఫ్ చేయాలని, పరీక్ష రద్దుతో నష్టపోయిన నిరుద్యోగులకు లక్ష రూపాయల పరిహారం ఇవ్వాలని కోరుతూ ఖమ్మంలో నిర్వహించబోయే నిరుద్యోగ మార్చ్ కు భారీ ఎత్తున తరలిరావాలని నిరుద్యోగులకు విజ్ఝప్తి చేస్తున్నా.



Next Story

Most Viewed