Karimnagar: భార్యను కిరాతకంగా చంపిన భర్త

by Disha Web Desk 4 |
A man Brutally kills his wife in Karimnagar District
X

దిశ, చిగురుమామిడి: A man Brutally kills his wife in Karimnagar District| స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకల సమయంలో ఆపశ్రుతి చోటుచేసుకుంది. అందరూ స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకలు జరుపుకుంటే.. ఓ ఉన్మాది మాత్రం భార్యను కత్తితో నరికి చంపాడు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఇందుర్తి గ్రామానికి చెందిన కనకం శిరీష అనే అంగన్వాడీ ఆయాను ఆమె భర్త కనకం ప్రవీణ్ సోమవారం ఉదయం తొమ్మిదిన్నర గంటల సమయంలో కత్తితో మెడపై దారుణంగా నరికి చంపాడు. అనంతరం ప్రవీణ్ చిగురుమామిడి పోలీస్ స్టేషన్‌లో పోలీసుల ఎదుట లొంగిపోయాడు. సంఘటన స్థలానికి తిమ్మాపూర్ సీఐ శశిధర్ రెడ్డి, ఎస్సై సుధాకర్ చేరుకొని పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. ఈ సందర్భంగా సీఐ శశిధర్ రెడ్డి మాట్లాడుతూ... శిరీష, ప్రవీణ్ దంపతులకు గత కొంతకాలంగా దాంపత్య జీవితంలో గొడవలు జరుగుతున్నాయని, అదే క్రమంలో శిరీష, భర్త ప్రవీణ్ కు కోర్టు ద్వారా విడాకుల నోటీసు పంపించినట్లుగా తెలిపాడు.

ఇదంతా నచ్చని ప్రవీణ్ అదను కోసం వేచి చూస్తుండగా.. ఈ రోజు అనగా సోమవారం అందరూ స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకల్లో సంబరాలు జరుపుకుంటున్న సమయంలో, ఇదే అదనుగా భావించిన ప్రవీణ్, భార్య శిరీషను ఆమె పనిచేస్తున్న అంగన్వాడి సెంటర్ వద్ద నుండి ఇంటికి తీసుకువెళ్లి మెడపై పదునైన కత్తితో నరికి చంపినట్లుగా సీఐతో పాటు, ప్రత్యక్ష సాక్షి అంగన్వాడీ సెంటర్లో టీచర్ గా పనిచేస్తున్న విజయ తెలిపారు. శిరీషను చంపవద్దని తాము బ్రతిమిలాడినప్పటికి ప్రవీణ్ వినకుండా శిరీషను చంపాడని తెలిపారు. అడ్డువస్తే మీ అందరిని కూడా చంపుతానని, కత్తితో బెదిరించాడని విజయ తెలిపారు. కాగా వీరికి ఇద్దరు పిల్లలు. ఒక పాప, బాబు ఉన్నారు. నిందితుడు ప్రవీణ్ గ్రామంలో ప్లంబర్ గా పని చేస్తున్నాడు. కాగా కేసును అన్ని కోణాల్లో విచారించి నిందితుడు ప్రవీణ్ పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ శశిధర్ రెడ్డి తెలిపారు. సంఘటన స్థలాన్ని ఎంపీపీ కొత్తవినిత శ్రీనివాస్ రెడ్డి సందర్శించారు.

ఇది కూడా చదవండి: ప్ర‌జాసంగ్రామ యాత్ర‌లో ర‌ణ‌రంగం.. టీఆర్ఎస్, బీజేపీ కార్య‌క‌ర్త‌ల ప‌ర‌స్ప‌ర దాడులు


Next Story