కేజ్రీవాల్ పార్టీలో కేసీఆర్ చిచ్చు.. ఆప్‌కు ఇందిరా శోభన్ రాజీనామా

by Disha Web Desk 2 |
కేజ్రీవాల్ పార్టీలో కేసీఆర్ చిచ్చు.. ఆప్‌కు ఇందిరా శోభన్ రాజీనామా
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో సీనియర్ రాజకీయ నాయకురాలు ఇందిరా శోభన్ ఆమ్ ఆద్మీకి రాజీనామా చేశారు. కేసీఆర్ తో ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ కేజ్రీవాల్ అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు మంగళవారం వెల్లడించారు. అవినీతికి వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ సామాన్యుల పార్టీ అని భావించానని, అయితే అవినీతి పరుడైన తెలంగాణ ప్రజలను మోసం చేసిన కేసీఆర్‌తో కలిసి నడవాలని కేజ్రీవాల్ నిర్ణయం ఆమ్ ఆద్మీ పార్టీ సిద్ధాంతాలకు తిలోదకాలు దిద్దినట్టుగా ఉందని ఆరోపిస్తూ పార్టీ నుంచి వైదొలిగారు. బీఆర్ఎస్ నిర్ణయాలకు కేజ్రీవాల్ వత్తాసు పలకడంతో తాను మనస్థాపానికి గురై రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.

ఖమ్మం సభకు వచ్చినప్పుడే తన మనసులో ఉన్న సందేహాలను కేజ్రీవాల్ ముందు ఉంచానని అయితే తాను కంటి వెలుగు కార్యక్రమానికే వచ్చాను తప్ప పార్టీ కార్యక్రమానికి రాలేదని అన్నారని, ఇవాళ పార్లమెంట్ లో రాష్ట్రపతి ప్రసంగాన్ని బీఆర్ఎస్, ఆమ్ ఆద్మీ బైకాట్ చేయడాన్ని ఆమె ప్రశ్నించారు. రాజ్యాంగాన్ని నూరు శాతం అమలు చేస్తున్నది తామే అని అంబేద్కర్ ఫోటో పెట్టుకునే కేజ్రీవాల్ రాజ్యాంగ పదవిలో ఉన్న రాష్ట్రపతి ప్రసంగాన్ని బైకాట్ చేయడం ద్వారా ఆ పదవిని అవమాన పరచడం కాదా అని నిలదీశారు. రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని చెప్పిన కేసీఆర్ తో కలిసి ఈ దేశ ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారని ప్రశ్నించారు.

ఇప్పటికే లిక్కర్ స్కామ్ గురించి కథలు కథలుగా మాట్లాడుతున్నారని ఇలాంటి పరిస్థితుల్లో కేజ్రీవాల్ ఇక్కడికి వచ్చి కేసీఆర్ కు మద్దతు తెలపడం అంటే ఆ కథకు ఐఎస్ఐ మార్కు వేసినట్టుగా ఉందని ఆరోపించారు. మీ రాజకీయ భవిష్యత్తు కోసం కార్యకర్తల రాజకీయ భవిష్యత్తుని పణంగా పెట్టడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. కేజ్రీవాల్ నిర్ణయాలు కార్యకర్తల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని ఆరోపిస్తూ రాజీనామా చేస్తున్నానన్నారు. ఇన్నాళ్లు తన రాజకీయ ప్రయాణనికి సహకరించిన వారందరికి ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్ కార్యాచరణను త్వరలో ప్రకటిస్తాన్నారు. కాగా గతంలో కాంగ్రెస్ లో కీలక పాత్ర వహించిన ఇందిరాశోభన్ ఆతర్వాత వైఎస్సార్ టీపీలో చేరారు. అనంతరం రాజీనామా చేసి ఆమ్ ఆద్మీలో చేరారు. ఈ నేపథ్యంలో ఆమె తర్వాత స్టెప్ ఎటువైపు అనేది ఆసక్తిగా మారింది.



Next Story

Most Viewed