తెలంగాణలో కారు స్పీడుకు భారీ బ్రేకులు.. ఇండియా టుడే సర్వేలో షాకింగ్ విషయాలు

by Disha Web Desk 4 |
తెలంగాణలో కారు స్పీడుకు భారీ బ్రేకులు.. ఇండియా టుడే సర్వేలో షాకింగ్ విషయాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఇండియాటుడే నిర్వహించిన మూడ్​ ఆఫ్​ నేషన్​ సర్వేలో ప్రజలు మరోమారు ఎన్డీఏకు పట్టం కట్టనున్నారని తేలింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కేంద్రంలో బీజేపీ జెండా ఎగురే అవకాశాలున్నాయి. మొత్తం 286 సీట్లతో ఎన్డీఏ విజయం సాధిస్తుందని వెల్లడించింది. నితీశ్​ కుమార్​ ఎన్డీఏ నుంచి వైదొలగిన ప్రభావం ఎన్నికలపై ఉంటుందని, 21 స్థానాలు తగ్గుతాయని తేల్చింది. దేశంలో ఇప్ప‌టికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎన్డీఏ కూటమి మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని స‌ర్వే తేల్చింది. మొత్తం 543 లోక్ సభ సీట్లుగాను, ఎన్డీఏ కూటమి 286 కైవ‌సం చేసుకుంటుంద‌ని వెల్లడైంది. 2019 ఎన్నికల్లో బీజేపీ అలయన్స్ కు 353 సీట్లు రాగా.. ఈసారి కొంత తగ్గుతాయని తేల్చింది. ఇక యూపీఏ కూటమికి 146 స్థానాలు వస్తాయని తేలింది. నితీశ్​ కుమార్ యూపీఏలో చేరడంతో ఆ సీట్లన్నీ ఎన్డీఏ నుంచి యూపీఏ కు షిప్ట్ అవుతున్నాయి. 'ది మూడ్ ఆఫ్ నేషన్'పేరుతో ఫిబ్రవరి-ఆగస్టు మధ్య నిర్వహించిన సర్వేలో 1,22,016 మంది పాల్గొన్నారు. ఎనిమిదేళ్లకు పైగా అధికారంలో ఉన్నా అధిక ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, కొవిడ్-19 రెండో దశలో విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ ప్రధాని మోడీకి ప్రజాదరణ చెక్కుచెదరలేదు. వ్యక్తిగతంగా తన రాజకీయ ప్రత్యర్థుల కన్నా పైనే ఉన్నారు. దేశ స్థాయిలో ఈ సర్వే ఎలా ఉన్నా.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం హాట్ టాపిక్ గా మారింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ప‌బ్లిక్ మూడ్ ను స్ప‌ష్టం చేసింది. తెలంగాణ వ్యాప్తంగా క‌మ‌ల వికాసం ఉంటుంద‌ని అంచ‌నా వేసింది. ఏపీలో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి హ‌వా ఇంకా కొన‌సాగుతుంద‌ని స్పష్టం చేసింది.

నితీష్​ తో 21 సీట్లు తగ్గుదల

ఇటీవల ఎన్డీఏ కూటమి నుంచి నితీష్​ కుమార్​ వైదొలగిన విషయం తెలిసిందే. దీంతో యూపీఏకు 21 సీట్లు పెరుగనున్నాయి. ఎన్డీఏ సీట్లు తగ్గనున్నాయని మూడ్​ ఆఫ్​ నేషన్​ సర్వే స్పష్టం చేసింది. ఈ పరిణామాలతో జనవరిలో ఎన్డీఏ కూటమికి 3‌‌07 స్థానాలు వస్తాయని అంచనా వేయగా, ఆగస్టు నాటి సర్వే ప్రకారం 286 సీట్లకు దిగింది. ఇక యూపీఏ కూటమి 146 స్థానాలకు పెరిగింది. స్వతంత్రులు మాత్రం యధావిధిగా 111 స్థానాలకు పరిమితమయ్యారు. బీజేపీకి 41 శాతం, యూపీఏకు 28 శాతం, స్వతంత్రులకు 31 శాతం ఓటింగ్​ షేర్​ ఉంది. నెక్ట్స్​ ప్రధానిగా 53% ఓటింగ్​ తో మోడీ టాప్​ లో నిలిచారు. రాహుల్ గాంధీకి 9% అరవింద్ కేజ్రీవాల్ కు 7% జై కొట్టారు.

రాష్ట్రంలో కాషాయ హవా

రాష్ట్రంలో కేసీఆర్ సర్కార్ పై ప్రజాగ్రహం తీవ్రంగా ఉందనే జరుగుతున్న ప్ర‌చారానికి అనుగుణంగా ఇండియా టీవీ సర్వేలోనూ అదే స్పష్టమైంది. 2019 కన్నా ఇప్పుడు ఎన్నికలు జరిగితే టీఆర్ఎస్ కు దాదాపు 8 శాతం ఓట్లు తగ్గనున్నాయని వెల్లడించింది. ఎంపీ సీట్ల విషయానికి వస్తే గత ఎన్నికల్లో టీఆర్ఎస్ 9 సీట్లు గెలిచింది. ఇప్పుడు ఎన్నికలు జరిగితే 8 సీట్లు వస్తాయని అంచ‌నా వేసింది. రెండు సీట్లను కలుపుకుని మొత్తంగా బీజేపీకి 6 సీట్లు రానున్నాయి. ఈ ప్రభావం అసెంబ్లీ స్థానాలపైనా కనిపించనుంది. ఇక 2019లో కాంగ్రెస్ మూడు సీట్లు గెలవగా, ఈసారి కేవలం రెండు వస్తాయని లెక్కించింది. హైదరాబాద్ సీటును యధాతథంగా ఎంఐఎం నిలబెట్టుకోనుందని పేర్కొన్నది. ఏపీలోని జనసేన, తెలంగాణలో కాంగ్రెస్​ కష్టకాలం ఎదుర్కొంటుందని మూడ్​ ఆఫ్​ నేషన్​ సర్వేలో అంచనా వేశారు.

కేసీఆర్​.. లీస్ట్​ పాపులారిటీ

దేశ వ్యాప్తంగా మోస్ట్​ పాపులారిటీ ఉన్న సీఎంల జాబితాలో ఒడిశా సీఎం నవీన్​ పట్నాయక్​ ముందుగా నిలిచారు. ఈ ఏడాది జనవరిలో నిర్వహించిన ఇదే మూడ్​ ఆఫ్​ నేషన్​ సర్వేలో యూపీ సీఎం యోగీ ముందు వరుసలో ఉండగా.. ఈసారి టాప్​ టెన్​ లో ఆయన పేరు కనిపించలేదు. తెలంగాణ సీఎం కేసీఆర్​ 2020 తర్వాత పాపులారిటీ జాబితాలో కనిపించడం లేదు. 2020, జనవరిలో చేసిన ఇదే సర్వేలో మోస్ట్​ పాపులారిటీ జాబితాలో నాలుగో స్థానంలో నిలిచిన ఏపీ సీఎం జగన్​ ఇప్పుడు ఐదో స్థానానికి పడిపోయారు. ఆ తర్వాత నుంచి కేసీఆర్​ కు మళ్లీ అవకాశం రావడం లేదు. ఏపీ సీఎం జగన్​ మాత్రం ఈ ఏడాది వరుసగా ఐదో స్థానంలో ఉన్నారు. 57 శాతం ఓట్లతో ఆయన పాపులర్​ సీఎంగా దేశంలోని ఐదో సీఎం స్థానంలో ఉన్నారు. ఇక టాప్​ టెన్​ లో కూడా కేసీఆర్​ లేరు. ఆయన ఈసారి కూడా ఆఖరున ఉన్నట్లు సర్వేలో స్పష్టమవుతున్నది.

తెలంగాణ ఎస్ఐ అభ్యర్థులకు భారీ గుడ్ న్యూస్.. ప్రతి అభ్యర్థికి 8 మార్కులు


Next Story

Most Viewed