- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మహిళా కార్పొరేటర్ల స్థానంలో భర్తల పెత్తనం.. ప్రజలు ఫైర్

దిశ ప్రతినిధి, హైదరాబాద్: మహానగర పాలక సంస్థ పరిధిలోని డివిజన్లలో ఎన్నికైన మహిళా కార్పొరేటర్ల స్థానంలో వారి పతులు పెత్తనం చెలాయిస్తున్నారు. డివిజన్లలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగినా, అధికారులతో మాట్లాడవలసి ఉన్నా భార్యల స్థానంలో భర్తలే మాట్లాడుతున్నారు. ఈ విషయంలో తరచుగా గొడవ జరుగుతున్నా పట్టించుకోకుండా భర్తలే ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. కొన్ని డివిజన్లలో అధికారిక సమావేశాలలో కూడా భర్తల పెత్తనం కొనసాగుతోంది. రాజకీయ పరమైన ఒత్తిళ్ల కారణంగా అధికారులు కూడా చేష్టలుడిగి చూస్తున్నారు. దీంతో ప్రభుత్వం మహిళా రిజర్వేషన్లు కల్పించినా ఫలితం లేకుండా పోతోందనే విమర్శలు వినబడుతున్నాయి.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లోని 6 జోన్లు, 30 సర్కిళ్లలో ఉన్న 150 వార్డులకు 2020 డిసెంబర్ 1 న ఎన్నికలు జరిగాయి. మొత్తం 150 డివిజన్లలో 75 డివిజన్లు మహిళకు కేటాయించారు. ఇవే కాకుండా మరో నాలుగు చోట్ల దేదీప్యారావు (వెంగళరావునగర్), బొంతు శ్రీదేవి (చర్లపల్లి), సబితా కిషోర్ (వెంకటాపురం), గద్వాల విజయలక్ష్మి (బంజారాహిల్స్) డివిజన్లలో అన్ రిజర్వ్డ్ సీట్లలో విజయం సాధించారు.
దీంతో బల్దియాలో వీరి సంఖ్య 79 కి చేరింది. ఇంతవరకు భాగానే ఉన్నా నూతనంగా ఎన్నికైన మహిళా కార్పొరేటర్లకు బదులుగా వారి పతులు బస్తీలలో పర్యటించడం, అధికారులతో మాట్లాడటం, కొత్త పనుల ప్రారంభోత్సవం, డివిజన్లలో కొనసాగుతున్న పలు రకాల మరమ్మత్తు పనుల తనిఖీలు, నూతన పనుల కోసం ఆర్జీలు ఇలా ఒక్కటేమిటి అన్నింటిలోనూ భర్తల ముందుంటున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని చాలా డివిజన్లలో మహిళా కార్పొరేటర్లు భర్త చాటు భార్యలుగానే మిగిలిపోతుండగా ప్రజా ప్రతినిధులమన్న విషయమే మరచిపోయినట్లుగా పరిస్థితులు కనబడుతున్నాయి. డివిజన్కు సంబంధించి ఏ విషయంలోనూ స్వతంత్రంగా వ్యవహరించడం లేదు. కొందరు తప్పనిసరైతే తప్పా ఇంటి గడప దాటడం లేదంటే పరిస్థితి ఎలా ఉందో ఇట్లే అర్థం అవుతోంది.
మారని తీరు..
గోషామహల్ నియోజకవర్గంలోని రెండు డివిజన్లలో బీజేపీ మహిళా కార్పొరేటర్లు విజయం సాధించారు. అయితే డివిజన్లలో మాత్రం వారి భర్తలే పెత్తనం చెలాయిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే తీరు గ్రేటర్ పరిధిలోని ఇతర నియోజకవర్గాలలో నెలకొంది. తరచూ అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించడం, వేర్వేరు విభాగాల అధికారులతో మాట్లాడటం, అభివృద్ధి పనులు, పౌర సమస్యల పరిష్కారం ఇవే కాకుండా అన్ని విషయాలలో వారు జోక్యం చేసుకుంటున్నారు. చివరకు మీడియాకు రిలీజ్ చేసే ప్రెస్ నోట్లలో కూడా కార్పొరేటర్ల కు బదులుగా వారి భర్తల ఫోటోలే ఉంటున్నాయి. కానీ రైటప్లలో మాత్రం కార్పొరేటర్ పేర్లు పెడుతున్నారు. ఇలాంటి పరిస్థితే నగరంలో మహిళా కార్పొరేటర్లు ప్రాతినిధ్యం వహిస్తున్న చాలా డివిజన్లలో నిత్యకృత్యమైంది. మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న డివిజన్లలో కూడా షర మామూలే అన్నట్లుగా ఉన్నావారు కూడా చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
విద్యావంతులైనప్పటికీ..
జీహెచ్ఎంసీ మహిళా కార్పొరేటర్లలో అధిక శాతం ఉన్నత విద్యావంతులే ఉన్నారు. వీరిలో కొందరు మహిళా కార్పొరేటర్లు తమదైన శైలిలో బస్తీలలో పర్యటిస్తూ ప్రజలతో మమేకమౌతున్నారు. అధికారులు, ప్రజలను నేరుగా కలిసి వారి సమస్యలు తెలుసుకొని పరిష్కారానికి ప్రయత్నం చేస్తున్నారు. బస్తీలు, ఇతర ముఖ్య సమావేశాల్లో కూడా కొందరు కార్పొరేటర్లు ప్రజా సమస్యలు ప్రతిబింబించేలా స్పష్టంగా మాట్లాడుతున్నారు. సుమారు 20 మంది వరకు మహిళా కార్పొరేటర్లు తెలుగు, ఆంగ్లం, హిందీ భాషల్లో అనర్గళంగా మాట్లాడగలిగే వారు ప్రస్తుతం కార్పొరేటర్లుగా ఉన్నారు.
గతంతో పోలిస్తే ఇది శుభ సూచకమమే అయినప్పటికీ కొంతమంది మహిళా ప్రజాప్రతినిధులు మాత్రం భర్త చాటు భార్యలుగానే ఉంటున్నారు. భర్త రాసిచ్చే స్ర్కిప్ట్ను సమావేశాలలో చదవడం వరకే మా విధి అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇలా భర్తల పెత్తనం కొనసాగిస్తున్న డివిజన్లలో మహిళా కార్పొరేటర్లే సమావేశాలకు హాజరు కావడం వంటి విషయంలో బల్దియా ఉన్నతాధికారులు కఠినంగా వ్యవహరించాలనే అభిప్రాయాలు అంతటా వ్యక్తమౌతున్నాయి.