డాక్టర్ల నిర్లక్ష్యం.. సిజేరియన్ అనంతరం మహిళ మృతి

by samatah |   ( Updated:2022-06-22 09:51:42.0  )
డాక్టర్ల నిర్లక్ష్యం.. సిజేరియన్ అనంతరం మహిళ మృతి
X

దిశ, ముషీరాబాద్ : డెలివరీ కోసం వస్తే, వైద్యుల నిర్లక్ష్యం వల్ల తమ శిశువు ఆస్పత్రి పాలు కాగా, డెలివరీ అనంతరం మహిళ మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. మృతి చెందిన మహిళ మృతదేహాన్ని తమకు అప్ప జెప్పకుండా గుట్టు చప్పుడు కాకుండా గాంధీ హాస్పిటల్ ఆసుపత్రికి ఎలా తరలిస్తారని కుటుంబ సభ్యులు ప్రశ్నించారు. మృతదేహాన్ని అప్పజెప్పాలని ఈశ్వర్ లక్ష్మీ హాస్పిటల్ ఎదుట రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. ఘటన ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం జరిగింది.

ఈ సందర్భంగా మృతురాలి భర్త రాము మీడియాతో మాట్లాడుతూ.. మలక్ పేటకు చెందిన తనకు పుష్పలత ( 36 )‌తో ఆరేళ్ల క్రితం వివాహం జరిగిందని తెలిపారు. డెలివరీ సమయం సమీపిడటంలో ఆర్టీసీ క్రాస్ రోడ్డు‌లోని డంగొరియా హాస్పిటల్‌లో డాక్టర్ విజయలక్ష్మితో సంప్రదించగా ఆమె గాంధీనగర్‌లోని ఈశ్వర లక్ష్మి హాస్పిటల్‌కి వెళ్ళండి.. అన్ని సదుపాయాలు ఉంటాయని, డెలివరీకి ఏ ఇబ్బంది ఉండదని చెప్పిందని రాము తెలిపారు. ఆమె సూచన మేరకు ఈ నెల 20వ తేదీన మధ్యాహ్నం 12 గంటల సమయంలో తన భార్యను ఈశ్వర్ లక్ష్మీ హాస్పిటల్‌లో అడ్మిట్ చేయించానని పేర్కొన్నారు.

ఇక 21వ తేదీ ఉదయం 8 గంటల 15 నిమిషాలకు తన భార్య బాబుకు జన్మించిందని, బాబు ఆరోగ్యం బాగా లేదని విద్యానగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారని వివరించారు. ఇలా ఉండగా బుధవారం ఉదయం 5:40 గంటలకు ఈశ్వర్ లక్ష్మీ హాస్పిటల్ నుంచి వైద్యులు నాకు ఫోన్ చేసి మీ భార్య పరిస్థితి బాగాలేదు .. ఇంజక్షన్ అర్జెంటుగా తేవాలని చెప్పడంతో ఇంజక్షన్ తీసుకెళ్లి ఇచ్చాను. ఉదయం ఎనిమిదిన్నర గంటలకు మళ్లీ ఫోన్ చేసిన వైద్యులు మీ భార్య చనిపోయిందని తెలిపారని ఆవేదన వ్యక్తం చేశాడు. అలా ఎలా చనిపోయింది అని అడగగా బీపీ కంట్రోల్ తప్పి హార్ట్ఎటాక్ వచ్చి చనిపోయిందని వైద్యులు తెలిపారని రాము పేర్కొన్నారు. గతంలో కూడా ఈశ్వర్ లక్ష్మీ హాస్పిటల్‌లో ఇలాంటి ఘటనలు జరిగాయని, అయినా ఆసుపత్రి నిర్వాహకుల్లో మార్పు రావడం లేదని తెలంగాణ జన సమితి నాయకుడు మెరుగు శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ప్యాకేజీల పేరుతో ఆసుపత్రిలో అధిక డబ్బులు వసూలు చేస్తున్నారని, ట్రస్ట్ పేరుతో పేద ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఇలాంటి ఆసుపత్రుల పై నిఘా పెట్టాలని డిమాండ్ చేశారు.

Next Story

Most Viewed