చార్మినార్​ వద్ద బైక్​ ర్యాలీని ప్రారంభించిన కేంద్రమంత్రి కిషన్​ రెడ్డి

by Sathputhe Rajesh |
చార్మినార్​ వద్ద బైక్​ ర్యాలీని ప్రారంభించిన కేంద్రమంత్రి కిషన్​ రెడ్డి
X

దిశ, చార్మినార్​: తెలంగాణ విమోచన అమృత మహోత్సవాలు సందర్భంగా బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో చారిత్రాత్మక చార్మినార్​ నుంచి సర్దార్ పటేల్ విగ్రహం వరకు నిర్వహించిన భారీ బైక్​ ర్యాలీని గురువారం కేంద్రమంత్రి కిషన్​ రెడ్డి అట్టహాసంగా ప్రారంభించారు. ముందుగా బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గీతా మూర్తి, బీజేపీ మహిళా నాయకురాలు డాక్టర్​ జీవిత, బీజేపీ మహిళా మోర్చా నాయకులతో కలిసి కేంద్రమంత్రి కిషన్​ రెడ్డి చార్మినార్​ శ్రీ భాగ్యలక్ష్మి దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం చారిత్రాత్మక చార్మినార్​ వద్ద బైక్​ ర్యాలీని కేంద్రమంత్రి ప్రారంభించారు. కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి హెల్మెట్​ ధరించి బీజేపీ మహిళా మోర్చా మహిళా నాయకులు వెంట ర్యాలీగా జాతీయ జెండాలను చేతబూని బయలుదేరారు. ఈ సందర్భంగా జై శ్రీరామ్​, జైజై శ్రీరామ్​, వందే మాతరం వందే మాతరం అంటూ దారిపొడవున మహిళలు పెద్ద పెట్టున నినాదాలు చేశారు. చార్మినార్​ నుంచి పరేడ్​ గ్రౌండ్స్​ మీదుగా సర్దార్​ పటేల్​ విగ్రహం వరకు బైక్​ ర్యాలీ సాగనుంది.

ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్​ రెడ్డి మాట్లాడుతూ.. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలలో తెలంగాణ విమోచన అమృత మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని, మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆహ్వానం అందజేశామన్నారు. 25 సంవత్సరాల క్రిందనే ముందుగా తాము తెలంగాణ విమోచన దినోత్సవం పేరు పెట్టడం జరిగిందని, అదే ఆశయంతో పని చేస్తున్నామన్నారు. ఎవరు ఏం చేస్తారో వాళ్ళ ఇష్టమని తెలంగాణ ప్రభుత్వంను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు గౌతమ్ రావు, శ్యామ్ సుందర్ రెడ్డి, సురేందర్ రెడ్డి, చింతల రాంచంద్రా రెడ్డి, బండకార్తీకా రెడ్డి, ఉమామహేందర్ తదితరులు పాల్గొన్నారు.

Next Story