నగరంలో వరుణుడి బీభత్సం.. ఓల్డ్ సిటీలో కూలిన ఛత్తా బజార్ కమాన్

by Kema Shiva Kumar |   (  Updated:2026-06-09 13:55:57  IST  )

హైదరాబాద్‌లో తొలి రుతుపవనాల వర్షానికే పాతబస్తీలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.

నగరంలో వరుణుడి బీభత్సం.. ఓల్డ్ సిటీలో కూలిన ఛత్తా బజార్ కమాన్
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు (Southwest Monsoon) ప్రవేశించడంతో హైదరాబాద్ నగరవ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. అయితే, ఈ తొలి వర్షానికే పాతబస్తీ (Old City)లో ఓ విషాదకర ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. భారీ వర్షం ధాటికి పాతబస్తీలో అత్యంత పురాతనమైన, చారిత్రక ప్రాధాన్యత కలిగిన ఛత్తా బజార్ కమాన్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. శతాబ్దాల నాటి ఈ కట్టడం వర్షపు నీటి ధాటికి తట్టుకోలేక సాయంత్రం అకస్మాత్తుగా కూలిపడింది. నిత్యం వందలాది మంది ప్రజలు, వాహనాలతో రద్దీగా ఉండే ఈ ప్రధాన రహదారిపై కమాన్ ఒక్కసారిగా కూలడంతో ఆ ప్రాంతంలో భారీ శబ్దం వచ్చింది. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురై ప్రాణభయంతో పరుగులు తీశారు.

రంగంలోకి పోలీసులు, డీఆర్ఎఫ్ టీమ్స్..

ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక పోలీసులు అప్రమత్తమయ్యారు. సమాచారం అందిన నిమిషాల్లోనే జీహెచ్‌ఎంసీ విపత్తు నిర్వహణ బృందంతో కలిసి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. శిథిలాల కింద ఎవరైనా చిక్కుకున్నారా అనే కోణంలో తక్షణమే రెస్క్యూ ఆపరేషన్‌ను (Rescue Operation) ప్రారంభించారు. భారీ క్రేన్ల సహాయంతో రోడ్డుపై పడిన కమాన్ శిథిలాలను తొలగించి, ట్రాఫిక్‌ను క్లియర్ చేసేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టారు. ఛత్తా బజార్ కమాన్ కూలిపోవడంతో ఆ రూట్‌లో రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు భారీగా అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ప్రాణనష్టం, ఆస్తి నష్టానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

కరెంట్ షాక్‌తో ఇద్దరు మృతి..

అదేవిధంగా పాతబస్తీలో భారీ వర్షానికి ఇద్దరు బలయ్యారు. చాంద్రాయణగుట్టకు చెందిన ఇద్దరు యువకులు జాఫర్ (25), అబూ (16) కరెంట్‌ షాక్‌తో మృతి చెందారు. రోడ్డుపై తెగిపడిన కరెంట్‌ తీగల వల్ల ప్రమాదం చోటుచేసుకుంది. విద్యుత్‌ వైర్లను గమనించక ఆటోలో నుంచి దిగడంతో ఒక్కసారిగా కరెంట్‌ షాక్‌ కొట్టడంతో వారు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు.

Next Story