ఈ నెల చివరిలోగా ప్రెస్ అకాడమీ భవనం ప్రారంభిస్తాం : మంత్రి పొంగులేటి

by Aamani |
ఈ నెల చివరిలోగా ప్రెస్ అకాడమీ భవనం ప్రారంభిస్తాం : మంత్రి పొంగులేటి
X

దిశ,కార్వాన్ : అర్హులైన జర్నలిస్టులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేదలైన జర్నలిస్టులకు అలాగే వృత్తి నిర్వహణలో చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తామని తెలిపారు.

వృత్తి నిర్వహణలో చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు నెలసరి పెన్షన్, తీవ్ర అనారోగ్యం, ప్రమాదాలకు గురై వృత్తి నిర్వహించలేని స్థితిలో ఉన్న జర్నలిస్టులకు శుక్రవారం నాంపల్లి లోని ప్రెస్ అకాడమీ కార్యాలయంలో చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మండల, నియోజకవర్గ స్థాయిలో పని చేస్తున్న జర్నలిస్టులను ఆదుకోవడానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. మంచిని మంచిగా, నిజాన్ని నిర్భయంగా సమాజనికి తెలియజేసే దాంట్లో ఎంతో మంది జర్నలిస్టులు ఆణిముత్యాలుగా పనిచేస్తున్నారని ప్రశంసించారు. జర్నలిస్టు వృత్తిని నమ్ముకుని తన జీవితం మొత్తం ఆ వృత్తికే అంకితం అయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారని అన్నారు. ఆనాటి ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేసిన ప్రెస్ అకాడమీ భవనాన్ని చిన్న చిన్న మరమత్తులు పూర్తి చేసుకుని ఈ నెల చివరిలోగా ప్రారంభిస్తామని తెలిపారు.

విడతల వారీగా రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన రూ.42.00 కోట్లను ఫిక్స్ డ్ డిపాజిట్ చేసి, దానిపై వచ్చే వడ్డీని జర్నలిస్టుల సంక్షేమం కోసం అకాడమీ ఖర్చు పెడుతుందని,జర్నలిస్టుల సంక్షేమానికి ఫిక్స్ ఢ్ డిపాజిట్ పై వచ్చిన వడ్డీ ఆధారంగా ఇప్పటివరకు రూ.22 కోట్లు ఖర్చు చేయడం జరిగిందన్నారు. మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు చెందిన 597 మందికి రూ.1,00,000/-తో పాటు అయిదు సంవత్సరాల వరకు, నెలకు రూ.3000/- ల చొప్పున పెన్షన్, వారి పిల్లలకు ట్యూషన్ ఫీజుల క్రింద 1 నుండి 10 వ తరగతి వరకు చదివే పిల్లలకు నెలకు రూ.1,000/-ల చొప్పున గరిష్టంగా ఇద్దరికి అందించడం జరుగుతుందన్నారు.

ఇప్పటి వరకు ఈ ఖాతాలో మొత్తం రూ.8,98,39,000/-లు ఆర్థిక సహాయం అందించడం జరిగిందన్నారు.ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురామ రెడ్డి మాట్లాడుతూ.. ఈ సమాజంలో జర్నలిస్టు వృత్తి అత్యంత కీలకమైనదని తమ ప్రాణాలను లెక్క చేయకుండా సమాచారాన్ని ప్రజలకు అందిస్తున్నారని గడిచిన రెండు రోజులుగా రెండు దేశాల మధ్య ఏం జరుగుతుందో అన్న ఆతృతతో ఎదురుచూస్తున్న ప్రజలకు తమ ప్రాణాలను లెక్క చేయకుండా సమాచారాన్ని ప్రజలకు చేరవేస్తున్నారని కొనియాడారు.

ప్రెస్ అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. అర్హులైన జర్నలిస్టులకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని జర్నలిస్టుల సంక్షేమానికి నిధులను పెంచాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ వినయ్ కృష్ణా రెడ్డి,జర్నలిస్టులు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed