కరెంట్ కోతలు.. ప్రజల వెతలు !

by Sumithra |
కరెంట్ కోతలు.. ప్రజల వెతలు !
X

దిశ, హైదరాబాద్ బ్యూరో : గ్రేటర్ హైదరాబాద్‌లో విధిస్తున్న అప్రకటిత విద్యుత్ కోతలతో ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు. ఓ వైపు మండుతున్న ఎండలు, మరోవైపు కరెంటు ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. గత కొన్ని రోజులుగా జీహెచ్ఎంసీ వ్యాప్తంగా సుమారు 40 డిగ్రీల సెల్పియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో బయటకు వెళ్లాల్సి వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ ప్రతీ నిత్యం వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. కానీ కరెంటు కోతల వల్ల ప్రజలు ఇండ్లలో కూడా ఉండలేని పరిస్థితి ఉంది. పగలు, రాత్రి తేడా లేకుండా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుండడం, గంటల పాటు విద్యుత్ అధికారులకు ఫోన్లు చేసినా పట్టించుకోకపోవడం పట్ల ప్రజలు మండిపడుతున్నారు. దీనికి తోడు అకాల వర్షాలు, గాలులతో పలు ప్రాంతాల్లో కరెంటు సరఫరా నిలిచిపోతుండటంతో ఇబ్బందులు తప్పడం లేదు.

అనధికారికంగా కోతలు..

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం రాష్ట్రంలో 24 గంటల పాటు నిరంతరంగా విద్యుత్ సరఫరా మొదలైంది. సుమారు పదహారు నెలల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. రాష్ట్రంలో ఒక్క నిమిషం విద్యుత్ కోతలు విధించినా అధికారుల పై చర్యలుంటాయని సీఎం రేవంత్ రెడ్డి సైతం హెచ్చరికలు జారీ చేశారు. అయినా అధికారులు నిమ్మకు నీరెత్లినట్లు పని చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా నగరవ్యాప్తంగా తరచుగా కరెంటు సరఫరాలో అంతరాయం ఏర్పడుతోంది. అనధికారికంగా కోతలు విధిస్తున్నారు. అంతరాయానికి కొంత మంది అధికారులు చెట్ల కొమ్మల తొలగింపు కారణమని చెబుతున్నారు. ఇలా నగరంలోని చాలా ప్రాంతాలలో రోజులో అనేక మార్లు విద్యుత్ సరఫరాను నిలిపివేస్తుండటంతో వినియోగదారులకు ఏం జరుగుతుందో అర్ధం కాని పరిస్థితులు ఉన్నాయి.

పట్టించుకోని అధికారులు ...?

ప్రస్తుత వేసవిలో జీహెచ్ఎంసీ పరిధిలో తరచుగా విద్యుత్ కోతలు ఉంటుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వీఐపీలు, సంపన్నులు ఉండే ప్రాంతాలలో ఏదైనా సాంకేతిక కారణాలతో సరఫరా నిలిచిపోతే వెంటనే పునరుద్ధరిస్తున్నారు అధికారులు. ఇతర ప్రాంతాల్లో మాత్రం పట్టించుకోవడం లేదు. గంటల పాటు విద్యుత్ లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. ఫ్యూజ్ ఆఫ్ కాల్ తో పాటు ఏఈ, లైన్ మెన్ లకు ఫోన్ చేసినా స్పందించడం లేదని, కొంతమంది అధికారులు అసలు ఫోన్ కూడా ఎత్తడం లేదని పలు బస్తీల ప్రజలు మండిపడుతున్నారు. ముఖ్యంగా ఎల్బీనగర్ లోని చాలా బస్తీలలో సమస్య జఠిలంగా ఉంది. ఒక్కోసారి రోజులో పదుల సార్లు విద్యుత్ నిలిచిపోతోంది. హైదరాబాద్ నగరంలో అనధికార కోతలు విధిస్తూనే 24 గంటలు ఇస్తున్నామని గొప్పలు చెప్పుకోవడం ఎంత వరకు సమంజసమని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

చెడిపోతున్న గృహోపకరణాలు..

విద్యుత్‌ సరఫరాలో అంతరాయమే కాకుండా కొన్ని సార్లు హెచ్చు తగ్గులు కూడా ఉండటంతో గృహోపకరణాలు పాడవుతున్నాయి. తరచుగా కరెంటు వస్తూ, పోతూ ఉండటంతో ఇండ్లలో టీవీలు, రిఫ్రిజిరేటర్లు, ఇతర విద్యుత్ వస్తువులు చెడిపోతున్నాయని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు చర్యలు, తీసుకుని గతంలో మాదిరి నిరంతరం కరెంటు సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని గ్రేటర్ వాసులు కోరుతున్నారు. నిరంతర విద్యుత్ సరఫరాకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

చాలా ఇబ్బంది పడుతున్నాం.. దొంత సత్యనారాయణ, శైలజపురి కాలనీ, ఎల్బీనగర్

ఇటీవల కాలంలో కరెంటు రావడం పోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం. ముందే ఎండాకాలం కావడంతో ఉక్కపోత భరించలేక ఉంటున్నాం. లిఫ్టులో ప్రయాణించాలన్నా.. కరెంటు ఎప్పుడు పోతుందోనని భయాందోళన చెందుతున్నాం. విద్యుత్ సమస్య లేకుండా చూడాలి.

పనులు సాగడం లేదు.. సత్యం, మీసేవ నిర్వాహకుడు, చైతన్యపురి

గతంలో కంటే ఈ మధ్యకాలంలో విద్యుత్ కోతలు ఎక్కువయ్యాయి. తద్వారా మీ సేవకు వచ్చే కస్టమర్లు గంటలకొద్దీ నిలబడాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. విద్యుత్ కోతలు ఉండటంతో ప్రజలు సైతం ఇబ్బందులు పడుతున్నారు. కోతలు నివారించాలి.

Next Story

Most Viewed