గ్రూప్ –1 క్వశ్చన్ పేపర్ల తయారీలో న్యూ ప్లాన్... ప్రశ్నలను రోటేట్​ చేస్తూ...

by S Gopi |   ( Updated:2022-10-15 15:36:37.0  )
గ్రూప్ –1 క్వశ్చన్ పేపర్ల తయారీలో న్యూ ప్లాన్... ప్రశ్నలను రోటేట్​ చేస్తూ...
X

దిశ, తెలంగాణ బ్యూరో: గ్రూప్ –1 రాత పరీక్షలో జంబ్లింగ్ విధానం కాకుండా.. ప్రశ్నాపత్రాల్లోనూ మల్టీ జంబ్లింగ్​విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చారు. గ్రూప్ –1 ప్రిలిమ్స్​పరీక్షకు ఒకే ప్రశ్నాపత్రం ఉండగా.. ప్రశ్నలు మాత్రం జంబ్లింగ్​విధానంలో ఉండనుంది. ఇలా 150 ప్రశ్నలను జంబ్లింగ్​పద్ధతిలోనే ఇస్తున్నారు. ఆదివారం ఉదయం 10.30 గంటల నుంచి గ్రూప్​ –1 ప్రిల్సిమ్స్​ పరీక్ష మొదలవుతున్న విషయం తెలిసిందే. ఈ పరీక్షలకు టీఎస్ పీఎస్సీ అన్ని ఏర్పాట్లు చేసింది. 33 జిల్లాల వారీగా ప్రత్యేక కోడ్​లను కేటాయించిన టీఎస్​పీఎస్సీ.. అభ్యర్థుల ఫోన్లకు సమాచారాన్ని సైతం పంపించింది.

మల్టీపుల్​జంబ్లింగ్​

ఇప్పటివరకు పరీక్షా కేంద్రాలు, పరీక్షా పత్రాల్లో జంబ్లింగ్ విధానాన్ని అవలంభించగా.. టీఎస్ పీఎస్సీ మాత్రం ఈసారి ప్రశ్నల్లో కూడా మల్టీపుల్​జంబ్లింగ్​విధానాన్ని తీసుకువచ్చింది. తొలిసారి గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షలో ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. పక్కపక్కన కూర్చునే అభ్యర్థులకు వేర్వేరు సెట్ల ప్రశ్నపత్రాలను ఇవ్వనున్నారు. అంటే ప్రశ్నలు మారవు కానీ.. ఎక్కడ ఏ ప్రశ్న వచ్చిందనేది మాత్రం తెలుసుకోవడం కష్టమే. ఇలా ప్రశ్నపత్రాల సెట్ల రూపకల్పనలో కూడా ఈసారి కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చారు. ఇప్పటివరకు సాధారణంగా ఎ,బి,సి,డి అక్షరాలతో ప్రశ్నపత్రాల సెట్లను సిద్ధం చేశారు. ఈసారి అలా కాకుండా 001 లేదా 15‌1 వరకు నెంబర్లతో కూడిన సెట్లను రూపొందిస్తున్నారు. తద్వారా పరీక్ష కేంద్రంలో ఏ అభ్యర్థికి ఏ సెట్‌ ప్రశ్న పత్రం వచ్చిందనే విషయాన్ని అంచనా వేయడం కష్టమవుతుంది. అంతేకాకుండా పక్కనే కూర్చుండే అభ్యర్థులు ఎలాగైనా కాపీ చేసేందుకు ప్రయత్నించినా.. ఒక ప్రశ్న.. మరో ప్రశ్నతో లింక్​కుదరదు. అంటే 1వ నెంబర్ లో ఒక ప్రశ్న వస్తే.. అదే ప్రశ్న ఇంకో పేపర్ లో 100 నెంబర్ లోనే, ఆ తర్వాత ఏదో నెంబర్​లోనే ఉంటోంది. దీంతో జవాబులు కాపీ చేయడం కష్టం కానుంది. ఈ విధానంతో అక్రమాలు జరిగే అవకాశం ఉండదని అధికారులు భావిస్తున్నారు. అభ్యర్థులు తమకు వచ్చిన సెట్‌ నెంబరును జవాబు పత్రంలో నింపాల్సి ఉంటుంది. గ్రూప్ –1 ప్రిలిమ్స్​పరీక్షను ఓఎంఆర్‌ షీట్‌ విధానంలో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.



4 వేల బస్సులు

గ్రూప్​ –1 పరీక్షల కోసం ఆర్టీసీ 4 వేల బస్సులను ప్రత్యేకంగా నడుపుతున్నట్లు వెల్లడించింది. జిల్లాలోనూ పరీక్షా కేంద్రాల వద్దకు తీసుకెళ్లనున్నారు. గ్రేటర్ పరిధిలోనే వెయ్యి బస్సులను అభ్యర్థుల కోసం నడుపుతున్నారు. సాధారణ ఛార్జీలతోనే ఈ బస్సులు నడువనున్నాయి. మరోవైపు గ్రూప్ –1 పరీక్ష సందర్భంగా కేంద్రాల దగ్గర 144 సెక్షన్ అమల్లోకి తీసుకువచ్చిన పోలీసులు.. ఆదివారం ఉదయం నుంచి ట్రాఫిక్ నియంత్రణపైనా దృష్టి పెట్టారు. రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో బైక్​లతో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం 503 పోస్టుల కోసం 3,80,201 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. పరీక్ష కోసం రాష్ట్ర వ్యాప్తంగా 1,019 కేంద్రాలను సిద్ధం చేశారు. పరీక్షా కేంద్రంలో హాల్‌ సైజ్‌ను బట్టి ఒక్కో హాల్లో 24 మంది లేదా, 36 లేదా 48 మంది అభ్యర్థులు పరీక్ష రాసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్టు కమిషన్‌ ఛైర్మన్‌ జనార్దన్‌రెడ్డి చెప్పారు. ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు వచ్చే ఏడాది ఫిబ్రవరి మాసాల్లో మెయిన్‌ పరీక్షను నిర్వహించనున్నారు.

కాగా, రాష్ట్రవ్యాప్తంగా 3.80 లక్షల మంది ఈనెల 16న జరిగే గ్రూప్ –1 ప్రిలిమినరీ ఎగ్జామ్​కు హాజరయ్యే అభ్యర్థుల సంఖ్యను టీఎస్​ పీఎస్సీ విడుదల చేసింది. ఏయే జిల్లాలో ఎంత మంది అభ్యర్థులు పరీక్ష రాస్తున్నారనే వివరాలను తాజాగా విడుదల చేసింది. ఇప్పటికే అభ్యర్థులు పాటించాల్సిన నియమ నిబంధనల జాబితాను ఇప్పటికే విడుదల చేసింది. పరీక్ష నిర్వహణకు సంబంధించి అభ్యర్థులకు ఏమైనా సందేహాలుంటే నివృత్తి చేసేందుకు వీలుగా హెల్ప్​ లైన్ ఏర్పాటు చేసింది. గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్ష ముగిసిన తర్వాత మూడురోజుల్లో ప్రాథమిక కీని వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచేందుకు టీఎస్​పీఎస్​ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 20లోపు 'కీ' విడుదలయ్యేలా టెంటెటివ్​ షెడ్యూలు సిద్ధం చేసింది. దానిపై అభ్యంతరాలు స్వీకరించిన తర్వాత నిపుణుల కమిటీ ఫైనల్‌ 'కీ'ని ప్రకటిస్తుంది గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలను రెండు నెలల్లో ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు కమిషన్​వర్గాలు వెల్లడించాయి.

ఇవి కూడా చదవండి :

గ్రూప్-1 పరీక్షను రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఎంతమంది రాస్తున్నారంటే...?

Next Story

Most Viewed