గౌలిపుర కబేళా కథా కమీషు.. రూ.200 కోట్ల స్థలం హాంఫట్

by Aamani |
గౌలిపుర కబేళా కథా కమీషు.. రూ.200 కోట్ల స్థలం హాంఫట్
X

దిశ, సిటీ బ్యూరో : ఒకపక్క చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ స్థలాలు, రోడ్లు, పార్కులు, పుట్ పాత్‌ల కబ్జాలను అరికట్టడంతోపాటు వాటిని పరిరక్షించడమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇలాంటి తరుణంలో జీహెచ్ఎంసీకి చెందిన 7 ఎకరాలకు పైగా భూమి అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రైవేటు వ్యక్తుల పాలైంది. ఈ విషయంపై ఆరే కటిక సంఘం ఆధ్వర్యంలో పలుమార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

4.2 ఎకరాల భూమి..

హైదరాబాద్‌ గౌలిపురాలో నిజాం కాలం నుంచి కబేళా నిర్వహణ ఉంది. దీనికి సంబంధించి జీహెచ్‌ఎంసీకి చెందిన 4.2 ఎకరాల స్థలంలోనే కబేళా నిర్వహిస్తున్నారు. కొన్ని కారణాలతో 2003లో హైకోర్టు ఆదేశాలతో గౌలిపురా కబేళా మూతపడింది. అప్పటి నుంచి ఈ స్థలాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని కొంత మంది కన్నేశారు. కబ్జాదారులకు జీహెచ్ఎంసీ, రెవెన్యూ అధికారులు వంతపాడడం తో కోట్ల రూపాయల విలువైన స్థలాన్ని కొట్టేశారు.

గౌలిపురలోని 4.2 ఎకరాల భూమిని 2010లో హైదరాబాద్‌ జిల్లా అప్పటి కలెక్టర్‌ నవనీన్ మిట్టల్ ప్రైవేట్ వ్యక్తులకు మ్యుటేషన్‌ చేశారు. జీహెచ్‌ఎంసీ అధికారులు ఆ భూమి తమదని కోర్టును ఆశ్రయించారు. తర్వాత హైదరాబాద్‌ కలెక్టర్‌గా వచ్చిన గుల్జార్‌.. గౌలిపురా భూమి మ్యుటేషన్‌ను రద్దు చేసి ప్రభుత్వానికి చెందినదిగా ప్రకటించారు. అప్పట్లో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. దీనిపై పలువురు కోర్టును ఆశ్రయించారు. అయితే ప్రభుత్వ నిర్ణయంతో అక్కడ రూ.7 కోట్లతో రాంకీ సంస్థల ఆధ్వర్యంలో మోడ్రన్ కబేళాను నిర్మించారు.

అఫిడవిట్‌తోనే ఆగం..

గౌలిపురలో 4.2 ఎకరాల స్థలం విషయంలో జీహెచ్ఎంసీ, రెవెన్యూ అధికారులు ప్రైవేట్ వ్యక్తులతో కుమ్మక్కై కనీసం కౌంటర్ దాఖలు కూడా చేయడంలేదని ఆరే కటిక సంఘం ప్రతినిధులు పలుమార్లు ఆవేదన వ్యక్తం చేశారు. పైగా ఈ స్థలం తమది కాదని జీహెచ్ఎంసీ, రెవెన్యూ అధికారులు జీహెచ్ఎంసీ కమిషనర్ పేరుతో కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. ఈ విషయాన్ని జీహెచ్ఎంసీ అధికారులను అడిగితే తమకేం తెలియదని బుకాయించారు. అంతేకాదు సంతకం పెట్టిన అప్పటి కమిషనర్ సైతం తనకు తెలియకుండా దాఖలు చేశారని చెప్పడం శోచనీయం. కొంత మంది అధికారులు కమిషనర్‌ను తప్పుదోవ పట్టించారని ప్రచారం జరుగుతున్నది.

3 ఎకరాల స్థలం ఊసేది?

గౌలిపుర కబేళాకు సంబంధించిన 4.2 ఎకరాల స్థలం తో పాటు 1961లో మరో 3 ఎకరాలను ఎంసీహెచ్ అధికారులు కొనుగోలు చేశారు. కానీ ఈ మూడు ఎకరాల భూమి ఎవరి చేతిలో ఉందనేది ప్రశ్నార్థకంగా మారింది. అధికారుల నిర్లక్ష్యం కారణంగా గౌలిపుర కబేళా ఉనికి ప్రశ్నార్థకంగా మారిందని, ఆరే కటికల జీవితాలను జీహెచ్ఎంసీ అధికారులు ఆగం చేశారని సదరు కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

హైడ్రాకు ఫిర్యాదు చేసినా..

గౌలిపుర 4.2 ఎకరాల స్థలాన్ని ప్రైవేట్ వ్యక్తులు దక్కించుకోవడం తో పాటు మరో 3 ఎకరాల స్థలం గురించి ఆరే కటిక సంఘం ఆధ్వర్యంలో హైడ్రా కు ఫిర్యాదు చేశారు. ఇప్పటి వరకైతే దీనిపై హైడ్రా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఏమైనా రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయా? దీనిపై కమిషనర్ రంగనాథ్ దృష్టి సారించలేదా? అనేది చూడాలి. ఇప్పటికైనా హైడ్రా కమిషనర్ రంగనాథ్ జోక్యం చేసుకొని గౌలిపుర స్థలాన్ని కబ్జా దారుల నుంచి కాపాడాలని, అఫిడవిట్ విషయంలో కుట్రలు చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆరే కటిక సంఘం నేతలు డిమాండ్ చేస్తున్నారు.

కమిషనర్ కర్ణన్ ఫోకస్..

గౌలిపుర కబేళాపై జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ ప్రత్యేక ఫోకస్ పెట్టారు. కబేళాను పునః ప్రారంభిస్తామని ప్రకటించడంతో ఆరే కటిక సంఘం నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. యంత్రాలను మరమ్మతులు చేసి త్వరలోనే ప్రారంభిస్తామని జీహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నారు. అయితే కబేళాను మాత్రం ప్రారంభిస్తారా? కబ్జాకు గురైన భూమిపై ఏమైనా నిర్ణయం తీసుకుంటారా? అనేది చూడాల్సిందే.



Next Story

Most Viewed