మాన్‌సూన్ యాక్షన్ ప్లాన్ రెడీ.. రంగంలోకి 400 టీమ్స్

by srinivas |
మాన్‌సూన్ యాక్షన్ ప్లాన్ రెడీ..  రంగంలోకి 400 టీమ్స్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రానున్న వర్షాకాలానికి ముందుగానే జీహెచ్ఎంసీ యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తోంది. వర్షాకాలం భారీ వర్షాల నేపథ్యంలో సంభవించనున్న వరదలు, నాలాలు పొంగిపోర్లడం, లోతట్టు ప్రాంతాల మునక, వాటర్ లాగింగ్ పాయింట్లలో తీసుకునే చర్యలపై బల్దియా యాక్షన్ ప్లాన్ రూపొందించే పనిలో నిమగ్నమైంది. గత రెండేండ్ల నుంచి వర్షాకాలంలో సంభవించే పరిణామాలు, ప్రజలు ఎదర్కొనే ఇబ్బందులు, జీహెచ్ఎంసీ తీసుకోవాల్సిన చర్యల గురించి అధ్యయనం చేసి నివేదిక రూపొందించడానికి కసరత్తు చేస్తున్నారు.

400 టీమ్స్..

గ్రేటర్‌లో 154 మాన్‌సూన్ ఎమర్జెన్సీ బృందాలు, 252 స్టాటిక్ బృందాలు మొత్తం 400లకుపైగా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. వాతావరణ శాఖ వర్ష సమాచారం అందించిన నేపథ్యంలో వెనువెంటనే ముందస్తుగా తీసుకోవాల్సిన చర్యలు, వాటర్ లాగింగ్ పాయింట్ల వద్ద నిలిచిన నీటిని వెంటనే తొలగించేందుకు తీసుకునే చర్యలు, అందుకు కావాల్సిన యంత్రాలను సమకూర్చుకోవాలని అధికారులు నిర్ణయించారు.

నాలాల పూడికతీత..

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వర్షాకాలానికి ముందుగానే ఎక్కడికక్కడ నాలాల్లో పూడికతీత పనులు పూర్తి చేయాలని నిర్ణయించారు. రూ.55 కోట్లతో 203 పనులు చేయాలని నిర్ణయించారు. 120 పనులు పురోగతిలో ఉన్నాయి. మిగిలిన పనులకు సంబంధించిన టెండర్ ప్రక్రియ పూర్తయింది. పనులు కూడా ప్రారంభమయ్యాయి. రెండు నెలల్లో నాలాల్లో పూడికతీత పనులను పూర్తిచేసే విధంగా ప్రణాళిక రూపొందించారు.

సర్కిల్‌కు ఒక డీఆర్ఎఫ్ టీమ్..

వర్షాకాలంలో సంభవించే వరదలు, రోడ్లపై నీళ్లు నిలవడం వంటి వాటిని పర్యవేక్షించడంతో పాటు పరిష్కరించడానికి హైడ్రా ఆధ్వర్యంలో డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్(ఢీఆర్ఎఫ్) టీమ్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీంతో పాటు వర్షాకాలంలో చోటుచేసుకునే పరిణామాలపై జీహెచ్ఎంసీ, హైడ్రా అధికారులతో ప్రత్యేక కమిటీలను వేయాలని నిర్ణయించారు. ఈ కమిటీ సూచన మేరకు వర్షాకాలం యాక్షన్ ప్లాన్ రూపొందించనున్నారు.

భద్రతా చర్యలు..

వర్షాకాలంలో ప్రమాదకరమైన నాలాలను గుర్తించడంతో పాటు వాటిలో పూడికతీసి వాటర్ సాఫీగా వెళ్లేవిధంగా చర్యలు తీసుకోనున్నారు. నాలాలకు రీటెయినింగ్ వాల్స్ ఏర్పాటు, వరద నీటి కాలువల నిర్మాణం, మ్యాన్ హోల్స్ ఏర్పాటు, వాటి మరమ్మతులు, వాటికి పైకప్పులు ఏర్పాటు చేయడం వంటి పనులు వర్షాకాలానికి ముందుగానే పూర్తి చేసేవిధంగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.



Next Story

Most Viewed