- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ప్రతి రైతుకు భూ భారతిపై అవగాహన అవసరం: కోదండరెడ్డి

దిశ, తెలంగాణ బ్యూరో: రైతులు నకిలీ విత్తనాలతో నష్టపోకుండా ఉండాలంటే సమగ్ర విత్తన చట్టం అవసరమని, రాష్ట్రంలో విత్తన చట్టాన్ని తీసుకురావాలని ప్రభుత్వానికి సూచించినట్లు రైతు కమిషన్చైర్మన్ కోదండరెడ్డి పేర్కొన్నారు. రైతులకు ప్రభుత్వానికి రైతు కమిషన్వారధిగా పనిచేస్తుందని, ప్రతి రైతుకు భూ భారతి చట్టంపై అవగాహన ఉండేలా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. మంగళవారం వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ కార్యాలయంలో సభ్యులు కెవిఎన్ రెడ్డి, గోపాల్ రెడ్డి, రాములు నాయక్, భవానీ రెడ్డి, భూమి సునీల్, గడుగు గంగాధర్, చెవిటి వెంకన్న యాదవ్ లతో సమావేశం నిర్వహించారు. రైతు కమిషన్ ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు చేసిన కార్యక్రమాలు, భవిష్యత్ కార్యక్రమాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ రైతు కమిషన్ ఏర్పడిన ఆరు నెలల కాలంలో కమిషన్ అనేక కార్యక్రమాలు నిర్వహించిందని, రైతాంగానికి అండగా నిలిచిన విషయాలను గుర్తుచేసుకున్నారు. ఈ ఆరు నెలల్లో పలు జిల్లాలో పర్యటనలు, సమీక్షలు, సమావేశాలు చేపట్టడమే కాదు, రైతులు, రైతు సంఘాల నేతలు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, మేధావుల నుండి పలు అంశాలపై అభిప్రాయ సేకరణ చేసిందని తెలిపారు.
ములుగు జిల్లాలో మొక్కజొన్న విత్తనోత్పత్తి విషయంలో మల్టీనేషనల్ కంపెనీలు చేసిన మోసాలను కమిషన్ వెలికి తీయడమే కాకుండా రైతులకు న్యాయం చేసేలా చర్యలు చేపట్టి నష్టపరిహారం అందేలా చూసిందన్నారు. సూర్యాపేటలో నకిలీ వరి విత్తనాలతో మోసపోయిన రైతులకు నష్టపరిహారం అందించేలా కృషిచేసింది. నిజామాబాద్ జిల్లాలో పర్యటించి, పసుపు రైతుల సమస్యలు తెలుసుకుని పసుపు బోర్డు ఏర్పాటులో కీలకంగా వ్యవహరించినట్లు చెప్పారు. వరంగల్ ఎనుమాముల మార్కెట్ లో దళారుల మోసాలు, మార్కెట్ అధికారుల నిర్లక్ష్యం కమిషన్ పర్యటనతోనే వెలుగులోకి వచ్చాయన్నారు. కేంద్రప్రభుత్వం కొత్తగా తీసుకొస్తున్న నూతన మార్కెట్ పాలసీ విధానాన్ని వ్యతిరేకించిందని, దాని ద్వారా జరిగే నష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక రూపంలో పంపింది. ఆదర్శ రైతు వ్యవస్థను మళ్లీ తీసుకురావాలని, మేజర్ నుండి మైనర్ ఇరిగేషన్ ను విడదీసి నీటి సంఘాలను ఏర్పాటు చేసి రైతులకు బాధ్యత ఇవ్వాలని ప్రభుత్వానికి సూచన చేసినట్లు వెల్లడించారు.