- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
తార్నాక ఎర్రకుంట చెరువు 9 ఎకరాల స్థలం ఆక్రమణ..

దిశ ,హైదరాబాద్ బ్యూరో: తార్నాక ఎర్రకుంట చెరువు ప్రభుత్వ స్థలంలో రాత్రికి రాత్రే అక్రమ నిర్మాణాలు వెలిశాయి. సుమారు 9 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించి ఏర్పాటు చేసిన గుడిసెలను అధికారులు తొలగించడం ద్వారా కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ స్థలాన్ని కాపాడినట్లైంది. తార్నాక లోని సర్వే నెంబర్ 121, 122, 123, 125 లలో ఉన్న 9 ఎకరాల ఎర్రకుంట చెరువు స్థలంలో శనివారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు ఆక్రమించుకుని సుమారు 250 వరకు గుడిసెలను ఏర్పాటు చేశారు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ ల పరిధిలో ఉన్న ఈ స్థలంలో వాకింగ్ ట్రాక్, పార్క్ ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కాగా ఈ స్థలం విషయంలో న్యాయస్థానంలో కేసులు సైతం నడుస్తుండడం తో అధికారులు ఎటువంటి నిర్మాణాలు చేపట్టడం లేదు. ఇదే అదునుగా అర్ధరాత్రి దాటిన తర్వాత కొంతమంది స్థలంలో గుడిసెలు నిర్మించుకోవడం, ఇది జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, ఆర్డీవో సాయిరాం ల వరకు వెళ్లడంతో వారి ఆదేశాల మేరకు పోలీసు భద్రత మధ్య వాటిని తొలగించారు. ఈ సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది.
సందర్శించిన డిప్యూటీ మేయర్…
తార్నాక ఎర్రకుంట చెరువు స్థలంలో గుడిసెలు నిర్మించారనే సమాచారం అందుకున్న జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలతా శోభన్ రెడ్డి చెరువు వద్దకు చేరుకుని ఆక్రమణలను పరిశీలించడం తో పాటు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఓయూ పోలీసులు వెంటనే రంగంలోకి దిగి, అక్రమంగా కబ్జా చేస్తున్న వారిపై చర్యలు తీసుకొని, గుర్తు తెలియని వ్యక్తులు కడుతున్న గుడిసెలను తొలగించారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ.. చెరువులు, నాళాలు, ప్రభుత్వ స్థలాల కబ్జాలను అరికట్టేందుకు ప్రభుత్వం నిత్యం కృషి చేస్తోందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ విషయంలో ఎంతో కఠినంగా ఉన్నట్లు తెలిపారు. ప్రజల శ్రేయస్సు కోసం ప్రభుత్వ స్థలాలను కాపాడటమే తమ కర్తవ్యమన్నారు . ఇలాంటి కబ్జా కార్యక్రమాలను అరికట్టేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసి పటిష్టమైన చర్యలను చేపడుతోందన్నారు. హైడ్రా నగరంలోని ప్రభుత్వ స్థలాలు, చెరువులు, నాళాలపై జరుగుతున్న అక్రమాలను గుర్తించి తక్షణమే చర్యలు తీసుకునేలా డిజైన్ చేయబడిందని ఆమె అన్నారు. తార్నాక ఎర్రకుంట చెరువు ఘటనపై కూడా హైడ్రా ద్వారా ప్రత్యేక విచారణ చేపట్టనున్నామని డిప్యూటీ మేయర్ తెలిపారు. టిటియుసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతే శోభన్ రెడ్డి మాట్లాడుతూ.. తార్నాక ఎర్రకుంట చెరువు జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ లకు సంబంధిత స్థలమన్నారు. ఈ స్థలాన్ని స్థానికుల కోసం వాకింగ్, పార్క్ ఏర్పాటు చేయడానికి ఉపయోగించాలని అనుకున్నప్పటికీ కొన్ని కోర్టు కేసుల కారణంగా ఆ ప్రక్రియ నిలిచిపోయిందని చెప్పారు. భవిష్యత్తులో ఈ ప్రాంతాన్ని ప్రజల అవసరాలకు ఉపయోగించేలా చూస్తామన్నారు.