ఎండల్లో ఎదురుచూపులు

by Sumithra |
ఎండల్లో ఎదురుచూపులు
X

దిశ, శేరిలింగంపల్లి : ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 9 గంటల నుండే భానుడు తన ప్రతాపం చూపుతున్నాడు. 11 గంటల వరకు జనాలు బయటకు వెళ్లలేని పరిస్థితి కనిపిస్తుంది. అంతటి ఎండలోనూ పనుల మీద బయటకు వెళ్లే వారు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. బస్సులు, ఇతర ప్రైవేట్ వాహనాల మీద పనుల మీద వెళ్లేవారు ఉన్న బస్టాప్ లను కూడా తొలగించడంతో నిలువ నీడ లేక ఇబ్బందులు పడుతున్నారు. ఉన్న బస్టాప్ లను కూడా వ్యాపార సంస్థలకు అడ్డంగా ఉన్నాయని తొలగించడం పట్ల ప్రయాణీకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నగర రోడ్ల మీద పడిగాపులు..

గత కొద్దిరోజులుగా నగరంలో ఉష్ణోగ్రతలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం వరకు ప్రజలు ఎవరూ రోడ్ల మీద తిరగవద్దని హెచ్చరికలు జారీ చేస్తుంది. అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని సూచిస్తున్నారు. కానీ పనులు ఉన్నవారికి బయటకు వెళ్లక తప్పని పరిస్థితి. అలాంటి వారు బస్సులు, ఇతర ప్రైవేట్ వాహనాల కోసం బస్టాండ్ ల వద్ద ఎండల్లోనే నిరీక్షించాల్సి వస్తుంది. హైదరాబాద్ నగర వ్యాప్తంగా పలుచోట్ల బస్టాండ్ లు లేని దుస్థితి నెలకొంది. కొన్నిచోట్ల ఉన్న బస్టాండ్ లను తమ వ్యాపారాలకు అడ్డుగా ఉన్నాయని తీసివేస్తుండగా, ఇంకొన్ని చోట్ల ఆ బస్టాండ్ లను కూడా తమ సొంత ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారు.

అడ్డుగా ఉన్నాయని తొలగించారు..

శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో పలుచోట్ల బస్టాండ్ లు తొలగించారు. హైదరాబాద్ బాంబే హైవే పైన మదీనగూడ వద్ద దీప్తి శ్రీనగర్ ఫుట్ ఓవర్ బ్రిడ్జి పక్కనే బస్టాప్ ఉండేది. ఫుట్ ఓవర్ బ్రిడ్జి కట్టే సమయంలో కూడా బస్టాప్ కు ఇబ్బంది లేకుండా చూశారు. కానీ ఇటీవల బస్టాప్ పక్కనే ఓ వ్యాపార షోరూం ప్రారంభమైంది. దానికి అడ్డు వస్తుందని రాత్రికి రాత్రే బస్టాప్ తొలగించారు. ఏళ్ల తరబడి ఉన్న బస్టాప్ ను తొలగించ వద్దని దీప్తి శ్రీనగర్ కాలనీ వాసులు ఆందోళన చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. కేపీహెచ్బీ, అమీర్ పేట్, సికింద్రాబాద్ లాంటి ప్రాంతాలకు వెళ్లాల్సిన వారు ఫుట్ ఓవర్ బ్రిడ్జి కింద నిలబడాల్సి వస్తుంది.

గంగారం బస్టాప్ తొలగింపు..

బీహెచ్ ఈఎల్, పఠాన్ చెరు, ఇస్నాపూర్ వైపు వెళ్లే వారి కోసం గంగారం వద్ద బస్టాప్ ఉండేది. గత కొద్దిరోజుల క్రితం అక్కడ ఓ హోటల్ వెలిసింది. కొద్ది కాలం అలాగే ఉన్న బస్టాప్ ను ఉన్నపళంగా గత నెలలో తొలగించారు. ఇప్పుడు ఆ హోటల్ వారు బస్టాప్ ను తొలగించిన స్థానంలో టైల్స్ వేసి పార్కింగ్ కోసం వాడుకుంటున్నారు. అదే స్థానంలో ఓ సెక్యూరిటీ గార్డును కూడా ఏర్పాటు చేశారు. గతంలో ఎక్స్ ప్రెస్ బస్టాప్ గా ఉన్న మరోచోట ఇప్పుడు బస్సులను నిలుపుతున్నారు. హోటల్ కు వచ్చే వారిని తప్ప పాత బస్టాప్ వద్ద అక్కడ ఉన్న సెక్యూరిటీ ఎవరిని నిలబడనియ్యడం లేదు.

ఆర్టీసీకి సంబంధం లేదు.. ట్రాఫిక్ పోలీసులకు తెలియదు..

ప్రధాన రహదారిలో బస్టాప్ లను తొలగించడం పై ఆర్టీసీ అధికారులను వివరణ కోరగా తమకేం తెలియదని చెబుతుండగా, ట్రాఫిక్ పోలీసులు ఈ ఇష్యూ పై కనీసం స్పందించేందుకు కూడా ససేమిరా అంటున్నారు. ప్రజలను ఇబ్బందులు పెడుతూ ప్రజా అవసరాల కోసం ఏర్పాటు చేసిన బస్టాప్ లను తొలగించడం పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ అధికారులు బస్టాప్ ల ఏర్పాట్ల పై దృష్టి పెట్టాలని కోరుతున్నారు.

బస్టాప్ లను ఏర్పాటు చేయాలి : సీఐటీయూ నాయకుడు కె. కృష్ణ

ప్రజల సౌకర్యార్ధం ఏర్పాటు చేసిన బస్టాప్ లను తీసేసి, పార్కింగ్ ల కింద వాడుకుంటున్న వ్యాపార సముదాయాల మీద ఆర్టీసీ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలి, పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. గతంలో ఉన్న బస్టాప్ ల స్థానంలో తిరిగి వాటిని ఏర్పాటు చేయాలి. లేదంటే సీపీఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతాం.



Next Story

Most Viewed