బండి సంజయ్ పాదయాత్రలో బుల్డోజర్లతో ర్యాలీ

by Disha Web Desk 18 |
బండి సంజయ్ పాదయాత్రలో బుల్డోజర్లతో ర్యాలీ
X

దిశ, ఎల్బీనగర్: బీజేపీ రాష్ట్ర చీఫ్, ఎంపీ బండి సంజయ్ చేపట్టిన నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్ర 10వ రోజు ఎల్బీనగర్ నియోజకవర్గంలో దిగ్విజయంగా కొనసాగుతోంది. ఎల్బీనగర్ నియోజకవర్గం పరిధిలోని వనస్థలిపురం, మన్సూరాబాద్, హయత్ నగర్ డివిజన్ ల పరిధిలోని కాలనీలలో పాదయాత్ర కొనసాగింది. బండి సంజయ్ పాదయాత్రకు కనీవినీ ఎరగని రీతిలో ప్రజలు స్వాగతం పలికారు. అడుగడుగునా బండిపై పూల వర్షం కురిపిస్తూ జనం నీరాజనం పలికారు. హయత్ నగర్ లో బుల్డోజర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. బండి సంజయ్ బీజేపీ రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షులు సామ రంగారెడ్డి, కార్పొరేటర్ లు కొప్పుల నరసింహారెడ్డి, కళ్లెం నవజీవన్ రెడ్డిలతో కలిసి బుల్డోజర్ ఎక్కి ప్రజలకు అభివాదం చేశారు. అనంతరం హయత్ నగర్ చౌరస్తాలో అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమం కోసమే ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టినట్లు తెలిపారు. ప్రజా సమస్యలు పరిష్కరించడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. కేసీఆర్ పాలనలో ప్రజలు ఎవరూ సంతోషంగా లేరన్నారు. ఆచరణ సాధ్యం కానీ హామీలు ఇచ్చి, ప్రజలను మోసం చేస్తూ, మభ్యపెడుతూ మొహం చాటేశారని ఫైర్ అయ్యారు. వచ్చేది బీజేపీ ప్రభుత్వమే అని, రాష్ట్రంలో అధికారంలోకి ప్రజలకు రాగానే ఉచిత విద్య, ఉచిత వైద్యం అందజేస్తామని ప్రకటించారు. అర్హులైన ప్రతి పేదవారికి ఇళ్లు కట్టిస్తామని స్పష్టం చేశారు. అనంతరం బండి సంజయ్ పాదయాత్ర పెద్ద అంబర్ పేట్ కు బయలుదేరింది.


Next Story