టెర్రస్ నుంచి పడి వృద్ధుడు మృతి

by Disha Web Desk 15 |
టెర్రస్ నుంచి పడి వృద్ధుడు మృతి
X

దిశ, ముషీరాబాద్ : టెర్రస్‌పై నుండి కిందికి చూస్తూ ప్రమాదవశాత్తూ పడి 87 ఏళ్ల వృద్ధుడు మృతి చెందిన సంఘటన దోమల్‌గూడ పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపిన ప్రకారం వివరాలిలా ఉన్నాయి... మొసలి కేశవ రెడ్డి ( 87 ) వెటర్నరీ డాక్టర్ గా రిటైర్డ్ అయ్యాడు. అతని భార్య సక్కు భాయి తో కలిసి దోమలగూడలోని గగన్ మహల్ రోడ్ అరవింద రెసిడెన్సిలో 501 ప్లాట్ లో నివాసముంటున్నారు. గత నాలుగైదు సంవత్సరాలుగా కేశవ రెడ్డి మానసిక రుగ్మతతో బాధపడుతున్నారు. ఇదిలా ఉండగా వీరి కూతురు కొండేటి నిరంజని ఆమె కొడుకు భార్గవ్ తో కలిసి యుఎస్ఏలోని ఫ్లోరిడాలో నివాసముంటుంది. రెండు నెలల క్రితమే కొడుకు భార్గవ్ తో కలిసి నిరంజని తండ్రి కేశవ రెడ్డి వద్దకు వచ్చారు.

తండ్రికి ప్రతి రోజు మందులను ఇస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం నిరంజని వంట చేస్తుండగా, భార్గవ్ స్నానం చేస్తున్నాడు. సక్కుబాయి తన రూమ్‌లో ఉంది. అప్పటి వరకు కేశవ రెడ్డి హాల్ లో టీవీ చూస్తున్నాడు. పది నిమిషాల వ్యవధిలో అపార్ట్‌మెంట్ వాచ్‌మెన్ వచ్చి కేశవ రెడ్డి అపార్ట్‌మెంట్ భవనం పై నుండి పడిపోయినట్లు సమాచారం అందించాడు. వారు కిందకు వెళ్లి చూడగా కేశవరెడ్డి రక్తపు మడుగుతో భవనం సెల్లార్‌లో పడి ఉన్నాడు. ఆసుపత్రికి తరలిద్దామనుకునే లోపు అప్పటికే కేశవ రెడ్డి మృతి చెందినట్టు గుర్తించారు. కేశవ రెడ్డికి మానసిక రుగ్మత ఉన్నందున, అతను తెలియకుండా టెర్రస్‌పైకి వెళ్లి అక్కడ నుండి కిందికి చూస్తుండగా ప్రమాదవశాత్తు భవనం టెర్రస్ నుండి పడిపోయి ఉండవచ్చని కూతురు నిరంజని ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం చేయించి కుటుంబసభ్యులకు అందచేశారు.


Next Story

Most Viewed