ఎత్తుకు పై ఎత్తు.. టీఆర్ఎస్ సర్జికల్ స్ట్రయిక్..

by Sathputhe Rajesh |   ( Updated:2022-11-07 08:42:23.0  )
ఎత్తుకు పై ఎత్తు.. టీఆర్ఎస్ సర్జికల్ స్ట్రయిక్..
X

దిశ, వెబ్‌డెస్క్: మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ ఎత్తుకు పై ఎత్తు వేస్తూ జాగ్రత్తగా వ్యవహరించింది. ఉప ఎన్నిక బాధ్యతలను మంత్రులకు అప్పగించే ఆ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగారు. దుబ్బాక, హుజురాబాద్ ఉపఎన్నికల బాధ్యతలను మంత్రి హరీష్ రావుకి అప్పగించారు. ఫలితాలు ప్రతికూలంగా రావడంతో మునుగోడులో అప్రమత్తమయ్యారు. బీజేపీని తెలంగాణలో నిలువరించాలనే కృతనిశ్చయంతో పావులు కదిపారు. మంత్రులు, ఎమ్మెల్యేలకు ఆయా గ్రామాలు, మండలాలకు ఇన్ ఛార్జీలుగా నియమించారు. స్వయంగా ముఖ్యమంత్రి కూడా ఓ గ్రామానికి ఇన్ ఛార్జీగా వ్యవహరించడం విశేషం. పార్టీలో చేరికల నుంచి ఎమ్మెల్యేల కొనుగోలు అంశం వరకు ప్రతి అంశాన్ని జాగ్రత్తగా వాడుకున్నారు.

కలిసొచ్చిన అంశాలివే..

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రూ.18వేల కోట్ల కాంట్రాక్టు కోసమే బీజేపీలో చేరారని టీఆర్ఎస్ ప్రజల్లోకి ప్రధానంగా తీసుకెళ్లగలిగింది. బీజేపీ తమ నలుగురు ఎమ్మె్ల్యేలను ఒక్కొక్కరికి రూ.100 కోట్లు పెట్టి కొనేందుకు యత్నించిందని, అయినా టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ప్రలోభానికి గురి కాలేదని చెప్పడంలో సఫలం అయింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన బహిరంగ సభలో స్వయంగా ముఖ్యమంత్రి నలుగురు ఎమ్మెల్యేలను చూపించి అమ్ముడుపోకుండా టీఆర్ఎస్ వైపు నిలిచారని ప్రజలకు వివరంగా చెప్పారు. కేటీఆర్ మునుగోడును దత్తత తీసుకుంటానని హామీ ఇవ్వడం, డైరెక్ట్ గా కాల్ చేసి మరి గ్రామస్థులు, ఇతర పార్టీల నాయకులను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు. కేవలం ఒక మంత్రిపై భారం వేయకుండా తమ బలగాన్ని మొత్తం మునుగోడులో మొహరించారు. బీజేపీ‌పై ఒంటి కాలిపై లేచే వామపక్షాలను తమ వైపు తిప్పుకుని అనుకూల ఫలితం రాబట్టడంలో సఫలమయ్యారు. 2024 ఎన్నికల ముందు జరిగే ఉపఎన్నిక కావడం, టీఆర్ఎస్ బీఆర్ఎస్‌గా మారిన తర్వాత వచ్చిన ఉప ఎన్నిక కావడంతో తప్పకుండా గెలవాలని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ప్రత్యేక వ్యుహాలను రచించారు.

కండువాలు మార్చి.. వ్యుహాలు అమలు పర్చి..

మునుగోడు టికెట్‌ను కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి ప్రకటించడంతో గుస్సా మీదున్న బూర నర్సయ్య గౌడ్ బీజేపీలో చేరగా ఆ సామాజిక వర్గానికే చెందిన స్వామిగౌడ్‌ను ఊహించని విధంగా కండువా కప్పి తమ పార్టీలోకి చేర్చుకున్నారు. దాసోజు శ్రవణ్, బూడిద భిక్షమయ్య గౌడ్‌లను తమ పార్టీలో చేర్చుకుని టీఆర్ఎస్‌తోనే తెలంగాణ సుభిక్షంగా ఉంటుందని వారితో స్టేట్‌మెంట్ ఇప్పించారు. హుజురాబాద్‌లో ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత మంత్రులు నియోజకవర్గాన్ని వీడటం, తదనంతరం పరిస్థితులు మారి బీజేపీ అభ్యర్థి ఈటల గెలవడాన్ని దృష్టిలో ఉంచుకుని ఎన్నికల ప్రచార గడువు ముగిసిన కొంత మంది మంత్రులను అక్కడే ఉండేలా చూశారు. ఫ్లోరైడ్ సమస్యను తీర్చామని రానున్న రోజుల్లో అభివృద్ధికి కట్టుబడి ఉంటామని ప్రచారంలో హామీ ఇచ్చారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఇచ్చే పింఛన్లు తెలంగాణలో ఇస్తున్న పింఛన్లు ఎన్ని అని ఓటర్లకు స్పష్టంగా అర్థమయ్యేలా చెప్పారు. ఉప ఎన్నికల్లో సీఎం రెండుసార్లు బహిరంగ సభ నిర్వహించడం ఇదే తొలిసారి. మంత్రి కేటీఆర్, హరీష్ రావులు 4 సార్లు రోడ్డు షోలు నిర్వహించారు. రైతుబంధు, రైతుభీమా, పింఛన్లు పొందుతున్న లబ్ధిదారులను టీఆర్ఎస్ నేతలు నేరుగా కలిసి తమ ప్రభుత్వం అధికారంలో ఉందని తమకు ఓటేస్తే మరికొన్ని అభివృద్ధి పనులు చేస్తామని చెప్పి మునుగోడు ప్రజల తీర్పును ప్రభావితం చేయడంలో సఫలమయ్యారు. పోటీ మాత్రం బీజేపీ, టీఆర్ఎస్ మధ్యే ప్రధానంగా సాగింది. గెలిచి నిలిచింది మాత్రం టీఆర్ఎస్ పార్టీనే..



Next Story