తెలంగాణకు ఎల్లో అలర్ట్ జారీ.. నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

by Disha Web Desk 14 |
తెలంగాణకు ఎల్లో అలర్ట్ జారీ.. నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో రాబోయే మూడ్రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నాయి. ఈ మేరకు పలు జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నేడు నిర్మల్, నిజామాబాద్, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలకు భారీ వర్షసూచన జారీ చేసింది. మిగతా జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయని తెలిపింది. ఇక 28వ తేదీ నుంచి వచ్చే నెల 1వ తేదీ వరకు రాష్ట్రానికి ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

ఇప్పటికే రాష్ట్రంలో గత కొద్దిరోజులుగా భారీ వర్షాలు పడుతున్న విషయం తెలిసిందే. పలు జిల్లాల్లో కుండపోత వానలు కురుస్తున్నాయి. నిన్న మంచిర్యాల జిల్లాలోని కాసిపేటలో 24.4 మిల్లీమీటర్లు, నారాయణపేట జిల్లాలోని కోస్గిలో 26.4 మి.మీ, ఆదిలాబాద్ జిల్లాలోని తలమడుగులో 33.8 మి.మీ, వికారాబాద్ జిల్లాలోని మోమిన్‌పేట్‌లో 38 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక జిల్లాలవారీగా చూస్తే.. ఆదిలాబాద్ జిల్లాలో 18.2 మి.మీ, హైదరాబాద్‌లో 9.0 మి.మీ, నారాయణపేట జిల్లాలో 5.7 మి.మీ, వికారాబాద్ జిల్లాలో 4.3 మి.మీ, నల్లగొండ జిల్లాలో 4.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

బంగాళాఖాతంలో ఇప్పటికే అల్పపీడనం ఏర్పడగా.. దీనికి తోడు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంలో రాష్ట్రంలో భారీ వర్షాలు కురవనున్నాయి. అటు ఏపీలో కూడా భారీ వర్షాలు కురవనున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది.

Next Story