మహిళ రెజ్లర్లపై వేధింపులు యావత్ దేశానికే అవమానకరం: సీపీఐ

by Satheesh |
మహిళ రెజ్లర్లపై వేధింపులు యావత్ దేశానికే అవమానకరం: సీపీఐ
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఒలింపిక్, కామన్వెల్త్ గేమ్స్ పతకాల‌ను సాధించి భార‌త‌దేశ కీర్తి ప‌తాకాన్ని ప్రపంచ‌వ్యాప్తంగా చాటిన మ‌హిళా రెజ్లర్లపై బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరన్ సింగ్ లైంగిక వేధింపులు పాల్పడ‌డం దేశానికే అవమానకరమ‌ని సీపీఐ జాతీయ కార్యదర్శి సయ్యిద్ అజీజ్ పాషా, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డిలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

బ్రిజ్ భూషణ్ వంటి నిందితులను కాపాడుతూ, న్యాయం కోసం పోరాడుతున్న మహిళల క్రీడాకారిణులను అవమానపరుస్తూ బీజేపీ దేశం పరువు తీస్తోంద‌ని మండిప‌డ్డారు. గత కొన్ని రోజులుగా తమకు న్యాయం చేయాలని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న రెజ్లర్లులకు సంఘీభావంగా సీపీఐ తెలంగాణ రాష్ట్ర సమితి హైదరాబాద్, హిమాయత్ నగర్, మఖ్డూమ్ భవన్ నుంచి హిమాయత్ నగర్ వై జంక్షన్ వరకు మంగళవారం ప్రదర్శన నిర్వహించింది.

ఈ సందర్బంగా సయ్యిద్ అజీజ్ పాషా మాట్లాడుతూ మైనర్‌తో సహా ఏడుగురు రెజ్లర్లు పై లైంగిక వేధింపులకు పాల్పడ్డ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ విషయంలో బీజేపీ కేంద్ర నాయకత్వం ఎందుకు మౌనం పాటిస్తున్నారని ప్రశ్నించారు. కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఆదేశాలతో రెండు ఎఫ్ఐఆర్ లు నమోదు చేసినా, అమిత్ షా ఒత్తిడితోనే ఢిల్లీ పోలీసులు బ్రీజ్ భూషణ్ ను అరెస్ట్ చేయడంలేదని మండిపడ్డారు. చాడ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ లైంగిక నేరానికి పాల్పడిన బ్రిజ్ భూషణ్ కు మోడీ ప్రభుత్వం మద్దతు ఇవ్వడం సిగ్గుచేటన్నారు.

మహిళా రెజ్లర్లకు న్యాయం జరిగేవరకు సీపీఐ దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగిస్తూనే ఉంటుందని చాడ వెంకట్ రెడ్డి చెప్పారు. ఈ ప్రదర్శనలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పశ్య పద్మ, వి.ఎస్.బోస్, టి. శ్రీనివాస్ రావు, కలవేణి శంకర్, ఎన్. బలమల్లేష్, ఏం. బాలనరసింహ, ఈ.టి. నరసింహ, బి. హేమంత్ రావు తదితరులు పాల్గొన్నారు. ఇదిలాఉండగా ఎన్ఎఫ్ఐడబ్ల్యూ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో మంగళవారం మాఖ్దూం‌భవన్ లో నిర్వహించిన సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు.



Next Story

Most Viewed