నాన్ వెజ్ ప్రియులకు శుభవార్త.. త్వరలో ‘కేసీఆర్ మటన్ క్యాంటీన్స్’?

by Disha Web Desk 23 |
నాన్ వెజ్ ప్రియులకు శుభవార్త.. త్వరలో ‘కేసీఆర్ మటన్ క్యాంటీన్స్’?
X

దిశ, వెబ్‌డెస్క్: మీకు మటన్ అంటే ఇష్టమా? హైదరాబాద్‌లో నాణ్యమైన, రుచికరమైన మటన్ కోసం వెతుకుతున్నారా..? అయితే మీకో శుభవార్త. హైదరాబాద్ కేంద్రంగా ఆరోగ్యకరమైన మంసాన్ని అందించేందుకు రంగం సిద్ధం అయింది. త్వరలో తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో నగరంలో మటన్ క్యాంటీన్ ప్రారంభం కాబోతున్నది. తెలంగాణ రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి, సమాఖ్య లిమిటెడ్ ఈ క్యాంటీన్‌ను ప్రారంభించి మటన్ బిర్యానీ, పాయా, పత్తర్ కా ఘోష్ సహా పలు రకాల మటన్ వంటకాలను అందించనుంది. దీనికి ‘కేసీఆర్ మటన్ క్యాంటీన్’గా పేరు పెట్టాలనుకుంటున్నారు. మొదటి మటన్ క్యాంటీన్‌ను మాసాబ్ ట్యాంక్ పరిధి శాంతినగర్ కాలనీలోని ఫెడరేషన్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేయనుంది.

ప్రస్తుతానికి వంటకాల ధరలు ఎంత అన్నది నిశ్చయించలేదు. ఇతర రెస్టారెంట్లతో పోల్చితే తక్కువ ధరలో.. ప్రజలకు అందుబాటులో ఉంటాయని తెలుస్తోంది. ఓ పది రకాల వంటకాలతో క్యాంటీన్లను ప్రారంభించి.. ఆ తర్వాత ప్రజల స్పందన కు అనుగుణంగా మెనూ సంఖ్యను పెంచుతారని సమాచారం. చెంగిచెర్లలో ప్రభుత్వ స్లాటర్ హౌస్ నుంచి తాజా మాంసాన్ని క్యాంటీన్‌కు సరఫరా చేయనున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే అమలవుతున్న ఫిష్ క్యాంటీన్‌లను స్ఫూర్తిగా తీసుకొని మటన్ క్యాంటీన్లను ప్రారంభించనున్నట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్ర మత్స్యకారుల సహకార సొసైటీల సమాఖ్య ఏర్పాటు చేసిన ఫిష్ క్యాంటీన్‌లకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్న విషయం తెలిసిందే. కాగా, మటన్ క్యాంటీన్లు ఇక్కడ సక్సెస్ అయ్యే దాన్ని బట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దశల వారిగా విస్తరించనున్నట్లు తెలుస్తోంది.


Next Story

Most Viewed